త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raghav Chadha | మౌన‌మే.. కానీ, ఓట‌మి కాదు.. ఆప్‌ను ఉద్దేశించి రాఘ‌వ్ చ‌ద్ధా ఆస‌క్తిక‌ర వీడియో

Raghav Chadha | రాజ్య‌స‌భ‌లో ఆప్ డిప్యూటీ లీడ‌ర్ (Rajya Sabha deputy leader) ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డంపై ఎంపీ (AAP MP) రాఘ‌వ్‌చ‌ద్ధా (Raghav Chadha) స్పందించారు. ఈ మేర‌కు పార్టీ నిర్ణ‌యంపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. "ప్రజా సమస్యలను లేవనెత్తడం నేరమా..? నేను ఏదైనా నేరం చేశానా..? తప్పు చేశానా..? లేదంటే తప్పుగా ప్రవర్తించానా..?" అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

D

National | Published On Apr 3, 2026, 10.44 am IST

Raghav Chadha | మౌన‌మే.. కానీ, ఓట‌మి కాదు.. ఆప్‌ను ఉద్దేశించి రాఘ‌వ్ చ‌ద్ధా ఆస‌క్తిక‌ర వీడియో
Advertisement

Raghav Chadha | ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పార్ల‌మెంటులో గొంతెత్తుతున్న ఎంపీ (AAP MP) రాఘ‌వ్‌చ‌ద్ధా (Raghav Chadha)కు ఆమ్ ఆద్మీ పార్టీ షాకిచ్చిన విష‌యం తెలిసిందే. రాజ్య‌స‌భ‌లో ఆప్ డిప్యూటీ లీడ‌ర్ (Rajya Sabha deputy leader) ప‌ద‌వి నుంచి చ‌ద్ధాను తొల‌గించింది. అంతేకాదు, త‌మ పార్టీ త‌ర‌ఫున స‌భ‌లో చ‌ద్ధాకు మాట్లాడేందుకు స‌మ‌యం ఇవ్వొద్ద‌ని కూడా కోరింది. ఈ నేప‌థ్యంలో ఆప్ తీరుపై రాఘ‌వ్ చ‌ద్ధా తాజాగా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

పార్లమెంటులో అవకాశం దొరికినప్పుడల్లా తాను ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న‌ట్లు చెప్పారు. ఇలా చేయ‌డం నేర‌మా..? అంటూ ప్ర‌శ్నించారు. "ప్రజా సమస్యలను లేవనెత్తడం నేరమా..? నేను ఏదైనా నేరం చేశానా..? తప్పు చేశానా..? లేదంటే తప్పుగా ప్రవర్తించానా..?" అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు వీడియో సందేశం విడుద‌ల చేశారు. "పార్లమెంటులో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా నేను ప్రజల సమస్యలను లేవనెత్తుతున్నాను. స‌భ‌లో అరుదుగా చర్చించే అంశాలనే నేను ప్రస్తావిస్తాను. ప్రజల సమస్యలను లేవనెత్తడం లేదా ప్రజా సమస్యలపై మాట్లాడటం నేరమా..? నేను ఏదైనా తప్పు చేశానా..? రాఘవ్ చద్దాను పార్లమెంటులో మాట్లాడకుండా ఆపమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సెక్రటేరియట్‌ను కోరినందుకే నేను ఈ రోజు ఈ ప్రశ్న అడుగుతున్నాను. గిగ్‌ వర్కర్ల సమస్యలు, టోల్‌ ప్లాజా దోపిడీ, టెలికాం కంపెనీల రీఛార్జ్‌ విధానాలు వంటి సమస్యలను లేవనెత్తాను. అది పార్టీకే ప్రయోజనం కదా..! దీని వల్ల పార్టీకి జ‌రిగే న‌ష్ట‌మేంటి..? ఎందుకు నన్ను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు..? ఇలాంటి చర్యలతో నా గళాన్ని మీరు అణచివేయగలరు. ఇది నా ఓటమి కాదు. ప్ర‌జ‌లు నావైపే ఉన్నారు. వారి కోసం ఎంతదూరమైనా వెళ్తా" అని ఆయన వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోకి ఓటమి కాదు, మౌనం వహించాల్సి వచ్చింది అని క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ సందేశం ఆమ్ ఆద్మీ కోసం అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌ అవుతోంది.

రాఘ‌వ్ చ‌ద్ధాకు ఆప్ షాక్‌..

ఎగువ స‌భ‌లో ఆప్ డిప్యూటీ లీడ‌ర్ (Rajya Sabha deputy leader) ప‌ద‌వి నుంచి చ‌ద్ధాను పార్టీ తొల‌గించింది. ఆయ‌న స్థానంలో పంజాబ్‌కు చెందిన ఎంపీ అశోక్ మిట్ట‌ల్‌ (Punjab MP Ashok Mittal)ను నియ‌మించింది. ఆప్ నిర్ణ‌యం రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఒక్క‌సారిగా షాక్‌కు గురిచేసింది. ఎందుకంటే.. రాఘ‌వ్ చ‌ద్ధా ఆప్ అధినేత‌, మాజీ సీఎం కేజ్రీవాల్‌కు అత్యంత స‌న్నిహిత వ్య‌క్తిగా పేరుంది. అయినప్ప‌టికీ ఆయ‌న‌పై ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

కాగా, పార్టీ వ్య‌వ‌హారాల విష‌యంలో రాఘ‌వ్ చ‌ద్ధా ఎప్పుడూ దూరంగానే ఉంటార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అంతేకాదు, ఆప్‌, పార్టీ అగ్ర నాయ‌క‌త్వానికి స‌బంధించిన కీల‌క ప‌రిణామాల‌పై ఆయ‌న మౌనం వ‌హిస్తుండ‌టం కూడా పార్టీ అధిష్ఠానానికి న‌చ్చ‌డం లేదు. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు మ‌ద్యం కుంభ‌కోణం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో కూడా తాజా ప‌రిణామాల‌పై చ‌ద్ధా స్పందించ‌లేదు. అయితే, అప్పుడు కంటి ఆప‌రేష‌న్ కార‌ణంగా యూకేలో ఉన్న విష‌యం తెలిసిందే.

మ‌రోవైపు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఆప్ అధినేత కేజ్రీవాల్‌, మాజీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీశ్ సిసోడియా, ఇత‌రుల‌ను కోర్టు నిర్దోషులుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అప్పుడు కూడా చ‌ద్ధా బ‌హిరంగంగా స్పందించ‌లేదు. అంతేకాదు సోష‌ల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్టూ చేయ‌లేదు. దీంతో ఎంపీ వ్య‌వ‌హార‌శైలిపై పార్టీ అధిష్ఠానం ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read..

అభిషేక్ శ‌ర్మ‌కు ఐపీఎల్ గవ‌ర్నింగ్ కౌన్సిల్ షాక్‌.. 25 శాతం ఫైన్‌, 1 డీమెరిట్ పాయింట్‌..

ఆ ఎమ్మెల్యేల‌కు పెన్ష‌న్ క‌ట్‌.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

షియోమీ నుంచి రెడ్‌మీ నోట్ 15 స్పెష‌ల్ ఎడిష‌న్ ఫోన్‌.. అదిరిపోయిన ఫీచ‌ర్లు..

Advertisement

తాజావార్తలు

Advertisement