త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah | చ‌ర్చ‌కు నేను సిద్ధం.. విప‌క్షాల‌కు అమిత్ షా స‌వాల్‌

Amit Shah | విప‌క్షాల ఆందోళ‌న‌ల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తొలిసారి స్పందించారు. స‌భ‌లో చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మేన‌ని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇందుకోసం 24 గంట‌ల స‌మ‌యాన్ని కేటాయించారు. ఏ ప్ర‌శ్న‌కైనా స‌మాధానం ఇవ్వ‌డానికి తాను సిద్ధం అని ప్ర‌క‌టించారు.

D

National | Published On Aug 12, 2026, 1.51 pm IST

Amit Shah | చ‌ర్చ‌కు నేను సిద్ధం.. విప‌క్షాల‌కు అమిత్ షా స‌వాల్‌
Advertisement
  • ఏ ప్ర‌శ్న‌కైనా స‌మాధానం ఇస్తా
  • ప్ర‌తిప‌క్షాలే ముందుకు రావ‌డం లేదు.. అమిత్ షా
  • ఆయ‌న ఉప‌న్యాసం వినే ఆస‌క్తి ప్ర‌తిప‌క్షానికి లేద‌న్న రాహుల్‌
  • విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు..?..
  • అమిత్ షా భ‌య‌ప‌డుతున్నారు

Amit Shah | త్రినేత్ర‌.న్యూస్ : నీట్ పేప‌ర్ లీక్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌పై పోలీసుల చ‌ర్య‌ల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స‌భ‌కు వ‌చ్చి ప్ర‌క‌ట‌న చేయాలంటూ ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్న విష‌యం తెలిసిందే. విప‌క్షాల ఆందోళ‌న‌ల‌తో స‌భా కార్య‌క‌లాపాలు ముందుకు సాగ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఈ అంశంపై అమిత్ షా (Amit Shah) తొలిసారి స్పందించారు. స‌భ‌లో చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మేన‌ని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇందుకోసం 24 గంట‌ల స‌మ‌యాన్ని కేటాయించారు. ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ తానే స్వ‌యంగా స‌మాధానం ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మేన‌ని.. మ‌రి మీరు సిద్ధ‌మేనా అంటూ ప్ర‌తిప‌క్షానికి స‌వాల్ విసిరారు.

ఇవాళ ఉద‌యం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో మీడియాతో షా మాట్లాడారు. తాను చ‌ర్చ‌కు సిద్ధంగానే ఉన్నాన‌ని.. అయితే, ప్ర‌తిప‌క్షాలే ముందుకు రావ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. "మధ్యాహ్నం 2 గంటలలోపు స్పీకర్‌కు ఓ లేఖ సమ‌ర్పించండి. ఈ అంశంపై ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచే చర్చను ప్రారంభిద్దాం. రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కూ చ‌ర్చ‌ను కొన‌సాగిద్దాం. చ‌ర్చ స‌మ‌యంలో నేను స‌భ‌లోనే ఉంటాను. ఏ ప్ర‌శ్న‌కైనా స‌మాధానం ఇవ్వ‌డానికి నేను సిద్ధం. చ‌ర్చ జ‌ర‌గాలా లేక స‌భ‌కు అంత‌రాయం క‌లిగించాలా అనేది ప్ర‌తిప‌క్ష‌మే నిర్ణ‌యించుకోవాలి" అని షా స్ప‌ష్టం చేశారు. పార్లమెంటరీ నిబంధనలు, ప్రక్రియల ప్రకారమే సమగ్ర చర్చ జరగాలన్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కావడం సరికాదని పేర్కొన్నారు.

నేను రోజూ పార్ల‌మెంట్‌కు వ‌స్తున్నా..

అదే స‌మ‌యంలో తాను క‌నిపించ‌కుండా పోయాన‌ని, చ‌ర్చ నుంచి పారిపోతున్నానంటూ ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై షా తీవ్రంగా స్పందించారు. వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన‌ప్ప‌టి (Parliament Monsoon Session) నుంచి తాను క్ర‌మం త‌ప్ప‌కుండా పార్ల‌మెంట్‌కు వ‌స్తున్న‌ట్లు చెప్పారు. "నేను ప్ర‌తి రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా పార్ల‌మెంట్‌కు వ‌స్తున్నాను. నా ఛాంబ‌ర్‌లోనే కూర్చుంటున్నాను. ఉభ‌య‌స‌భ‌ల్లో విపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. పార్లమెంటు కార్యకలాపాలకు పదేపదే అంతరాయం క‌లిగిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి..? ఆ స‌మ‌యంలో స‌భ‌కు వెళ్లినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు" అని షా వ్యాఖ్యానించారు.

ఎవ‌రు పారిపోతున్నారో ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారు..

చ‌ర్చ‌కు ముందుకు రాకుండా విప‌క్షాలు ఆందోళ‌న‌లు చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. ఈ అంశానికి సంబంధించిన అన్ని కోణాల‌పై చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశార‌ని షా పేర్కొన్నారు. కానీ వారు (ప్ర‌తిప‌క్షాన్ని ఉద్దేశిస్తూ) ఎలాంటి చ‌ర్చా జ‌ర‌గ‌నివ్వ‌కుండా గంద‌ర‌గోళం సృష్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇప్పుడు ఎవ‌రు పారిపోతున్నారో ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని షా వ్యాఖ్యానించారు. "మా ప్ర‌భుత్వం ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉంది. ఇక్క‌డ‌ దాచడానికి ఏమీ లేదు. విప‌క్షాలు లేవ‌నెత్తుతున్న అంశాల‌న్నింటిపై అన్ని కోణాల్లోనూ చ‌ర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. నేను స‌భ‌లో కూర్చొని అంద‌రి మాట‌లూ వింటా. వాటిని నోట్ చేసుకుని అన్నింటికీ స‌మాధాన‌మిస్తా" అని అమిత్ షా స్ప‌ష్టం చేశారు.

ఆయ‌న ఉప‌న్యాసం వినే ఆస‌క్తి మాకు లేదు : రాహుల్ గాంధీ

చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మేనంటూ షా చేసిన ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తోసిపుచ్చారు. ఆయ‌న ఉప‌న్యాసం వినే ఆస‌క్తి ప్ర‌తిప‌క్షానికి లేద‌ని వ్యాఖ్యానించారు. "ఆయన చెప్పేది మాకు అనవసరం" అని వ్యాఖ్యానించారు. నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల అణ‌చివేత చ‌ర్య‌ల‌పై సమాధానాలు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అదే స‌మ‌యంలో షా స‌భ‌కు ఎందుకు రావ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. "గత 20 రోజులుగా అమిత్ షా కనిపించడం లేదు. స‌భ‌కు వ‌చ్చేందుకు ఆయ‌న భ‌య‌ప‌డుతున్నారు. విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు..? ఆందోళనకారులపై కాల్పులకు ఆదేశించింది ఎవరు..? ఈ ఘటనలకు బాధ్యత హోంమంత్రిదే. ఆయ‌న రాజీనామా చేయాలి" అని రాహుల్ డిమాండ్ చేశారు.

Also Read..

ఇన్‌ఫ్ల్యూయెన్స‌ర్ల మాయ‌లో ప‌డొద్దు.. యువ‌త‌కు మోదీ కీల‌క సందేశం

‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వ‌చ్చేసింది.. ఇక‌ స‌మాచార లోడ్‌ను నియంత్రించొచ్చు

స్పేస్‌ఎక్స్‌ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..

Advertisement
Advertisement