త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Hyderabad | డ‌బ్బు కోసం మ‌నుషులు ఎంత‌కైనా తెగిస్తున్నారు. తీసుకున్న అప్పు (Debt) తీర్చ‌లేద‌ని అభంశుభం తెలియ‌ని 21 రోజుల ప‌సికందును (Infant) న‌లుగురు వ్య‌క్తులు త‌ల్లిఒడి నుంచి ఎత్తుకెళ్లారు.

G

Hyderabad | Published On Aug 13, 2026, 11.21 am IST

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: డ‌బ్బు కోసం మ‌నుషులు ఎంత‌కైనా తెగిస్తున్నారు. తీసుకున్న అప్పు (Debt) తీర్చ‌లేద‌ని అభంశుభం తెలియ‌ని 21 రోజుల ప‌సికందును (Infant) న‌లుగురు వ్య‌క్తులు త‌ల్లిఒడి నుంచి ఎత్తుకెళ్లారు. చిన్నారిని తీసుకెళ్లొద్ద‌ని ఆ త‌ల్లి కాళ్లపై ప‌డినా వారు క‌నిక‌రించ‌లేదు. ఈ అమానుష‌ ఘ‌ట‌న హైద‌రాబాద్ (Hyderabad) శివార్ల‌లోని రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలో ఉన్న హ‌నుమాన్ న‌గ‌ర్‌లో జ‌రిగింది.

హ‌నుమాన్ న‌గ‌ర్‌కు చెందిన అనిత‌, రాఘ‌వేంద‌ర్ దంప‌తులు. రాఘ‌వేంద‌ర్ ఆటోడ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. కుటుంబ అవ‌స‌రాల కోసం హ‌ఫీజ్‌పేట‌లో ఉన్న స‌మ‌యంలో ఇంటి ప‌క్క‌న నివ‌సించే మంజుల అనే మ‌హిళ వ‌ద్ద రూ.30 వేలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తిరిగి చెల్లించే విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు అనిత ఇంటికి వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కలిసి త‌ల్లి ఒడిలో ఉన్న‌ 21 రోజుల పసిబాబును బ‌ల‌వంతంగా తీసుకుని ఆటోలో వెళ్లిపోయారు.

బిడ్డను తీసుకెళ్లొద్దంటూ వారి కాళ్లపై పడి వేడుకున్నప్పటికీ.. ఆమెను పక్కకు నెట్టివేసి బాబును తీసుకుని పోయారు. గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో ఘటనాస్థలాన్ని ప‌రిశీలించిన రాజేంద్రనగర్ పోలీసులు.. సీసీ కెమెరాలు, స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో రెండు గంటల్లోనే బాబును గుర్తించారు. అతడిని తిరిగి తల్లికి అప్పగించారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో కేసు న‌మోదుచేసి, నిందుతుల‌ను అరెస్టు చేశారు.

 

Advertisement
Advertisement