త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kharge | లైట్స్‌.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌లా ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌చారం.. ప్ర‌ధాని మోదీపై ఖ‌ర్గే సెటైర్లు..!

Kharge | 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రచారం ‘లైట్స్‌.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌’లా ఉందని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలు మాత్రం నిరుద్యోగం, భరించలేని ద్రవ్యోల్బణం, అదుపులేని ఆర్థిక అసమానతలతో సతమతమవుతున్నారని ఆరోపించారు.

P

National | Published On Sep 1, 2026, 3.25 pm IST

Kharge | లైట్స్‌.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌లా ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌చారం.. ప్ర‌ధాని మోదీపై ఖ‌ర్గే సెటైర్లు..!
Advertisement

Kharge | 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రచారం ‘లైట్స్‌.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌’లా ఉందని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలు మాత్రం నిరుద్యోగం, భరించలేని ద్రవ్యోల్బణం, అదుపులేని ఆర్థిక అసమానతలతో సతమతమవుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఖర్గే ఓ పోస్టు చేశారు. ‘‘జీడీపీ వృద్ధిని దేశం సంబరంగా జరుపుకొంటోందని ప్రధాని చెబుతున్నారు. మీకు ఆ విలాసం ఉండొచ్చు. సామాన్యుడికి లేదు’’ అని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న మూడు ‘యూ’లు గ‌తంలో ఎన్న‌డూలేనివిధంగా నిరుద్యోగం (Unprecedented unemployment), భరించలేని ద్రవ్యోల్బణం (Unbearable inflation), అదుపులేని అసమానత (Unbridled inequality) అని వివరించారు.

యువతకు ఉద్యోగాలేవీ?

దేశంలో నిరుద్యోగం 50 ఏళ్ల గ‌రిష్ట స్థాయికి చేరిందని ఖర్గే ఆరోపించారు. పట్టభద్రులైన యువతలో 40 శాతం మందికి ఉద్యోగాలు లేవన్నారు. 2026 జులైలో 15-29 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి ఆరుగురు యువతలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారని.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం 19 నెలల గ‌రిష్టానికి చేరిందని ఖర్గే పేర్కొన్నారు. చక్కెర, ఉల్లి, టమాటా, పప్పులు, వంటనూనె, బియ్యం, పాలు వంటి వంటింటి నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ, సీఎన్‌జీ ధరలు కూడా ప్రజలకు భారంగా మారాయని ఆరోపించారు. మధ్యతరగతి కుటుంబాలు ఎలాగోలా నెట్టుకొస్తుండగా.. పేదలు ఆశలు వదులుకున్నారని వ్యాఖ్యానించారు.

ధనిక-పేదల మ‌ధ్య అంతరం..

దేశంలో ఆర్థిక అసమానతలు బ్రిటిష్‌ పాలన కాలం కంటే దారుణంగా ఉన్నాయని ఖర్గే ఆరోపించారు. దేశ సంపదలో ఒక శాతం మంది వద్ద 40 శాతం వాటా ఉందని, దిగువన ఉన్న 50 శాతం మంది 15 శాతం సంపదతోనే బతుకుతున్నారని పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో పేదల నుంచి ధనికులకు ఇంత పెద్ద ఎత్తున సంపద బదలాయింపు ఎన్నడూ జరగలేదని ఆరోపించారు. 2014 నుంచి కార్పొరేట్‌ రుణాల్లో రూ.16 లక్షల కోట్లకుపైగా రద్దు చేశారని ఖర్గే విమర్శించారు. వ్యాపారవర్గాలతో కుమ్మక్కు కావడమే ప్రభుత్వ ఆర్థిక విధానంగా మారిందని దుయ్యబట్టారు. ఇటీవల రూ.22.06 కోట్ల బకాయిలు ఉన్నట్లు అంగీకరించినప్పటికీ.. రుణదాతలు కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే రికవరీ చేశారని, ఇది 99.97 శాతం తగ్గుదల అని పేర్కొన్నారు. వ్యాపార అనుకూల వర్గాలకు ప్రధాని మోదీ అండగా ఉంటున్నారని విమర్శించారు.

విదేశీ ప్రయాణాలు, బంగారంపై సూచనలపైనా..

అనవసర విదేశీ ప్రయాణాలు చేయవద్దని, బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని ప్రజలకు పదేపదే సూచించడంపైనా ఖర్గే విమర్శలు గుప్పించారు. ఆ సూచనల వెనుక దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల వాస్తవికత కనిపిస్తోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో మార్పేమీ లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించే సామర్థ్యం మాత్రమే పెరిగిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

జీడీపీ వృద్ధిపై మోదీ ఏమ‌న్నారంటే..

తొలి త్రైమాసికంలో 7.8 శాతం వాస్తవ జీడీపీ వృద్ధి సాధించడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇది దేశ ప్రజల సంకల్పం, కష్టానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ భారత్‌ వేగంగా ముందుకు సాగుతోందన్నారు. కరోనా అనంతరం 2020 నుంచి ప్రపంచంలో స్థిరత్వం కొరవడిందని, అయినప్పటికీ దేశం 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు. దేశం సాధిస్తున్న పురోగతిపై ఆనందించాల్సిన సమయంలో ప్రతిపక్షాలు నిరాశను వ్యాప్తి చేస్తున్నాయని మోదీ ఆరోపించారు. ప్రజల సమష్టి శక్తితోనే ఈ ఆర్థిక వృద్ధి సాధ్యమైందని వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement