త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjay Jaju | పేరు సంజ‌య్ జాజు.. రాష్ట్రానికే సీఎస్‌.. అయినా అధికారిక నివాసం ఇస్త‌లేర‌ట‌

Sanjay Jaju | సాక్షాత్తు ఆయ‌న తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. పేరు సంజ‌య్ జాజు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వ‌చ్చిన ఈ బ్యూరోక్రాట్ ఉండ‌డానికి హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇల్లు దొర‌క‌డం లేద‌ట‌. విన‌డానికి వింత‌గా ఉన్నా నిజంగా ఇదే నిజం. ఈ చీఫ్ సెక్రటరీకి కేటాయించాల్సిన అధికారిక నివాసంలో ఓ మంత్రి పాగా వేయడం వల్ల క్వార్టర్ కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తోందట.

S

Telangana | Published On Jul 30, 2026, 8.15 pm IST

Sanjay Jaju | పేరు సంజ‌య్ జాజు.. రాష్ట్రానికే సీఎస్‌.. అయినా అధికారిక నివాసం ఇస్త‌లేర‌ట‌
Advertisement
  • ఈ బ్యూరోక్రాట్‌ అధికారిక నివాసంలో ఓ మంత్రి పాగా వేశార‌ట‌
  • క్వార్ట‌ర్స్ కోసం నానా అగ‌చాట్లు ప‌డుతున్న సీఎస్‌
  • గ‌త్యంత‌రం లేక‌ దిల్కుష గెస్ట్ హౌజ్‌లో బస
  • అయినా ప‌ట్టించుకోని పాల‌కులు

Sanjay Jaju |  త్రినేత్ర‌.న్యూస్‌: సాక్షాత్తు ఆయ‌న తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. పేరు సంజ‌య్ జాజు. రాష్ట్రంలోనే నంబ‌ర్ వ‌న్ అధికారి. ప‌రిపాల‌న మొత్తం ఆయ‌న చేతుల నుంచే న‌డుస్త‌ది. ముఖ్య‌మంత్రి ఏం చేయాల‌న్నా ఆయ‌న సూచ‌న‌ల మేర‌కే పాల‌న‌ను కొన‌సాగిస్తారు. రాష్ట్ర‌మేదైనా స‌క‌ల సౌక‌ర్యాల‌తో క్వార్ట‌ర్స్ కేటాయిస్తారు. కానీ తెలంగాణ సీఎస్ ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వ‌చ్చిన ఈ బ్యూరోక్రాట్ ఉండ‌డానికి హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇల్లు దొర‌క‌డం లేద‌ట‌. విన‌డానికి వింత‌గా ఉన్నా నిజంగా ఇదే నిజం. ఈ చీఫ్ సెక్రటరీకి కేటాయించాల్సిన అధికారిక నివాసంలో ఓ మంత్రి పాగా వేయడం వల్ల క్వార్టర్ కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తున్నది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన‌ సంజయ్ జాజుకు హైదరాబాదులో నిలువ నీడ లేకుండా పోయింది. సీఎస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి నెల రోజులు కావస్తున్నా ఆయనకు వసతి కల్పించడంలో పాలకులు విఫలం అవడం విమర్శలకు తావిస్తోంది.

కుంద‌న్‌బాగ్ అధికారిక నివాసం..

ఇక హైదరాబాదు బేగంపేటలోని కుందన్ బాగ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోసం ప్రత్యేకించి ఒక అధికారిక నివాసం ఉంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రాజీవ్ శర్మ అందులోనే బస చేశారు. ఆ తరవాత చీఫ్ సెక్రటరీలుగా పని చేసిన ఎస్పీ సింగ్, ఎస్కే జోషీలు కూడా అదే క్వార్టర్లో ఉన్నారు. కానీ, ఆ తర్వాత సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సోమేష్ కుమార్ ఆ అధికారిక నివాసానికి తన మకాం మార్చలేదు. రాజేంద్రనగర్ లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అధికారిణిగా ఉన్న ఆయన సతీమణి సౌకర్యం కోసం సోమేష్ కుమార్, ఆ పక్కనే అత్తాపూర్‌లో ఉన్న తన సొంత ఇంటి నుంచే సచివాలయానికి రాకపోకలు సాగించారు. ఇక, ఆయన తరవాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన శాంతికుమారి సైతం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70 లోని ప్రశాసన్ నగర్లో ఉన్న తన స్వగృహాన్నే అధికారిక నివాసంగా వాడారు. ఆమె తరవాత చీఫ్ సెక్రటరీ ఐన రామకృష్ణారావు కథ వేరే! ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తునే ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు. పీఎఫ్ఎస్ గా ఆయనపై ఉన్న ఒత్తిడిని తట్టుకోలేక, సచివాలయానికి ప్రత్యామ్నాయంగా సీజీజీలోని తన కార్యాలయం నుంచే ఆయన విధులు నిర్వర్తించే వారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న సీజీజీ క్వార్టర్‌ను ఆయన తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు.

ఒకళ్లకు ముగ్గురు సీఎస్‌లు కుందన్ బాగ్‌లోని అధికారిక నివాసాన్ని వాడకపోవడంతో అది చాలా ఏళ్లు ఖాళీగానే ఉండిపోయింది. ఈక్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఇరిగేషన్, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తం కుమార్ రెడ్డి ఆ నివాసాన్ని తనకు కేటాయించాల్సిందిగా కోరడం, ఆమేరకు ఆ క్వార్టర్ ఆయనకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడటం టకటకా జరిగిపోయాయి. ఐతే, మంత్రుల కోసం బంజారాహిల్స్ లో సౌకర్యవంతమైన నివాస సముదాయం ఉండగా ఉత్తం కుమార్ రెడ్డి కుందన్ బాగ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల కోసం కేటాయించే నివాసాన్ని అడగటం, ఆ వెంటనే దాన్ని ఆయనకు ఇచ్చేయడం ఇక్కడ వివాదాస్పదంగా మారింది. ఎప్పటికైనా ఆ క్వార్టర్ ను చీఫ్ సెక్రటరీకి కేటాయించాల్సి ఉంటుంది అని మరచిన ఆర్ అండ్ బీ అధికారులు దాన్ని గుడ్డిగా ఒక మంత్రికి కేటాయించడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒకవేళ అప్పటి పరిస్థితుల రీత్యా అలా నిర్ణయం చేసినా, ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రానికి వచ్చిన సంజయ్ జాజు కోసం మంత్రి దాన్ని ఖాళీ చేసి ఆయనకు అప్పగించి ఉండాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తం ఔతున్నాయి. చీఫ్ సెక్రటరీ క్వార్టర్లో మంత్రి పాగా వేయడంతో పోనీ, వేరొక ఇద్దాం అన్నా అక్కడ స్కోప్ లేని దుస్థితి. ఉమ్మడి రాజధాని హైదరాబాదు కుందన్ బాగ్ లో మొత్తం 84 నివాసాలు ఉంటే, రాష్ట్ర విభజన సమయంలో 44 క్వార్టర్లను ఏపీకి కేటాయించారు. కాగా, రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచిపోయింది. హైదరాబాదు ఉమ్మడి రాజధాని హోదా కూడా తొలగిపోయింది. ఇంకా ఆ నివాసాలలో ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులే పాగా వేసి ఉండటం గమనార్హం. ఆ 44 క్వార్టర్స్ లో ప్రస్తుతం 10 ఖాళీగానే ఉన్నాయి. కానీ, వాటిని తెలంగాణాకు అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ససేమిరా అంటోందని వినికిడి. ఏది ఏమైనా స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉండటానికి కనీసం ఒక ఇల్లు లేకపోవడం విడ్డూర‌మే క‌దా!

Advertisement
Advertisement