త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | “పోఖ్రాన్‌”తో ప్ర‌పంచానికి గ‌ట్టి సందేశం ఇచ్చాం : ప్ర‌ధాని మోదీ

PM Modi | 1998లో పోఖ్రాన్‌లో నిర్వహించిన అణు పరీక్షతో ప్ర‌పంచానికి భార‌త్‌ గ‌ట్టి సందేశం ఇచ్చింద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. భారత్‌ ఎవరి ఒత్తిళ్లు, ఆంక్షలకు తలొగ్గదని నిరూపించింద‌న్నారు. గుజ‌రాత్‌లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జ‌రిగి 75 ఏళ్లు పూర్తైన సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న 'సోమనాథ్ అమృత్ మహోత్సవం' కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని పాల్గొని ప్ర‌సంగించారు.

D

National | Published On May 11, 2026, 3.16 pm IST

PM Modi | “పోఖ్రాన్‌”తో ప్ర‌పంచానికి గ‌ట్టి సందేశం ఇచ్చాం : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | ప్ర‌పంచంలోని ఏ శ‌క్తీ కూడా భార‌త‌దేశాన్ని అణ‌చివేయ‌లేద‌ని, త‌ల‌వంచేలా చేయ‌లేద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఉద్ఘాటించారు. గుజ‌రాత్‌లోని సోమనాథ్ ఆలయ (Somnath Temple) పునర్నిర్మాణం జ‌రిగి 75 ఏళ్లు పూర్తైన సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న 'సోమనాథ్ అమృత్ మహోత్సవం' కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా 1998లో పోఖ్రాన్‌లో నిర్వహించిన అణు పరీక్షలను (Nuclear Tests In Pokhran) గుర్తుచేసుకుంటూ.. ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారతదేశాన్ని తలవంచేలా చేయలేదని ఆయన ఉద్ఘాటించారు.

ప్రపంచ దేశాల ఒత్తిడి, ఆంక్షలు ఉన్నప్పటికీ పోఖ్రాన్ అణు పరీక్షలు భార‌త‌దేశం యొక్క‌ బలమైన రాజకీయ సంకల్పాన్ని చాటిచెప్పాయని అన్నారు. "1998 మే 11న స‌రిగ్గా ఇదే రోజు పోఖ్రాన్‌లో మొద‌టి మూడు అణు పరీక్షలు జ‌రిగాయి. మ‌న శాస్త్ర‌వేత్త‌లు భార‌త‌దేశ సామ‌ర్థ్యాన్ని యావ‌త్ ప్ర‌పంచానికి చాటిచెప్పారు. అప్పటి అణుపరీక్షలు చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. మ‌న‌పై అనేక ఆంక్ష‌లు విధించాయి. ఈ పరీక్షల తర్వాత అమెరికా, జపాన్ వంటి కొన్ని దేశాలు భారత్‌పై ఆర్థిక ఆంక్షలు విధించాయి. చాలా ర‌కాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్ర‌య‌త్నించాయి. ప్ర‌పంచంలోనే శ‌క్తిమంత‌మైన దేశాలు మ‌న‌పై ఎన్ని ఆంక్ష‌లు విధించినా.. మనం తలొగ్గలేదు. ధైర్యంగా నిలబడ్డాం. మే 13న మరో రెండు అణు పరీక్షలు నిర్వహించాం. అటల్‌ నేతృత్వంలో భారత్‌ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాం. భారత్‌ ఎవరి ఒత్తిళ్లు, ఆంక్షలకు తలొగ్గదని నిరూపించాం" అని ప్ర‌ధాని నాటి సంఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు.

స్మైలింగ్ బుద్ధతో..

రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారిలో భారతదేశం నిర్వహించిన అణు పరీక్షలు దేశ రక్షణ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టాలు. 1974లో మొదటిసారి (స్మైలింగ్ బుద్ధ), 1998లో రెండోసారి (ఆపరేషన్ శక్తి) విజయవంతంగా అణుపరీక్షలు జరిపి, భారత్ అణుశక్తి సంపన్న దేశంగా అవతరించింది. ఈ పరీక్షలు అంతర్జాతీయంగా భారత్ కీర్తిని పెంచాయి. 1974లో ఇందిరా గాంధీ హ‌యాంలో భార‌త్ త‌న మొట్ట మొద‌టి భూగ‌ర్భ అణుప‌రీక్ష నిర్వ‌హించింది. దీనికి "స్మైలింగ్ బుద్ధ" అని పేరు పెట్టారు. అప్ప‌ట్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలు (P-5) కాకుండా అణు పరీక్ష చేసిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఈ ప‌రీక్ష‌తో భార‌త్ త‌న స‌త్తాని ప్ర‌పంచానికి చాటి చెప్పింది.

అణు ఆయుధ దేశంగా భార‌త్‌..

ఆనాడు స్మైలింగ్ బుద్ధ వేసిన పునాది వల్లే.. 1998లో వాజ్‌పేయి హయాంలో 'పోఖ్రాన్-2' సాధ్యమైంది. 1998 మే 11న మూడు, మే 13న రెండు మొత్తం ఐదు భూగర్భ అణు పరీక్షలు నిర్వహించారు. వీటిని 'ఆపరేషన్ శక్తి'గా పిలిచారు. ఇందులో ఫ్యూజన్ (థర్మోన్యూక్లియర్), ఫిషన్ (విచ్ఛిత్తి) బాంబులు ఉన్నాయి. ఇవి భారత్ అణు ఆయుధ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. ఈ ప‌రీక్ష‌ల త‌ర్వాత నాడు ప్ర‌ధానిగా ఉన్న అట‌ల్ బిహారీ వాజ్‌పేయి.. మ‌న దేశాన్ని అణు ఆయుధ దేశంగా ప్ర‌క‌టించారు. 1998 మే 11న జరిగిన ఈ విజయవంతమైన అణు పరీక్షలకు గుర్తుగా.. మ‌నం ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

Also Read..

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీక్‌..? అసలు పరీక్షా పత్రంతో సరిపోలిన మెటీరియల్‌లోని 140 ప్రశ్నలు

రీఫర్బిష్డ్ ఫోన్లను స్వ‌యంగా విక్ర‌యిస్తున్న శాంసంగ్‌.. వినూత్న ప్రోగ్రామ్ ప్రారంభం..

గెలాక్సీ ఎం, ఎఫ్ సిరీస్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు.. ప్ర‌క‌టించిన శాంసంగ్‌..

Advertisement
Advertisement