త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GSLV F17 mission | మ‌రో ఆరు ప్ర‌యోగాలే ల‌క్ష్యం.. GSLV-F17 ప్రయోగం విజ‌య‌వంతం వేళ గ‌గ‌న్‌యాన్ అప్‌డేట్ ఇచ్చిన ఇస్రో ఛైర్మ‌న్‌

GSLV F17 mission | జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 (GSLV F17 mission) ప్రయోగం స‌క్సెస్‌తో ఫుల్ సంతోషంగా ఉన్న ఇస్రో చీఫ్ వి. నారాయణన్ (ISRO chief V Narayanan) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఆరు ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా ఇస్రో (ISRO) చేపట్టబోయే ప్రతిష్టాత్మక 'గగన్‌యాన్' (Gaganyaan) తొలి మానవరహిత ప్రయోగంపై కూడా ఇస్రో ఛైర్మ‌న్ అప్‌డేట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప‌నులు చురుగ్గా సాగుతున్న‌ట్లు చెప్పారు.

D

National | Published On Sep 4, 2026, 12.07 pm IST

GSLV F17 mission | మ‌రో ఆరు ప్ర‌యోగాలే ల‌క్ష్యం.. GSLV-F17 ప్రయోగం విజ‌య‌వంతం వేళ గ‌గ‌న్‌యాన్ అప్‌డేట్ ఇచ్చిన ఇస్రో ఛైర్మ‌న్‌
Advertisement

GSLV F17 mission | త్రినేత్ర‌.న్యూస్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేప‌ట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగం విజ‌య‌వంత‌మ‌వ‌డంపై దేశ వ్యాప్తంగా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇస్రో సాధించిన ఈ చారిత్రాత్మ‌క‌మైన విజ‌యంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) సైతం అభినంద‌న‌లు తెలియ‌జేశారు. మిష‌న్ విజ‌య‌వంతం కావ‌డం దేశానికే గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చెప్పుకొచ్చారు.

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగం స‌క్సెస్ ప‌ట్ల‌ ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ వి. నారాయణన్ (ISRO chief V Narayanan) ఆనందం వ్య‌క్తం చేశారు. ఇది భారత అంతరిక్ష కార్యక్రమంలో చారిత్రక విజ‌యంగా అభివ‌ర్ణించారు. ప్ర‌యోగం అనంత‌రం శ్రీ‌హ‌రికోట‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఇస్రో ఛైర్మ‌న్ మాట్లాడుతూ.. భారతదేశానికి ఇది అత్యంత కీలకమైన మిషన్‌ అని చెప్పారు. భూ ప‌రిశీల‌న కోసం జియోసింక్రోన‌స్ క‌క్ష్య‌లో ఓ ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్ శాటిలైట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ఇదే మొద‌టిసారి అని వెల్ల‌డించారు. దేశంతో పాటు సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

జీవిత‌కాలం ఏడేళ్లే.. అయినా,

ఈ ఉపగ్రహం కనీస జీవితకాలం ఏడేళ్లే అయినప్పటికీ.. తొమ్మిదేళ్ల పాటు ఇది సేవలు అందిస్తుందన్న పూర్తి విశ్వాసం త‌మ‌కు ఉందని నారాయణన్ ధీమా వ్యక్తం చేశారు. భూ పరిశీలన అవసరాల కోసం 36,000 కి.మీ దూరంలోని జియో-సింక్రోనస్ కక్ష్యలోకి పంపిన తొలి ఉపగ్రహం ఇదేనని, జీఎస్‌ఎల్‌వీ వెహికల్ ద్వారా అంతరిక్షంలోకి పంపిన అత్యంత బరువైన శాటిలైట్ కూడా ఇదేనని తెలిపారు. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండో విజయవంతమైన ప్రయోగమని ఆయ‌న చెప్పుకొచ్చారు.

గగన్‌యాన్‌పై అప్‌డేట్‌

ఈ సంద‌ర్భంగా ఇస్రో (ISRO) చేపట్టబోయే ప్రతిష్టాత్మక 'గగన్‌యాన్' (Gaganyaan) తొలి మానవరహిత ప్రయోగంపై కూడా ఇస్రో ఛైర్మ‌న్ అప్‌డేట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప‌నులు చురుగ్గా సాగుతున్న‌ట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఆరు ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

"గగన్‌యాన్ అనేది సాంకేతికతతో కూడిన అత్యంత క్లిష్ట‌మైన‌ మిషన్. ఇప్పటివరకు దాదాపు 8,000 పరీక్షలు పూర్తయ్యాయి. ఇతర ఉపగ్రహ ప్రయోగాల మాదిరిగా కాకుండా, ఇందులో మ‌నుషుల ప్ర‌మేయం ఉంటుంది కాబ‌ట్టి వారి భ‌ద్ర‌త అత్యంత కీల‌కం. అందుకే, మూడు మానవరహిత ప్రయోగాల తర్వాత మానవ సహిత ప్రయోగాన్ని చేపట్టాలని ప్రణాళిక రూపొందించాం" అని నారాయణన్ వివరించారు.

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగ విశేషాలు

భారతదేశపు మొట్టమొదటి జియో-ఆర్బిట్ ఇమేజింగ్ శాటిలైట్ అయిన ఈ అత్యాధునిక ఎర్త్ అబ్జర్వేషన్ అంతరిక్ష నౌకను శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 2.55 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన వాహ‌క నౌక‌.. స‌రిగ్గా 18 నిమిషాల త‌ర్వాత అంటే 3.13 గంట‌ల‌కు 2,367 కిలో బ‌రువున్న అత్యాధునిక భూపరిశీలన ఉపగ్రహం EOS-05ను స‌బ్ జియోసింక్రోన‌స్ ట్రాన్స్‌ఫ‌ర్ ఆర్బిట్ (Sub-GTO)లోకి విజ‌య‌వంతంగా చేర్చింది. అక్కడి నుంచి ఉపగ్రహం తన సొంత ఇంజిన్ల సహాయంతో భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులోని తుది కక్ష్యకు చేరుకుంటుంది.

సుమారు 51.7 మీటర్ల పొడవు 420.5 టన్నుల బరువున్న ఈ రాకెట్ ద్వారా చేప‌ట్టిన ప్ర‌తిష్ఠాత్మ‌క జీఎస్‌ఎల్‌వీ శ్రేణిలో ఇది 19వ ప్రయోగం. ఇది మూడు దశల ప్రయోగ వాహనం, దీనిలో క్రయోజెనిక్ పైదశ అత్యంత కీలకమైనది. భారత అంతరిక్ష చరిత్రలో జియోసింక్రోనస్ (భూస్థిర) కక్ష్య నుంచి భూమిని పరిశీలించే మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం ఇదే కావడం విశేషం. ఈ విజ‌యంతో ఇస్రో పాత ఓట‌మికి బ‌దులు తీర్చుకున్న‌ట్ల‌యింది. 2021 ఆగస్టులో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 (EOS-03) మిషన్‌ ద్వారా ప్రయోగించిన జీశాట్‌-1 ఉపగ్రహం క్రయోజెనిక్ దశలో సాంకేతిక లోపం వల్ల విఫలమైంది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు సరికొత్త ఈవోఎస్‌-05 (GISAT-1A) మిషన్‌ను స‌క్సెస్ చేసి త‌న స‌త్తా చాటింది.

నిఘానేత్రం..

సాధారణంగా లో-ఎర్త్‌ ఆర్బిట్‌(లియో), సన్‌ సింక్రోనస్‌ ఆర్బిట్లలో ఉండే ఉపగ్రహాలు ఒక ప్రాంతాన్ని చిత్రీక‌రించ‌డానికి కొన్ని రోజుల నుంచి వారాల సమయం పడుతుంది. కానీ ఈఓఎస్‌-05 భూస్థిర కక్ష్యలో (Geo Orbit) ఉంటూ.. మొత్తం దక్షిణాసియాను ఒకే ఫ్రేమ్‌లో ఫొటో తీయగల సామ‌ర్థ్యం క‌లిగి ఉంది. భారత ఉపఖండం మొత్తాన్ని కేవలం 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించి పంపగలుగుతుంది. ఇందులో అమర్చిన ఎంఎక్స్‌-వీఎన్‌ఆర్‌ పేలోడ్‌ అద్భుతమైన 42 మీటర్ల (ఒక పిక్సెల్‌కు) స్పేషియల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. జియో కక్ష్యలో ఇంతటి అత్యుత్తమ రిజల్యూషన్‌ కలిగిన కెమెరాతో ఉన్న ఉపగ్రహం ప్రపంచంలోనే ఇదే తొలిసారి.

సరిహద్దుల్లో శత్రు దేశాలు సైనిక స్థావరాలను ఎంత రహస్యంగా దాచినప్పటికీ.. వాటిని ఇట్టే పసిగట్టే సత్తా ఈ ఉపగ్రహానికి ఉంది. ఈ ‘నిఘా నేత్రం’ భారతదేశ సరిహద్దులతో పాటు ఉపఖండంపై నిరంతర నిఘా ఉంచుతుంది. ఇది వాతావరణ మార్పులు, విపత్తుల నిర్వహణ, వ్యవసాయం, రక్షణ రంగాలకు అవసరమైన హై-రెజల్యూషన్ చిత్రాలను, సమాచారాన్ని 24/7 అందిస్తుంది.

Also Read..

నేపాల్ వ‌ర‌ద‌ల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ‌ ఇద్దరు కార్మికులు

ల్యాండింగ్ వేళ పోల్‌ను ఢీ కొట్టిన విమానం.. శ్రీ‌న‌గ‌ర్ ఎయిర్‌పోర్టులో ఘ‌ట‌న‌

నేష‌న‌ల్ ఇన్ఫర్మాటిక్స్ సెంట‌ర్‌లో టెక్నిక‌ల్ అసిస్టెంట్లు..

Advertisement
Advertisement