త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | పేప‌ర్ లీక్ బిల్లు వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు : ఖ‌ర్గే

Mallikarjun Kharge | యాంటీ పేప‌ర్ లీక్ బిల్లు (anti paper leak bill) వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. కేవ‌లం జ‌రిమానాలు, శిక్ష‌ల‌ను పెంచ‌డం, ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్స్‌లు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా లీకేజీల‌ను నివారించ‌లేమ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈ బిల్లుపై రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా ఖ‌ర్గే మాట్లాడారు.

D

National | Published On Jul 30, 2026, 5.21 pm IST

Mallikarjun Kharge | పేప‌ర్ లీక్ బిల్లు వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు : ఖ‌ర్గే
Advertisement

Mallikarjun Kharge | త్రినేత్ర‌.న్యూస్ : రాజ్య‌స‌భ (Rajya Sabha)లో యాంటీ పేప‌ర్ లీక్ బిల్లు (anti paper leak bill )పై అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. చ‌ర్చ సందర్భంగా యూపీఏ ప్ర‌భుత్వం అసంపూర్తిగా వ‌దిలేసిన ప‌నుల‌ను ప్ర‌స్తుత ప్ర‌భుత్వ‌మే పూర్తి చేయాల్సి వ‌చ్చింద‌ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కేంద్ర మంత్రి వ్యాఖ్య‌ల‌ను ప్ర‌తిప‌క్ష‌నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) తిప్పి కొట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయాలకే మోదీ ప్రభుత్వం అధిక‌ ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు.

అమిత్‌ షా రాజీనామా చేయాలి

ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌పై జ‌రిగిన పోలీసుల చ‌ర్య‌ను ఖ‌ర్గే తీవ్రంగా ఖండించారు. పోలీసుల క్రూర‌త్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స‌భ‌కు వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఈ అణ‌చివేత‌పై ఆయ‌న ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్ర‌శ్నించారు. విద్యార్థుల‌పై పోలీసుల దౌర్జ‌న్యంపై వివ‌ర‌ణ ఇవ్వ‌లేని ప‌క్షంలో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిందేన‌ని ఖ‌ర్గే డిమాండ్ చేశారు. "అధికారాన్ని కోల్పోతామనే భయంతోనే ప్రభుత్వం విద్యార్థుల‌ డిమాండ్లకు తలొగ్గింది. వారి సమస్యలను నిజాయితీగా పరిష్కరించడం కంటే.. తమ పదవులను కాపాడుకోవడానికే ఈ ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త ఇచ్చింది" అని ఖర్గే ఆరోపించారు.

ఈ బిల్లు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందా..?

2024లోనే ఈ బిల్లు ఎందుకు తీసుకురాలేదని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ప్ర‌ధాని మోదీ హ‌యాంలో పేప‌ర్ లీక్‌ల వ‌ల్ల 1.25 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని ఖ‌ర్గే ఆరోపించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక వేదనకు పేపర్ లీక్‌లు కూడా కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన పేప‌ర్ లీక్ బిల్లును ఖ‌ర్గే తీవ్రంగా విమ‌ర్శించారు. ఈ బిల్లు వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని వ్యాఖ్యానించారు. కేవ‌లం జ‌రిమానాలు, శిక్ష‌ల‌ను పెంచ‌డం, ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్స్‌లు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా లీకేజీల‌ను నివారించ‌లేమ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. పేపర్‌ లీకేజీలు జరిగిన తర్వాత నష్టనివారణ చర్యలు తీసుకోవడం ఒక్కటే సరిపోదని ఖర్గే తెలిపారు. అలాంటి ఘటనలు భ‌విష్య‌త్తులో పున‌రావృతం కాకుండా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బిల్లు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందా..? అన్న సందేహాన్ని ఖ‌ర్గే వ్యక్తం చేశారు.

Also Read..

వందేమాత‌రం బిల్లుకు పార్ల‌మెంట్ ఓకే

రైతుల నిర‌స‌న‌కు త‌లొగ్గిన ప్ర‌భుత్వం.. ఆ పంట‌ సేకరణ పరిమితిని 25% నుంచి 60%కి పెంపు

కేవైసీ పేరుతో మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ అవుతుంది జాగ్ర‌త్త‌..!

Advertisement
Advertisement