త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Etala Rajendar | మిస్ట‌ర్ రేవంత్‌, పొంగులేటి! 22ఏ లో పెట్టే అధికారం మీకెవ‌డిచ్చాడు?

MP Etala Rajendar | 22ఏ తో ప్రజల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదని శపథం చేస్తున్నామ‌ని.. రేవంత్‌కు కేసీఆర్ కంటే దుర్మార్గ‌మైన గ‌తి ప‌డుతుంద‌ని మేడ్చ‌ల్‌-మ‌ల్కాజిగి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఫైర‌య్యారు. త‌మ భూముల‌ను 22ఏ లో పెట్టే అధికారం రేవంత్‌, పొంగులేటికి ఎవ‌డిచ్చాడ‌ని ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Sep 5, 2026, 4.48 pm IST

MP Etala Rajendar | మిస్ట‌ర్ రేవంత్‌, పొంగులేటి! 22ఏ లో పెట్టే అధికారం మీకెవ‌డిచ్చాడు?
Advertisement
  • శ‌ప‌థం చేస్తున్నాం.. రేవంత్‌ను గ‌ద్దె దించేదాకా వ‌ద‌లం
  • కేసీఆర్ కంటే నీకు దుర్మార్గమైన గతి పడుత‌ది
  • రక్తం చిందించైనా కాంగ్రెస్‌ ప్రభుత్వ దుర్మార్గాలను అడ్డుకుంటాం
  • మిస్ట‌ర్ రంగానాథ్‌.. పేద‌ల జోలికొస్తే నిన్నూ వ‌ద‌లం
  • ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎస్ బాస్ అని పనిచేస్తే జైళ్లకు పంపుతాం
  • ప్రజల జీతాలతో పని చేసే మమ్మల్ని అడ్డుకుంటే పోలీసుల మీదా కేసులు పెడతాం
  • ఈడీ, సీబీఐ సంస్థలకు ఫిర్యాదు చేసైనా దీన్ని ఆపుతాం
  • ఇందిరాపార్క్ మ‌హాదీక్ష‌లో బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ రుస‌రుస

MP Etala Rajendar | త్రినేత్ర‌.న్యూస్‌: 22ఏ తో ప్రజల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదని శపథం చేస్తున్నామ‌ని.. రేవంత్‌కు కేసీఆర్ కంటే దుర్మార్గ‌మైన గ‌తి ప‌డుతుంద‌ని మేడ్చ‌ల్‌-మ‌ల్కాజిగి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఫైర‌య్యారు. త‌మ భూముల‌ను 22ఏ లో పెట్టే అధికారం రేవంత్‌, పొంగులేటికి ఎవ‌డిచ్చాడ‌ని ప్ర‌శ్నించారు. ర‌క్తం చిందించైనా కాంగ్రెస్ ప్ర‌భుత్వ దుర్మార్గాల‌ను అడ్డుకుంటామ‌ని తేల్చి చెప్పారు. హైడ్రా రంగ‌నాథ్‌పై మాకేం కోపం లేద‌ని.. కానీ పేద‌ల జోలికొస్తే మాత్రం ఆయ‌న్ని కూడా వ‌ద‌ల‌మ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జ‌ల జీతాల‌తో ప‌నిచేసే త‌మ‌ను అడ్డుకుంటే పోలీసుల మీద కూడా కేసులు పెడ‌తామ‌న్నారు. సోనియా, రాహుల్ గాంధీల‌కు రేవంత్‌రెడ్డి నెల‌కు 400 కోట్ల రూపాయ‌లు పంపిస్తున్నార‌ని ఆరోపించారు. శ‌నివారం 22 ఏ బాధితులకు అండగా ఇందిరాపార్క్ వ‌ద్ద నిర్వ‌హించిన మ‌హాదీక్ష‌లో ఆయ‌న మాట్లాడుతూ.. రేవంత్ ప్ర‌భుత్వంపై రుస‌రుస‌లాడారు.

ఎక్కువ వేద‌న అనుభ‌విస్తుంది మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్ర‌జ‌లే..

మిస్టర్ రేవంత్ రెడ్డి, మిస్టర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. మా భూములు 22ఏ లో పెట్టే అధికారం మీకు ఎవడిచ్చాడు. ఈరోజు కుత్బుల్లాపూర్ గిరినగర్లో పేదల ఇళ్లను కూలుస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్‌ను గద్దె దించేవరకు విశ్రమించేది లేదని శపథం చేస్తున్నాం. 22ఏ వల్ల ఎక్కువ వేదన అనుభవిస్తుంది మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు. 22 ఏ బాధితులు స్వచ్ఛందంగా బస్సులు కట్టుకొని మరీ వచ్చారు.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులారా "ఎస్ బాస్" అని పని చేస్తే జైళ్ళపాలవుతారని హెచ్చరిస్తున్నాం. వారి ఆదేశాలతో ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టిన వారిని వదిలిపెట్టేది లేదు. శ్రీలక్ష్మి, ఆచార్యలకు పట్టిన గతి మీకు పట్టకుండా చూసుకోండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చామని మర్చిపోకండి. మూసీ పక్కన ఇళ్లను కూలుస్తామంటూ ఫణిగిరి కాలనీకి దానకిషోర్ అనే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి వందల మంది అధికారులను, పోలీసులను, బుల్డోజర్లను తీసుకొని వచ్చిండు. 5 నుంచి 10 కోట్ల విలువైన అపార్ట్మెంట్లును కూలుస్తా అంటే ఎవడబ్బ జాగీరు అని రెండు రోజుల పాటు ఎర్రటి ఎండలో కూర్చొని కాపాడుకోగలిగినం.

లక్షల మందిని చంపిన నియంత హిట్లర్‌ను క్రూరుడు అని ప్రపంచం గుర్తు పెట్టుకుంటే, అలాంటి దుర్మార్గ పాలన అందించేది రేవంత్ అని చరిత్రలో గుర్తు పెట్టుకుంటారు. పొంగులేటి 22ఏ నిషేధిత జాబితాలో మా అధికారులు పెట్టొచ్చు అని మాట్లాడుతున్నాడు. ఈ జీవో ఇచ్చింది మీరు కాదా? CCLA 22ఏ గురించి గ‌తేడాది సెప్టెంబ‌ర్‌ 11న కలెక్టర్లకు లేఖ రాసింది. మేడ్చల్ కలెక్టర్ గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 22న‌ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కి లేఖ రాస్తే.. అదే ఏడాది డిసెంబ‌ర్ 2న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు సర్క్యులర్ ఇచ్చారు. ఇది మీ అందరికీ పంపిస్తా. నంగనాచి మాటలు మాట్లాడుతున్న మంత్రులారా కబర్దార్ అని హెచ్చరిస్తున్నా. అనాలోచితం కాదిది.. బ్లాక్ మెయిలింగ్ వెపన్‌గా వాడుకునేందుకు తెచ్చిన జీవో ఇది.

న‌ర్సాపూర్‌లో 55 వేల మంది బాధితులు..

రాహుల్, సోనియాలకు నెలకు 400 కోట్ల రూపాయలు పంపించేందుకు చేసిన దుర్మార్గ కుట్ర ఈ ఆలోచన. కొన్ని దరఖాస్తులు మాత్రమే వచ్చాయి అని మంత్రి చెప్తున్నారు.. ఒక్క నర్సాపూర్‌లో 55 వేల మంది రైతుల భూములను ఈ జాబితాలో పెట్టారంటే ఎంత గంభీరమైన సమస్య అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ కుట్రతో తెచ్చిన ధరణితో.. కాస్తు కాలం, కబ్జా కాలం ఎగిరిపోయింది. పేదల భూములు ప్రభుత్వ భూములయ్యాయి. ఐదారు తరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్న లక్షల ఎకరాల భూముల అడ్రస్ గల్లంతు అయ్యింది.

సిగ‌రేట్ ముక్క‌ల మీద రాసిచ్చారు..

సిగ‌రేట్ ముక్కల మీద లక్షల ఎకరాల భూములు దొరలు పేదలకు రాసిచ్చారు. ఆ భూములకు రిజిస్ట్రేషన్ లేదు. కాస్తుకాలంలో పేరు ఉండేది. కేసీఆర్ ఆ హక్కు లేకుండా చేశారు. రేవంత్ ఇంకో అడుగు ముందుకు వేసి మాదిగల భూములు లాక్కుంటున్నారు. మమ్ముల్ని ఈ భూమిలో బొంద పెట్టండి తప్ప మేం ఇక్కడ నుంచి పోయేది లేదని వారంటున్నారు.

బహదూర్ గూడ 659 ఎకరాలలో క్వాలిటీ గులాబీలు పండిస్తారు. ఆ భూములు లాక్కుంటా అని పోతే మహిళలు కారంపొడి పట్టుకొని ఎదురుతిరిగారు. ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న మహేంద్రహిల్స్ ను కూడా ఈ జాబితాలో చేర్చిన నీచమైన ప్రభుత్వం ఇది.

మిస్టర్ రంగనాథ్..

నేను నీ మీద పడలేదు.. నువ్వు మా పేదల మీద పడ్డావు. మా పేదల ఇల్లు కూలుస్తున్నావు. బీజేపీ పోరాటం చేసి అనేకమంది పేదలకు ఇల్లు కట్టించింది. వాజపేయి నగర్, దత్తాత్రేయ నగర్, భగత్ సింగ్ నగర్ లాంటి అనేక బస్తీలకు జన్మనిచ్చిన పార్టీ బీజేపీ. ఆ ప్రభుత్వం వందల కేసులు పెట్టింది. ఇంకా వెయ్యి కేసులు పెట్టినా రేవంత్ రెడ్డిను భరతం పట్టడం ఖాయం. రంగనాథ్ నీ మీద నాకు వ్యక్తిగతంగా ఏ కోపం లేదు. పేదల జోలికి వస్తే మాత్రం వదిలేదు లేదు.

ఆ అమ్మ‌ల శాపం నీకు త‌గుల్త‌ది..

గాజుల రామారంలో 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ వడ్డెరలు 4 ఎకరాలలో గుడిసెలు వేసుకుని 80 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. రాళ్ళు కొట్టుకొని బ‌తికిన వాళ్ళు. అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలని హైడ్రా వచ్చి వేసుకున్న బోర్లు పీకేశారు, కరెంట్ తీసేశారు. ఆ శిథిలాల మీద బిక్కుబిక్కుమంటూ పిల్లలు కూర్చుని అమ్మ అన్నం పెట్టు అని అడుగుతుంటే పెట్టలేక బాధపడిన ఆ అమ్మల శాపం నీకు తగలక మానదు. పైగా మరుసటి రోజు పది వేల కోట్ల భూమిని కాపాడిన.. అని రంగనాథ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

అస్మత్ పేటలో.. బోయినపల్లి మార్కెట్లో పని చేసేవారు 60 గజాలు కొనుక్కున్నారు. అమ్మిన వారిని అనుమతి ఇచ్చిన అధికారులను అరెస్ట్ చేసే దమ్ములేదు కానీ అక్కడికి ఎంపీ పోతా అంటే పోనివ్వలేదు. ప్రజల జీతాలతో పని చేసే మమ్ముల్ని అడ్డుకుంటే పోలీసుల మీద కూడా కేసులు పెడతాం. 22ఏ ను కాదు మా భూములను నిషేధిత జాబితా నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తున్న. నా పార్లమెంట్ పరిధిలో కూకట్‌ప‌ల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన 20 వేల కోట్ల భూములు, ఐడీపీఎల్‌కు చెందిన 12 వేల కోట్ల భూములు (ఫీనిక్స్) కేసీఆర్ అప్పగిస్తే, రేవంత్ కొనసాగిస్తున్నారు. ముక్క అమ్మితే విద్యార్థులకు డబ్బులు ఇస్తా అన్న రేవంత్ ఎందుకు ఆ భూములు వెనక్కు తీసుకోవడం లేదు. మహాత్మాగాంధీ నగర్ పక్కన 176 ఎకరాల కాలనీ కేసీఆర్ బ్రోకర్స్ కి కట్టబెట్టారు.

భుములు కొన్నోళ్లనూ వ‌ద‌లం..

అమ్ముడు దుకాణం ఇప్పుడు కూడా నడుస్తుంది. రాత్రికి రాత్రి భూభారతిలో మార్పులు చేస్తున్నారు. పుప్పాలగూడలో 134 ఎకరాల, 17 వేల కోట్ల భూమినీ మార్చేశారు. ఆ భూములు కొనుక్కున్న వారిని కూడా వదిలిపెట్టేది లేదు. దుర్మార్గపు బీఆర్ఎస్ మళ్ళీ రాదు. కాంగ్రెస్ పాతాళానికి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయేది బీజేపీనే. ధర్మ పాలన కోసం, తెలంగాణ అప్పులు పోవడం కోసం బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రక్తం చిందించైనా ఈ ప్రభుత్వ దుర్మార్గాలను అడ్డుకుంటాం. బాధితులారా ఈడీ, సీబీఐ సంస్థలకు ఫిర్యాదు చేసైనా మీ ఆవేదన ఆగేలా చేస్తాం అని ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ భ‌రోసా క‌ల్పించారు.

Advertisement
Advertisement