త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rohini Karte | రోళ్లు పగిలే ‘రోహిణి కార్తె’ ప్రారంభం.. ఇక భ‌గ‌భ‌గ‌లే.. ఈ 15 రోజులూ జ‌ర భ‌ద్రం

Rohini Karte | తెలుగు పంచాంగం ప్రకారం నేటి నుంచి అత్యంత శక్తిమంతమైన ‘రోహిణి కార్తె’ (Rohini Karte) ప్రారంభమైంది. ఈ కార్తె జూన్ 8 వ‌ర‌కూ అంటే దాదాపు 15 రోజుల‌పాటూ కొన‌సాగ‌నుంది. దీంతో ఈ ప‌క్షం రోజులూ ఎండ‌ల తీవ్ర‌త చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ‌ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

D

National | Published On May 25, 2026, 3.45 pm IST

Rohini Karte | రోళ్లు పగిలే ‘రోహిణి కార్తె’ ప్రారంభం.. ఇక భ‌గ‌భ‌గ‌లే.. ఈ 15 రోజులూ జ‌ర భ‌ద్రం
Advertisement

Rohini Karte | ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. ప‌లు చోట్ల 46 డిగ్రీల‌కు మించి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. ఎండ‌ల తీవ్ర‌త‌కు జ‌నం అల్లాడిపోతున్నారు. మ‌రో 15 రోజుల‌పాటూ ఎండ‌ల తీవ్ర‌త మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌బోతోంది. తెలుగు పంచాంగం ప్రకారం నేటి నుంచి అత్యంత శక్తిమంతమైన ‘రోహిణి కార్తె’ (Rohini Karte) ప్రారంభమైంది. ఈ కార్తె జూన్ 8 వ‌ర‌కూ అంటే దాదాపు 15 రోజుల‌పాటూ కొన‌సాగ‌నుంది. దీంతో ఈ ప‌క్షం రోజులూ ఎండ‌ల తీవ్ర‌త చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ‌ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి (Rohini Nakshatra) ప్రవేశించడంతో 'రోహిణి కార్తె' ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎండలు అత్యంత తీవ్రంగా ఉంటాయి. వేస‌వి మొత్తంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే కాలం ఇదే. ఈ రోహిణి కార్తెలో ఎండ‌ల తీవ్ర‌త‌ను చెప్పేందుకు మ‌న పెద్ద‌లు "రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి" అనే సామెతను చెబుతారు. ఈ సమయంలో సూర్యకిరణాలు భూమిపై నిట్టనిలువుగా పడటం వల్ల వాతావరణంలో వేడి విపరీతంగా పెరిగిపోయి రాళ్లు, రోళ్లు సైతం పగుళ్లు ఇచ్చేంతటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందుకే దీన్ని రోళ్లు ప‌గిలే రోహిణి కార్తె అని పిలుస్తారు.

ఈ జాగ్ర‌త్త‌లు మ‌స్ట్‌..

తీవ్రమైన ఎండల వల్ల ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగి, వడగాలులు, ఉక్కపోత తీవ్రరూపం దాలుస్తాయి. ఈ కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్ర‌జ‌లు ఈ 15 రోజుల‌పాటూ చాలా జ‌గ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. దాహం వేయ‌క‌పోయినా నీళ్లు తాగ‌డం, మ‌జ్జిగ‌, కొబ్బ‌రి నీళ్లు, ఓఆర్ఎస్‌ను ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. అంతేకాదు మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఇంటి ప‌ట్టునే ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచిస్తున్నారు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు తేలిక‌పాటి కాట‌న్ దుస్తులు, త‌ల‌కు స్కార్ఫ్ లేదా గొడుగు ప‌ట్టుకుని వెళ్లాల‌ని సూచిస్తున్నారు.

వ్య‌వ‌సాయానికి శుభ‌ప్ర‌దం..

ఈ కార్తెలో తీవ్రమైన ఎండల వల్ల భూమిలోని హానికర పురుగులు, బ్యాక్టీరియా నశిస్తాయి. రోహిణి కార్తె ముగియ‌గానే మృగశిర కార్తె ప్రవేశిస్తుంది. ఈ కార్తె చల్లటి కబురు మోసుకొస్తుంది. నైరుతి రుతు పవనాలు దేశ‌మంత‌టా విస్తరించి వర్షాలు కురుస్తాయి. దీంతో వాతావరణం చ‌ల్ల‌బ‌డుతుంది. దీనినే రైతులు 'ఏరువాక సాగే కాలం' అని పిలుస్తారు. మృగశిర కార్తెతో వచ్చే తొలకరి జల్లులతో రైతులు పొలాలు దున్ని విత్త‌నాలు నాట‌డం మొద‌లు పెడ‌తారు. వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ఈ కార్తెను శుభప్రదంగా భావిస్తారు.

Also Read..

మే 26 నాటికి కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

బీజేపీది రాజ‌కీయ డ్రామా.. పెట్రోల్ ధ‌ర‌లు పెంచుకుంట మోస‌పు యాత్ర‌లు చేస్తోంది: మంత్రి పొన్నం

ఎన్టీఏ ఎలాంటి గుణపాఠాలూ నేర్చుకోలేదు.. నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు అస‌హ‌నం

Advertisement
Advertisement