Social Media | సోషల్ మీడియా కంటెంట్తో 12 ఏళ్ల బాలిక కథ విషాదాంతం.. మెటా, టిక్టాక్పై కుటుంబాల న్యాయ పోరాటం..
Social Media | ఒకప్పుడు టీనేజ్లో ఉన్న పిల్లలు ఎక్కువగా బయట క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ టెక్నాలజీ వేగంగా మార్పు చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నందున కుటుంబాల్లో పిల్లలకు వాటిని యాక్సెస్ చేయడం సాధారణమైపోయింది.
Technology | Published On Jun 17, 2026, 4.05 pm IST
Social Media | ఒకప్పుడు టీనేజ్లో ఉన్న పిల్లలు ఎక్కువగా బయట క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ టెక్నాలజీ వేగంగా మార్పు చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నందున కుటుంబాల్లో పిల్లలకు వాటిని యాక్సెస్ చేయడం సాధారణమైపోయింది. ఫోన్ ఇవ్వకపోతే భోజనం చేయబోమని, స్కూలుకు వెళ్లమని, హోం వర్క్ చేయమని ఇలా రకరకాలుగా పిల్లలు తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ కూడా చేస్తుంటారు. దీంతో పిల్లల కోరికలకు తల్లిదండ్రులు తలొగ్గక తప్పడం లేదు. అయితే అక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ఫోన్ల వినియోగం, అందులోనూ సోషల్ మీడియా ఉపయోగం మరీ అధికమైతే అవి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే ఇటలీలో చోటు చేసుకున్న ఓ 12 ఏళ్ల బాలిక ఉదంతాన్ని వారు వివరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా డిప్రెషన్ రిలేటెడ్ కంటెంట్ చూడడం వల్ల ఆమె ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చింది.
కొన్ని నెలల్లోనే భారీ మార్పు..
ఇటలీలోని ఆస్టి పట్టణానికి చెందిన ఐరీన్ రోజెరో ఉగ్వెస్ తన 12 ఏళ్ల కుమార్తె రొస్సెల్లా ప్రవర్తనలో కేవలం కొన్ని నెలల్లోనే పెద్ద మార్పును గమనించింది. సోషల్ మీడియాలో వరుసగా స్వీయహానికర కంటెంట్ కనిపించడం ప్రారంభమైన తర్వాత ఆమె మానసిక పరిస్థితి క్రమంగా దిగజారిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చివరకు రొస్సెల్లా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుమార్తె మరణించిన తర్వాతే ఐరీన్, ఆమె భర్త రొస్సెల్లా ఉపయోగించిన డివైస్లను పరిశీలించారు. అప్పుడే ఆమె సోషల్ మీడియాను తమకు తెలిసిన దానికంటే చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు బయటపడింది. అంతేకాకుండా జస్ట్ ఎ డెడ్ పర్సన్ అనే పేరుతో ఒక రహస్య ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ను కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ పేరులో ఓ అనే ఆంగ్ల అక్షరానికి బదులుగా 0 ఉపయోగించినట్లు వారు తెలిపారు.

డిప్రెషన్ రిలేటెడ్ కంటెంట్ చూసినందునే..
2023 సెప్టెంబర్లో రొస్సెల్లా తన మానసిక స్థితికి అనుగుణంగా ఉన్న డిప్రెషన్కు సంబంధించిన కంటెంట్ను వెతకడం ప్రారంభించిందని కుటుంబం తెలిపింది. ఆమె చూసిన కంటెంట్కు అనుగుణంగా సోషల్ మీడియా అల్గోరిథమ్లు అలాంటి మరింత కంటెంట్ నే ఆమెకు చూపించడం కొనసాగించాయని వారు ఆరోపిస్తున్నారు. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే పరిస్థితి విషాదాంతానికి దారితీసిందని చెబుతున్నారు. ఒక దశలో అది తనంతట తానే పెరుగుతున్న శక్తిలా మారిందని, ఆమె ఉల్లాసభరితమైన, అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావాన్ని పూర్తిగా మింగేసిందని ఐరీన్ రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. దీంతో రొస్సెల్లా తల్లిదండ్రులు ఇప్పుడు మెటా, టిక్టాక్లపై కోర్టులో కేసు వేశారు. ఇటలీలో సోషల్ మీడియా సంస్థలు, వాటి అల్గోరిథమ్లను నేరుగా సవాలు చేస్తూ దాఖలైన తొలి సామూహిక కేసుగా ఇది నిలిచింది. మైనర్లకు సోషల్ మీడియా ప్రాప్యతపై మరింత కఠినమైన పరిమితులు విధించాలని, ప్రమాదాలపై అవగాహన పెంచాలని కుటుంబాలు కోరుతున్నాయి.
ఆరోపణలను ఖండించిన మెటా, టిక్టాక్..
అయితే ఈ ఆరోపణలను మెటా, టిక్టాక్ రెండూ ఖండించాయి. యువ వినియోగదారుల రక్షణ కోసం హానికర కంటెంట్ను తొలగించడం, ప్రమాదకర కంటెంట్ ప్రదర్శనను పరిమితం చేయడం, కుటుంబాలకు ఖాతాల నిర్వహణలో సహాయపడటం వంటి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్లైన్ భద్రతపై ఆందోళన చెందుతున్నారని తమకు తెలుసని మెటా ప్రతినిధి తెలిపారు. టీన్ అకౌంట్స్ తదితర భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యువత మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు తాము దీర్ఘకాలికంగా కట్టుబడి ఉన్నామని చెప్పారు. టిక్టాక్ కూడా మానసిక, ప్రవర్తనా ఆరోగ్యాన్ని కాపాడేందుకు కఠినమైన మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని తెలిపింది. నిబంధనలకు విరుద్ధమైన 99 శాతం కంటే ఎక్కువ కంటెంట్ను తొలగిస్తున్నామని వెల్లడించింది. అలాగే సిఫార్సు అయ్యే కంటెంట్లో వైవిధ్యం తీసుకురావడం, ప్రమాదకర సెర్చ్లను అడ్డుకోవడం, అవసరమైన వారికి సహాయ వనరులు అందించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.

సోషల్ మీడియా లేకపోతే నా కుమార్తె బతికి ఉండేది: ఐరీన్
రొస్సెల్లా విషయంలో ఇన్స్టాగ్రామ్ పాత్రపై ప్రత్యేకంగా ప్రశ్నించగా, కేసు కోర్టులో ఉన్నందున నేరుగా స్పందించబోమని మెటా తెలిపింది. యువత మానసిక ఆరోగ్యం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, సోషల్ మీడియా ప్రభావం దాని వినియోగ విధానం, భద్రతా చర్యలు, తల్లిదండ్రుల భాగస్వామ్యంపై ఆధారపడుతుందని పేర్కొంది. ఐరీన్ తెలిపిన ప్రకారం ఈ విషాదం ఒక ఆకస్మికమైన తీవ్రమైన వ్యాధిలా కుటుంబాన్ని చుట్టుముట్టిందని, అల్గోరిథమ్ ప్రభావం లేకపోయి ఉంటే తన కుమార్తె ఎదుర్కొంటున్న మానసిక ఇబ్బందులు సహజంగా వేరే దిశలో అభివృద్ధి చెంది ఉండేవని ఆమె భావించింది. కాగా యూరప్ అంతటా డిజిటల్ ప్లాట్ఫామ్లపై పర్యవేక్షణ పెరుగుతోంది. బ్రిటన్ తాజాగా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే ప్రణాళికలను ప్రకటించింది. అమెరికాలో కూడా యువతకు హానికరంగా భావించిన ప్లాట్ఫామ్ల రూపకల్పన విషయంలో మెటా, గూగుల్ నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఓ తీర్పు పేర్కొంది.
తల్లిదండ్రులను ఏమార్చి..
యూరోపియన్ యూనియన్ నియంత్రణ సంస్థలు డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ అమలును మరింత కఠినతరం చేస్తున్నాయి. మైనర్ల రక్షణ, హానికర కంటెంట్ నియంత్రణలో ఆన్లైన్ ప్లాట్ఫామ్లు మెరుగైన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది స్టెఫానో కొమ్మోడో మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రయోజనాలను తిరస్కరించడం తమ లక్ష్యం కాదన్నారు. అయితే అత్యంత బలహీన వర్గాలైన యువ వినియోగదారులకు హానికరంగా మారే సాంకేతిక, మార్కెటింగ్ వ్యవస్థలను తొలగించాలనేదే తమ ఉద్దేశమని వివరించారు. ఇటలీలోని పెద్ద కుటుంబాల సంఘం బోర్డు సభ్యురాలు వాలెంటినా మురాగ్లి కూడా ప్రస్తుత భద్రతా చర్యలు సరిపోవని అభిప్రాయపడ్డారు. పిల్లలు ఫిల్టర్లను ఎలా దాటవేయాలో, సమయ పరిమితులను ఎలా తప్పించుకోవాలో ఆన్లైన్లోనే నేర్చుకుంటున్నారని చెప్పారు. సోషల్ మీడియా వినియోగాన్ని పర్యవేక్షించడం పూర్తి సమయ ఉద్యోగంలాంటిదని, అది తల్లిదండ్రులకు సాధ్యం కాదని అన్నారు.

నిరంతరం స్కోలింగ్లో విహారం..
తన కుమారుడు ఆంటోనియో ఉదాహరణను ప్రస్తావిస్తూ ఒకప్పుడు హ్యారీ పోటర్ పుస్తకాలు చదివే అతను టీనేజ్లో ఫోన్ చేతికి వచ్చిన తర్వాత చదవడం మానేసి నిరంతరం స్క్రోలింగ్లో మునిగిపోయాడని చెప్పారు. ఇప్పుడు అతనికి లోతుగా చదివే అలవాటు తగ్గిపోయిందని, దీనికి సోషల్ మీడియా అల్గోరిథమ్లే కారణమని ఆమె ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప్రకారం వ్యసన లక్షణాలను పోలిన సమస్యాత్మక సోషల్ మీడియా వినియోగం యువతలో పెరుగుతోందని తేలింది. ఇది తక్కువ శ్రేయస్సు, నిద్రలేమి, ఇతర ఆరోగ్య సమస్యలతో సంబంధం కలిగి ఉందని హెచ్చరిస్తోంది. అమెరికాకు చెందిన జామా పీడియాట్రిక్స్లో ప్రచురితమైన అధ్యయనాలు కూడా ఎక్కువగా సోషల్ మీడియా ఉపయోగించే యువతలో మెదడు అభివృద్ధిలో స్పష్టంగా బయట పడే మార్పులు కనిపిస్తున్నాయని సూచించాయి. ముఖ్యంగా ఇంకా అభివృద్ధి దశలో ఉన్న టీనేజ్ మెదళ్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాయి.
భిన్న రకాల అభిప్రాయాలు..
ఇటాలియన్ వ్యాజ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు స్లాట్ మెషీన్ల మాదిరిగా రివార్డ్ వ్యవస్థలను ఉపయోగించి వినియోగదారుల్లో ఆధారపడే స్వభావాన్ని పెంచుతున్నాయని వాదిస్తున్నారు. లైక్లు, నోటిఫికేషన్లు డోపమైన్ విడుదలను ప్రేరేపించి వ్యసనానికి దగ్గరైన ప్రవర్తనను సృష్టిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు మానసిక నిపుణులు సోషల్ మీడియా ప్రభావంపై సులభమైన నిర్ణయాలకు రావద్దని హెచ్చరిస్తున్నారు. రోమ్లోని జెమెల్లీ ఆసుపత్రి వెబ్ సైకోపాథాలజీ కేంద్ర అధిపతి ఫెడెరికో టోనియోని మాట్లాడుతూ సోషల్ నెట్వర్క్లు లేకుంటే యువత సమస్యలు తగ్గిపోతాయని తాను కచ్చితంగా చెప్పలేనని అన్నారు. తల్లిదండ్రుల అధిక నియంత్రణ కూడా ప్రమాదకరమని, పిల్లలను వినడం, వారిపై నమ్మకం ఉంచడమే ఆరోగ్యకరమైన మార్గమని సూచించారు. తన కుమార్తెను రక్షించడానికి ఆలస్యంగా తెలిసిన ప్రమాదాల గురించి ఇతర తల్లిదండ్రులకు ముందుగానే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ కేసులో చేరానని ఐరీన్ తెలిపారు. తాము కొన్ని ప్రమాదాలను తక్కువగా అంచనా వేశామని, అవి ఉన్నాయనే విషయం కూడా తెలియదని, కానీ ఇతరులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. దీనిని తనతోనే ఆపేయడంలో ప్రయోజనం లేదని, రొస్సెల్లాకు కూడా అది అభ్యంతరంగా ఉండేదని తాను అనుకోనని ఆమె చెప్పింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Pavel Durov Reliance | భారత్లో టెలిగ్రామ్ బ్యాన్పై రిలయన్స్, వాట్సప్ కుట్ర! సీఈఓ సంచలన ఆరోపణలు.. అసలు నిజమేంటి?
- ●TG Weather | తెలంగాణలో నాలుగురోజులు వడగాలులు, వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..
- ●Ponguleti Srinivasa Reddy | రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు.. గుడిసెల వాసులకే తొలి ప్రాధాన్యత : మంత్రి పొంగులేటి
- ●Donald Trump Iran Deal | మళ్లీ బాంబులు వేస్తాం.. ఇరాన్తో డీల్ ఇంకా ఫైనల్ కాలేదు: జీ7 సమ్మిట్లో డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
- ●Gellu Srinivas Yadav | 'మన ఊరు - మన బడి' కిందనే 'ఆరుట్ల స్కూల్' అభివృద్ధి.. సీఎం రేవంత్కు గెల్లు శ్రీనివాస్ కౌంటర్
- ●Pizza Hut | అమ్మకానికి పిజ్జా హట్.. 2.7 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు డీల్..!

Pavel Durov Reliance | భారత్లో టెలిగ్రామ్ బ్యాన్పై రిలయన్స్, వాట్సప్ కుట్ర! సీఈఓ సంచలన ఆరోపణలు.. అసలు నిజమేంటి?

TG Weather | తెలంగాణలో నాలుగురోజులు వడగాలులు, వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..

Ponguleti Srinivasa Reddy | రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు.. గుడిసెల వాసులకే తొలి ప్రాధాన్యత : మంత్రి పొంగులేటి

Donald Trump Iran Deal | మళ్లీ బాంబులు వేస్తాం.. ఇరాన్తో డీల్ ఇంకా ఫైనల్ కాలేదు: జీ7 సమ్మిట్లో డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్






