త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple | మళ్లీ కార్డ్ పేమెంట్స్.. యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్..

Apple | యాపిల్ భారత్‌లో మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత యాప్ స్టోర్, ఐక్లౌడ్ లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో చెల్లింపులను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 2021లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అమలు చేసిన కార్డ్ టోకెనైజేషన్ నిబంధనల కారణంగా యాపిల్ కార్డ్ పేమెంట్లను నిలిపివేసింది.

S

Technology | Published On Jul 6, 2026, 4.58 pm IST

Apple | మళ్లీ కార్డ్ పేమెంట్స్.. యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్..
Advertisement

Apple | యాపిల్ భారత్‌లో మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత యాప్ స్టోర్, ఐక్లౌడ్ లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో చెల్లింపులను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 2021లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అమలు చేసిన కార్డ్ టోకెనైజేషన్ నిబంధనల కారణంగా యాపిల్ కార్డ్ పేమెంట్లను నిలిపివేసింది. అప్పటి నుంచి యూపీఐ, నెట్ బ్యాంకింగ్, అలాగే ప్రీపెయిడ్ యాపిల్ ఐడీ బ్యాలెన్స్ ద్వారానే కొనుగోళ్లు, సబ్‌స్క్రిప్షన్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆర్‌బీఐ కార్డ్ టోకెనైజేషన్ నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థను సిద్ధం చేసిన తర్వాత యాపిల్ మళ్లీ క్రెడిట్, డెబిట్ కార్డ్ పేమెంట్ ఆప్షన్‌ను భారత్‌లో ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో వినియోగదారులతో పరీక్షిస్తున్నప్పటికీ, రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే పలువురు యూజర్ల యాపిల్ అకౌంట్లలో కొత్త పేమెంట్ ఆప్షన్లు కనిపిస్తున్నాయి.

ఆర్‌బీఐ నియ‌మాల‌కు అనుగుణంగా..

ఈ మార్పుతో వినియోగదారులు తమ సపోర్ట్ ఉన్న క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను యాపిల్ అకౌంట్‌కు జోడించి యాప్ స్టోర్ కొనుగోళ్లు, ఇన్-యాప్ ట్రాన్సాక్షన్లు, యాపిల్ మ్యూజిక్, ఐక్లౌడ్ ప్లస్, అలాగే ఇతర యాపిల్ సేవలకు నేరుగా చెల్లింపులు చేయవచ్చు. ఇంతకుముందు వీటికి యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. 2021లో ఆర్‌బీఐ కార్డ్ టోకెనైజేషన్ నిబంధనలు అమల్లోకి రావడంతో వ్యాపార సంస్థలు వినియోగదారుల అసలు కార్డ్ వివరాలను తమ సర్వర్లలో నిల్వ చేయడాన్ని నిషేధించారు. దానికి బదులుగా ప్రతి కార్డ్‌కు ప్రత్యేకమైన టోకెన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల కారణంగానే యాపిల్ అప్పట్లో భారత్‌లో కార్డ్ పేమెంట్లను నిలిపివేసింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం టోకెనైజ్ చేసిన కార్డ్ సమాచారాన్ని కేవలం అనుమతించిన కార్డ్ నెట్‌వర్క్‌లే నిల్వ చేయాలి. అలాగే ఆ డేటా భారత్‌లోనే భద్రపరచాలి. ఇతర దేశాల్లో యాపిల్ టోకెనైజ్ చేసిన చెల్లింపు సమాచారాన్ని అమెరికా, డెన్మార్క్, చైనాలోని తన సర్వర్లలో నిల్వ చేస్తుందని సమాచారం. అయితే భారత్ కోసం ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

యాపిల్ పే ఎప్పుడు..

కార్డ్ పేమెంట్లు తిరిగి అందుబాటులోకి వచ్చినప్పటికీ, యాపిల్ పే సేవను భారత్‌లో ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. గతంలో వచ్చిన నివేదికల ప్రకారం, బ్యాంకులతో కమిషన్ ఆదాయ పంపకాలపై చర్చలు కొనసాగుతుండటంతో యాపిల్ పే ప్రారంభం ఆలస్యమవుతోంది. లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ వాటా కావాలని బ్యాంకులు కోరుతున్నందున చర్చలు నెమ్మదిగా సాగుతున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement