త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dowry | రూ.50ల‌క్ష‌ల బంగారం, ఎస్‌యూవీ కారు ఇచ్చినా అద‌న‌పు క‌ట్నం కోసం వేధింపులు.. వివాహిత బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

Dowry | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నోయిడాలో (Greater Noida) వరకట్న వేధింపులు తాళ‌లేక వివాహిత భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆమె శ‌రీరంపై ప‌లు గాయాలు ఉన్న‌ట్లు గుర్తించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆమె భ‌ర్త హృతిక్‌, మామ మ‌నోజ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టినట్లు పోలీసులు వెల్ల‌డించారు.

D

National | Published On May 18, 2026, 2.53 pm IST

Dowry | రూ.50ల‌క్ష‌ల బంగారం, ఎస్‌యూవీ కారు ఇచ్చినా అద‌న‌పు క‌ట్నం కోసం వేధింపులు.. వివాహిత బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
Advertisement

Dowry | అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్న భార‌త్‌లో ఇంకా అనేక దురాచారాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బాల్య వివాహాలు, వ‌ర‌క‌ట్న (Dowry) వేధింపులు కొన‌సాగుతున్నాయి. సమాజంలో ఎన్నో సంస్కరణలు వచ్చినా, మహిళల సాధికారత పెరుగుతున్నా.. వ్యాపారంగా మారిపోయిన వివాహం, సామాజిక అత్యాశ మహిళలను వరకట్న దురాచారానికి సమిధలుగా మారుస్తున్నాయి. విద్యావంతులు, ఉన్న‌త స్థాయిలో ఉన్న వాళ్లు సైతం వ‌ర‌క‌ట్న వేధింపుల‌కు గుర‌వుతున్నారు. చివ‌రికి బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లే మ‌న దేశంలో ఇటీవ‌లే అనేకం వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నోయిడాలో (Greater Noida) వరకట్న వేధింపులు తాళ‌లేక వివాహిత భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఎకోటెక్‌-3 పోలీసు స్టేష‌న్ ప‌రిధి (Ecotech-III police station limits)లోని జ‌ల్‌పురా గ్రామంలో (Jalpura area) ఆదివారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 24 ఏళ్ల దీపికకు హృతిక్‌తో గత 14 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లికి దీపికా కుటుంబం దాదాపు కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేసింది. అంతేకాదు, వివాహ స‌మ‌యంలో ఎస్‌యూవీ కారు, రూ.కోటి క‌ట్నంగా ఇచ్చింది. త‌మ కుమార్తెకు ఎంతో ఘ‌నంగా వివాహం చేసి ఆ త‌ల్లిదండ్రులు అత్తారింటికి పంపారు. అయితే, పెళ్లైన నాలుగు నెల‌ల త‌ర్వాత ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. అద‌న‌పు క‌ట్నం కోసం అత్తింటి వారు దీపిక‌ను వేధించ‌డం మొద‌లు పెట్టారు. మ‌రో రూ.51 ల‌క్ష‌లు న‌గ‌దు తీసుకురావాలంటూ ప‌దేప‌దే వేధింపుల‌కు గురి చేశారు.

అత్తింటి వేధింపులు తాళ‌లేక దీపిక ఆదివారం రాత్రి ఇంటిపై నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకొని దీపిక డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నోయిడా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, ఆమె శ‌రీరంపై ప‌లు గాయాలు ఉన్న‌ట్లు గుర్తించారు. దీపిక తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మృతిరాలి భ‌ర్త హృతిక్‌, మామ మ‌నోజ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టినట్లు పోలీసులు వెల్ల‌డించారు.

పెళ్లైన మూడు నెల‌ల నుంచే వేధింపులు..

డిసెంబర్ 2024న త‌న కుమార్తెకు వివాహం జ‌రిగిన‌ట్లు దీపిక తండ్రి తెలిపారు. వివాహ సమయంలో తాను రూ. 11 లక్షల నగదు, రూ. 50 లక్షల విలువైన బంగారం, ఫర్నిచర్, ఒక స్కార్పియో (Scorpio) కారును కట్నంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, తాము ఇచ్చిన క‌ట్నం ప‌ట్ల దీపిక అత్త‌మామ‌లు అసంతృప్తిలో ఉండేవార‌న్నారు. దీంతో పెళ్లైన మూడు, నాలుగు నెల‌ల‌కే స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అద‌న‌పు క‌ట్నం తేవాలంటూ.. త‌న కుమార్తెను వేధింపుల‌కు గురిచేసేవార‌ని ఆరోపించారు.

ఈ విష‌యంపై తాము ఎప్పుడూ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేద‌ని.. కుటుంబంలో స‌మ‌స్య‌లు సాధార‌ణ‌మే అంటూ కుమార్తెకు స‌ర్దిచెప్పిన‌ట్లు పేర్కొన్నారు. ఆమె కాపురాన్ని నిల‌బెట్టేందుకు చాలా ప్ర‌య‌త్నించిన‌ట్లు చెప్పారు. కానీ, వారు మాత్రం త‌మ కుమార్తెను వేధింపుల‌కు గురి చేస్తూ వ‌చ్చార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రూ.51 ల‌క్ష‌ల న‌గ‌దు, ఫార్చూన‌ర్ కారు కావాలంటూ వేధించార‌ని ఆరోపించారు.

ఆత్మ‌హ‌త్య కాదు.. ముమ్మాటికీ హ‌త్యే..

ఆదివారం రోజున దీపిక ఏడుస్తూ ఫోన్ చేసింద‌ని ఆమె తండ్రి ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. భ‌ర్త‌, అత్త‌మామ‌లు త‌న‌ను కొడుతున్నారంటూ బోరున విల‌పించింద‌న్నారు. దీంతో కొంద‌రు బంధువుల‌తో క‌లిసి అదే రోజు సాయంత్రం కుమార్తె ఇంటికెళ్లి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు చెప్పారు. ఆ త‌ర్వాత దీపిక భ‌వ‌నంపైక‌ప్పు నుంచి కింద‌ప‌డి తీవ్రంగా గాయ‌ప‌డింద‌న్న స‌మాచారం త‌మ‌కు అందింద‌న్నారు. అయితే, ఆమెది ఆత్మ‌హ‌త్య కాద‌ని.. ముమ్మాటికీ హ‌త్యే అని పేర్కొన్నారు.

"ఆ మృగాళ్లు నా బిడ్డ‌ను చంపేశారు. కట్నం పిచ్చితోనే ఆమెను పొట్టనబెట్టుకున్నారు. గ‌త 10 నెలలుగా ఆమె తన బాధలను మాకు చెప్తూనే ఉంది. కానీ మేము నచ్చజెప్పడానికే ప్రయత్నించాం. అయినా వారిలో ఎలాంటి మార్పూ రాలేదు. నిన్న కూడా మేము నా బిడ్డ ఇంటికి వెళ్లాము. ఆమెను క‌లిసి మాట్లాడి ఇంటికి బయలుదేరిన కాసేపటికే, రాత్రి 12:30 గంటలకు మాకు ఫోన్ వచ్చింది. భ‌వ‌నంపై నుంచి కింద‌కు ప‌డిపోయింద‌ని చెప్పారు. నా బిడ్డ‌ను దారుణంగా కొట్టారు. ఆ త‌ర్వాత ఇంటి పైనుంచి కిందకు తోసేశారు. అంతా కలిసే ఈ పని చేశారు. నా బిడ్డ‌ది ఆత్మ‌హ‌త్యే కాదు.. ఇది ముమ్మాటికీ హత్యే. ఆమె శ‌రీరంపై గాయాల గుర్తులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఆమె కడుపులో ప‌దునైన వ‌స్తువ‌తో పొడిచారు. నా బిడ్డ‌ను చంపిన త‌ర్వాతే వాళ్లు పై నుంచి కింద‌కు ప‌డేశారు" అని తండ్రి ఆరోపించారు. "ఎంత క‌ట్నం ఇచ్చి ఏం లాభాం.. చివ‌రికి మా కూతురు మాకు దూర‌మైపోయింది. ప‌శ్చాత్తాప‌మే మిగిలింది" అంటూ ఆ తండ్రి బోరున విల‌పించారు.

Also Read..

ఎక్స్‌ప్రెస్‌వేపై ఎస్‌యూవీల‌తో ప్ర‌మాద‌క‌ర స్టంట్స్‌.. డోర్లు తెరిచి అతివేగంగా వెళ్తూ..

ప్ర‌మాద‌క‌ర ప‌రిణామం.. యూఏఈలోని బ‌రాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భార‌త్‌

ఫ్రీ యూజ‌ర్ల‌కు షాకిచ్చిన ఎక్స్‌.. పోస్టుల‌పై లిమిట్స్ విధింపు..

Advertisement
Advertisement