త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lok Sabha | లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చ‌రిత్ర‌లో తొలిసారి

Lok Sabha | వ‌ర్షాకాల స‌మావేశాల చివ‌రి రోజు పార్ల‌మెంట్‌లో చారిత్ర‌క ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. లోక్‌స‌భ (Lok Sabha)లో తొలిసారిగా జాతీయ గేయం వందేమాతరాన్ని ఆల‌పించారు. అనంత‌రం స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది (sine die).

D

National | Published On Aug 13, 2026, 12.07 pm IST

Lok Sabha | లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చ‌రిత్ర‌లో తొలిసారి
Advertisement

Lok Sabha | త్రినేత్ర‌.న్యూస్ : వ‌ర్షాకాల స‌మావేశాల చివ‌రి రోజు పార్ల‌మెంట్‌లో చారిత్ర‌క ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. లోక్‌స‌భ (Lok Sabha)లో తొలిసారిగా జాతీయ గేయం వందేమాతరాన్ని ఆల‌పించారు. స‌మావేశాల్లో చివ‌రి రోజైన ఇవాళ స‌భ‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, హోంమంత్రి అమిత్ షా స‌హా స‌భ్యులంతా హాజ‌ర‌య్యారు. స‌భను వందేమాత‌రం ఆలాప‌న‌తో ప్రారంభించారు. మొత్తం ఆరుచ‌ర‌ణాల‌ను ఆల‌పించారు. లోక్‌స‌భ‌లో వందేమాత‌రం ఆలపించ‌డం చ‌రిత్ర‌లోనే ఇది తొలిసారి కావ‌డం విశేషం. అనంత‌రం స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది (Lok Sabha adjourned sine die).

జాతీయ గీతం ‘జనగణమన..’ స్థాయిలో జాతీయ గేయం వందేమాతరానికి (Vande Mataram) కేంద్ర ప్ర‌భుత్వం చట్టపరమైన రక్షణలు కల్పించిన విష‌యం తెలిసిందే. ఇందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్ల‌మెంట్ ఇటీవ‌లే ఓకే చెప్పింది. ఆ త‌ర్వాత దీనికి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము సైతం ఆమోద ముద్ర వేశారు. వందేమాతరాన్ని పాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా అంతరాయం కలిగించ‌డం చేస్తే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు ఉంటాయి.

వాడీవేడిగా ముగిసిన సమావేశాలు

ప్ర‌భుత్వం, విప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాగ్వాదాలు, నిర‌స‌న‌ల న‌డుమ దిగువ స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. జులై 20న ప్రారంభ‌మైన ఈ స‌మావేశాలు.. రామమందిర విరాళాల చోరీ, నీట్ పేప‌ర్ లీక్ ఆందోళ‌న‌ల సంద‌ర్భంగా నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌పై పోలీసుల లాఠీఛార్జ్‌, పెల్లెట్ గ‌న్స్ వాడ‌టంపై విప‌క్షాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆయా అంశాల‌పై ప్ర‌తిప‌క్ష ఎంపీలంతా పార్ల‌మెంట్ లోప‌లా, బ‌య‌ట త‌మ నిర‌స‌న‌ల‌ను కొన‌సాగించారు. విప‌క్షాల నిర‌స‌ల‌న‌తో 19 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు ఎలాంటి అర్థవంతమైన చర్చలు లేకుండా ప్రతిరోజూ వాయిదాలకే పరిమితం అయ్యాయి.

ముఖ్యంగా విద్యార్థులపై లాఠీచార్జ్‌ ఘటనపై హోంమంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని విపక్షాలు చేసిన డిమాండ్‌ సభను కుదిపేసింది. చివ‌రి రోజైన నేడు ఈ అంశంపై షా స‌మాధానం చెప్తార‌ని అంతా భావించారు. షా కూడా విపక్షాల ప్రతీ ప్రశ్నకూ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు బుధవారం ప్రకటించారు. అందుకు సమయం కేటాయించాలని స్పీకర్‌ను కోరుతూ లేఖ‌ సైతం రాశారు. అయిన‌ప్ప‌టికీ స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. ఇక విప‌క్షాల ఆందోళ‌న‌ల మ‌ధ్యే ఈ సెష‌న్‌లో కేంద్రం ప‌లు కీల‌క బిల్లుల‌ను పాస్ చేయించింది. కీల‌క‌మైన ఎఫ్‌సీఆర్ఏ బిల్లును జేపీసీకి పంపింది.

పార్ల‌మెంట్ వెలుప‌ల పోటాపోటీ నిర‌స‌న‌లు

ఇక చివ‌రి రోజైన నేడు పార్ల‌మెంట్ వెలుప‌ల మ‌క‌ర్ ద్వారం వ‌ద్ద అధికార బీజేపీ, విప‌క్ష ఇండియా కూట‌మి స‌భ్యులు త‌మ నిర‌స‌న‌ల‌ను కొన‌సాగించారు. జార్ఖండ్ రాష్ట్రంలో విద్యార్థుల నిర‌స‌న‌ల‌ను కాంగ్రెస్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపిస్తూ ఎన్డీయే కూట‌మి ఎంపీలు ఆందోళ‌న చేప‌ట్ట‌గా.. విప‌క్షాలు మాత్రం హోంమంత్రి అమిత్‌షాకు వ్య‌తిరేకంగా త‌మ నినాదాల‌ను కొన‌సాగించారు. మ‌రోవైపు స‌మావేశాలు ముగింపు సంద‌ర్భంగా లోక్‌సభ స్పీకర్ ఏర్పాటు చేసే సాంప్రదాయ టీ సమావేశాన్ని ప్ర‌తిప‌క్షాలు బ‌హిష్క‌రించాయి. డీఎంకే ఎంపీ క‌నిమెళి మాత్రం హాజ‌ర‌య్యారు.

Also Read..

ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హ‌స్తం.. UNSC సంచలన నివేదిక

బొద్దింక‌లు మురికి కాలువ‌ల నుంచేగా వ‌స్తాయి.. నేన‌న్న‌దాంట్లో త‌ప్పేముంది..? : కంగన‌

ఇండియ‌న్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజ‌ర్‌

Advertisement
Advertisement