త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uddhav Thackeray | ఉద్ధ‌వ్ సేన‌లో 2022 నాటి సీన్ రిపీట్‌..?

Uddhav Thackeray | మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఉత్కంఠ రేపుతున్నాయి. ఉద్ధ‌వ్ (Uddhav Thackeray) సేన‌లో 2022 నాటి చీలిక మ‌ళ్లీ పున‌రావృత‌మ‌య్యే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.

D

National | Published On Jun 17, 2026, 11.38 am IST

Uddhav Thackeray | ఉద్ధ‌వ్ సేన‌లో 2022 నాటి సీన్ రిపీట్‌..?
Advertisement
  • అప్పుడు అసెంబ్లీ.. ఇప్పుడు లోక్‌స‌భను ట‌చ్ చేసిన షిండే
  • స్పీకర్‌ను కలిసేందుకు సిద్ధ‌మైన ఆరుగురు ‘UBT’ ఎంపీలు
  • ఒక్కో ఎంపీకి రూ.50 కోట్లు ఆఫ‌ర్ : సంజ‌య్ రౌత్‌

Uddhav Thackeray | మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఉత్కంఠ రేపుతున్నాయి. ఉద్ధ‌వ్ (Uddhav Thackeray) సేన‌లో 2022 నాటి చీలిక మ‌ళ్లీ పున‌రావృత‌మ‌య్యే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. ఉద్ధ‌వ్ ఠాక్రే వ‌ర్గానికి చెందిన శివ‌సేన‌లో చీలిక త‌ప్ప‌ద‌న్న వార్త‌లు ఊపందుకున్నాయి. శివసేన (యూబీటీ)కి చెందిన ప‌లువురు ఎంపీలు మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలోకి చేరేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది.

'ఆపరేషన్ టైగర్' పేరుతో సాగుతున్న ఈ పరిణామాల్లో భాగంగా.. శివసేన (UBT) ఎంపీలు బుధవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నివాసంలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భేటీ అనంత‌రం.. ఠాక్రే వ‌ర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌మ‌ను స‌భ‌లో ప్ర‌త్యేక గ్రూపుగా గుర్తించాల‌ని కోరే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఢిల్లీలో షిండే..

అదే స‌మ‌యంలో మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ఢిల్లీలో ఉండ‌టం కూడా ఈ వార్త‌లకు మ‌రింత బ‌లం చేకూరుస్తోంది. స్పీక‌ర్‌తో స‌మావేశంలో షిండే కూడా స్వయంగా పాల్గొనే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఆ ఎంపీలు వీళ్లేనా..?

ప్ర‌స్తుతం ఠాక్రే వ‌ర్గంలో మొత్తం తొమ్మిది మంది లోక్‌స‌భ ఎంపీలు ఉన్న విష‌యం తెలిసిందే. వారిలో ఆరుగురు షిండే వ‌ర్గంతో ట‌చ్‌లో ఉన్న‌ట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ మారే వారిలో సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, నాగేష్ పాటిల్ అస్తికార్, ఓంరాజే నింబాల్కర్, భావూసాహెబ్ వాక్‌చౌరే, సంజయ్ జాదవ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఒక్కో ఎంపీకి రూ.50 కోట్లు

ఉద్ధ‌వ్ సేన‌లో చీలిక మ‌ళ్లీ త‌ప్ప‌దంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్‌, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ (Sanjay Raut) చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వేడిన పుట్టిస్తున్నాయి. త‌మ వ‌ర్గానికి చెందిన ఎంపీల‌కు ఒక్కొక్క‌రికి రూ.50 కోట్లు ఆఫ‌ర్ చేసిన‌ట్లు రౌత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. "బీజేపీ డబ్బు ఎరచూపి ఎంపీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. మహారాష్ట్ర ఎంపీలను కొనడానికి.. ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తున్నారు" అంటూ రౌత్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

వాళ్లు రూ.50 వేలు కూడా విలువ చేయ‌రు..

ఈ పోస్టుకు టీఎంసీ ఫైర్‌బ్రాండ్‌, ఎంపీ మ‌హువా మోయిత్రా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఆమె పోస్టుపై స్పందించిన రౌత్ ఒక్కో ఎంపీని రూ.50 కోట్ల‌తో కొనేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని వివ‌రించారు. రూ.15 కోట్లు కేవ‌లం అడ్వాన్స్ మాత్ర‌మేన‌ని చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ ఎంపీలు క‌నీసం రూ.50,000 కూడా విలువ చేయ‌ర‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం రౌత్ పోస్ట్ రాజ‌కీయ దుమారానికి దారి తీస్తోంది.

2022లో కూడా..

కాగా, 2022లో శివసేనను చీల్చి ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పడగొట్టిన ఏకనాథ్ షిండే బీజేపీతో చేతులు క‌లిపి సీఎం కుర్చీ ఎక్కారు. ఆ త‌ర్వాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి అధిక మెజారిటీ రావ‌డంతో దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సీఎం అయ్యారు. ప్ర‌స్తుతం షిండే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అప్పుడు అసెంబ్లీ వేదిక‌గా పార్టీని చీల్చిన షిండే.. ఇప్పుడు లోక్‌సభ వేదికగా రెండోసారి అలాంటి వ్యూహాత్మక దెబ్బ కొట్టేందుకు సిద్ధ‌మ‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read..

ఏకంగా ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లారు.. న‌గ‌దు కాజేసీ, పెట్రోల్‌తో కాల్చేశారు..

బులియ‌న్ మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న అనిశ్చితి.. స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..

లాభాల్లో ప్రారంభ‌మైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మ‌రింత త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

Advertisement
Advertisement