త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Vijay | కొత్త కారు, ఖ‌ర్చుల కోసం నెల‌కు రూ.ల‌క్ష.. ఎమ్మెల్యేల‌పై సీఎం విజ‌య్ వ‌రాల జ‌ల్లు

CM Vijay | ఎమ్మెల్యేల‌పై (Tamil Nadu MLAs) ముఖ్య‌మంత్రి విజ‌య్ (CM Vijay) వ‌రాల జ‌ల్లు కురిపించారు. శాస‌న‌స‌భ్యులంద‌రికీ కొత్త కార్లు ఇవ్వ‌నున్న‌ట్లు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు, డ్రైవ‌ర్ జీతం, పెట్రోల్‌, డీజిల్ వంటి ఇత‌ర ఖ‌ర్చుల కోసం నెల‌కు రూ.75 వేల ప్ర‌త్యేక అల‌వెన్స్‌ను అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు ఆరోగ్య బీమాను కూడా రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ. 25 లక్షలకు పెంచుతున్న‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు.

D

National | Published On Aug 19, 2026, 12.14 pm IST

CM Vijay | కొత్త కారు, ఖ‌ర్చుల కోసం నెల‌కు రూ.ల‌క్ష.. ఎమ్మెల్యేల‌పై సీఎం విజ‌య్ వ‌రాల జ‌ల్లు
Advertisement

CM Vijay | త్రినేత్ర‌.న్యూస్ : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ (CM Vijay) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఎమ్మెల్యేల‌పై (Tamil Nadu MLAs) వ‌రాల జ‌ల్లు కురిపించారు. శాస‌న‌స‌భ్యులంద‌రికీ కొత్త కార్లు ఇవ్వ‌నున్న‌ట్లు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎమ్మెల్యేలు తమ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీఎం తెలిపారు.

డ్రైవ‌ర్, అసిస్టెంట్ జీతాలు

త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ‌లో సీఎం విజ‌య్ మాట్లాడుతూ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ఎమ్మెల్యేలు క్ర‌మం త‌ప్ప‌కుండా త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించాల్సి ఉంటుంద‌ని చెప్పారు. అందుకే ఎమ్మెల్యేల ప్ర‌యాణాల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప్ర‌భుత్వ‌మే వారికి కార్ల‌ను స‌మ‌కూరుస్తుంద‌ని తెలిపారు. కార్లు మాత్ర‌మే కాకుండా డ్రైవ‌ర్ జీతం, పెట్రోల్‌, డీజిల్ వంటి ఇత‌ర ఖ‌ర్చుల కోసం నెల‌కు రూ.75,000 అందిస్తామ‌ని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే కార్యాల‌యంలో అసిస్టెంట్‌ను నియ‌మించుకోవ‌డానికి నెల‌కు రూ.25,000 అద‌నంగా ప్ర‌భుత్వ‌మే అందిస్తుంద‌ని వెల్ల‌డించారు.

ఎమ్మెల్యేల‌కు త‌గిన ర‌వాణా సౌక‌ర్యాలు లేక‌పోవ‌డంతో స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయ‌లేక‌పోతున్నారని వారికి కార్లు కేటాయించాలంటూ వీకేసీ ఎమ్మెల్యే జోతిమ‌ణి (VCK MLA Jothimani) సీఎం ముందు త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. మున్సిప‌ల్‌, యూనియ‌న్ చైర్‌ప‌ర్స‌న్‌లు, మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్‌ల‌కు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వాహ‌నాల‌ను స‌మ‌కూరుస్తోంద‌ని చెప్పారు. కానీ ఎమ్మెల్యేల‌కు మాత్రం ఆ సౌక‌ర్యం ల‌భించ‌డం లేద‌ని జోతిమ‌ణి అసెంబ్లీ వేదిక‌గా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అధికారిక వాహ‌నాలు లేక‌పోవ‌డం వ‌ల్ల ముఖ్య‌మైన సంద‌ర్భాల్లో శాస‌న‌స‌భ్యులు రాక‌పోక‌ల‌కు ఆటంకం క‌లుగుతోంద‌ని తెలిపారు. స్పందించిన సీఎం విజ‌య్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. సీఎం నిర్ణ‌యంతో ఎమ్మెల్యేలంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఆరోగ్య బీమా పరిమితి పెంపు

ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం (CMCHIS) కింద కుటుంబాల‌కు అందించే బీమాను రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచుతున్న‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు. ఆదాయం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్ర‌తీ ఒక్క‌రికీ నాణ్య‌మైన వైద్య సేవ‌ల‌ను అందించ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ముఖ్య ఉద్దేశ‌మ‌ని విజ‌య్ ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాదు, చెన్నై స్టాన్లీ, తిరునెల్వేలి, తూత్తుకుడి, చెంగ‌ల్ప‌ట్టు, తిరువారూర్‌, క‌రూర్‌, క‌న్యాకుమారి ప్రాంతాల్లోని ఆసుప‌త్రుల్లో ఈ ప‌థ‌కం కింద ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు అద‌న‌పు వైద్య‌, శ‌స్త్ర‌చికిత్స సేవ‌ల‌ను అందించ‌నున్న‌ట్లు తెలిపారు.

వైద్య విద్య కోసం రూ. 351 కోట్లు కేటాయింపు

ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల్లో విద్యార్థుల ప్ర‌వేశ సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు అద‌నంగా రూ.351 కోట్ల‌ను ప్ర‌భుత్వం కేటాయించింది. రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు అవసరమైన సిబ్బందిని తయారు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులను తీర్చిదిద్దేందుకు మొత్తం 6,098 అదనపు సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిలో 660 బీఎస్సీ నర్సింగ్ సీట్లు, నర్సింగ్ కళాశాలలు, పాఠశాలల్లో 1,925 అదనపు సీట్లు, 12 పారామెడికల్ కోర్సుల్లో మొత్తం 2,778 సీట్లు, వైద్య కోర్సుల్లో 735 అదనపు సీట్లు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఏడు కొత్త ప్ర‌భుత్వ న‌ర్సింగ్ క‌ళాశాల‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

పెరంబ‌లూరులో 400 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి

పెరంబలూరులో సుమారు రూ. 300 కోట్ల వ్యయంతో 400 పడకల సామర్థ్యం కలిగిన అత్యాధునిక మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్న‌ట్లు సీఎం విజ‌య్ ఈ సందర్భంగా ప్ర‌క‌టించారు.

మూడో ప్రసవానికి ఏడాది సెలవు

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొత్తం జనాభా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విజ‌య్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వ మ‌హిళా ఉద్యోగుల మెట‌ర్నిటీ సెల‌వుల‌ను ప్ర‌భుత్వం పెంచింది. మూడో బిడ్డ కోసం ప్ర‌స్తుతం ఇస్తున్న 12 వారాల సెల‌వుల‌ను ఏడాదికి పెంచుతూ టీవీకే స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యంతో ఫ‌స్ట్‌, సెకండ్ చైల్డ్‌తోపాటూ మూడో బిడ్డ‌కు కూడా మ‌హిళా ఉద్యోగులు ఏడాదిపాటూ ఫుల్ శాల‌రీతో కూడిన లీవ్స్ పొంద‌నున్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణను ఆదర్శవంతంగా అమలు చేసి దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిన తమిళనాడు.. ఇప్పుడు బ‌ర్త్‌రేట్‌ను పెంచే ల‌క్ష్యంతో ముందుకు సాగుతోంది.

Also Read..

క‌శ్మీర్‌లోకి 10,000 మంది ఉగ్ర‌వాదులు..!

బెట్టింగ్‌ యాప్‌ల ప్ర‌చారం.. నేడు ఈడీ ముందుకు రాజా సాబ్ హీరోయిన్‌

ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్లు బంద్‌

Advertisement
Advertisement