త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Economic Survey | ఉచితాలు ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ముప్పే..!

Economic Survey | దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ పార్టీలు న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ఒక పార్టీని మించి మ‌రో పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఉచితాల పేరుతో ఓట‌ర్ల‌కు గాలం వేస్తున్నాయి. ఈ తాయిలాల ట్రెండ్ ఒక రాష్ట్రం నుంచి మ‌రో రాష్ట్రానికి విస్త‌రిస్తున్న‌ది. ఈ ఫ్రీబీస్ దీర్ఘ‌కాలిక ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై పెను ప్ర‌భావం చూపుతుందంటూ ఆర్థిక స‌ర్వే ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

P

National | Published On Jan 30, 2026, 4.50 pm IST

Economic Survey | ఉచితాలు ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ముప్పే..!
Advertisement
  • రాష్ట్రాల‌కు గుదిబండ‌గా ప‌థ‌కాలు
  • ఖ‌జానాల‌పై తీవ్ర ఒత్తిడి
  • మౌలిక వ‌స‌తులు, కీల‌క ప్రాజెక్టులకు నిధుల కొర‌త‌
  • ఫ్రీ బీస్‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఆర్థిక స‌ర్వే..

Economic Survey | దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ పార్టీలు న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ఒక పార్టీని మించి మ‌రో పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఉచితాల పేరుతో ఓట‌ర్ల‌కు గాలం వేస్తున్నాయి. ఈ తాయిలాల ట్రెండ్ ఒక రాష్ట్రం నుంచి మ‌రో రాష్ట్రానికి విస్త‌రిస్తున్న‌ది. ఈ ఫ్రీబీస్ దీర్ఘ‌కాలిక ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై పెను ప్ర‌భావం చూపుతుందంటూ ఆర్థిక స‌ర్వే ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

రాష్ట్ర ఖ‌జానాల‌పై ఒత్తిడి ప‌డే ఛాన్స్‌..

కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ గురువారం పార్ల‌మెంట్‌లో ఆర్థిక స‌ర్వేను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఎక‌నామిక్ స‌ర్వే 2025–26 ఈ నగదు బదిలీలు తాత్కాలికంగా ఉపశమనం క‌లిగిస్తున్నా.. దీర్ఘకాలం కొన‌సాగితే.. స‌రైన రూప‌క‌ల్ప‌న లేక‌పోతే రాష్ట్ర ఖ‌జానాల‌పై తీవ్ర ఒత్తిడి ప‌డే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. వృద్ధిని ప్రోత్స‌హించే కీల‌క ప్రాజెక్టుల‌కు నిధులు త‌గ్గే ఛాన్స్ ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కాల ఖ‌ర్చు 1.7ల‌క్ష‌ల కోట్ల‌కు..

స‌ర్వే అంచ‌నాల ప్ర‌కారం.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో నగదు బదిలీ పథకాలపై మొత్తం ఖర్చు సుమారు రూ.1.7 లక్షల కోట్లకు చేరనుంది. ఇప్పటికే కఠినమైన బడ్జెట్ పరిమితులు, పెరుగుతున్న రుణభారం ఉన్న నేపథ్యంలో ఈ పథకాలను జాగ్రత్తగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ప్రస్తుతం అనేక రాష్ట్రాలు మహిళలు, ఇత‌ర వ‌ర్గాల ఓట‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాయి.

ఏ రాష్ట్రాలు.. ఏ ప‌థ‌కాలు..

మ‌హారాష్ట్ర‌లో బీజేపీ-శివ‌సేన కూట‌మి ప్ర‌భుత్వం మాఝీ ల‌డ్కీ బ‌హిన్ యోజ‌న‌కు రూ.36వేల‌కోట్లు కేటాయించింది. క‌ర్నాట‌క‌లోని సిద్ధ‌రామ‌య్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కానికి రూ.28,608 కోట్లు వెచ్చిస్తోంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2వేలు ఖాతాల్లో జ‌మ చేస్తోంది. మ‌ధ్యప్ర‌దేశ్ బీజేపీ ప్ర‌భుత్వం లాడ్లీ బెహ్నా యోజ‌న‌కు రూ.20,450 కోట్లు కేటాయించింది. తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ స‌ర్కారు ఆరు గ్యారంటీల‌కు దేశంలోనే అత్య‌ధికంగా రూ.56,084 కోట్లు కేటాయించింది. ఇందులో మ‌హాల‌క్ష్మి, రైతుభ‌రోసా స‌హా త‌దిత‌ర ప‌థ‌కాలున్నాయి.

జీడీపీలో 1.25శాతం ప‌థ‌కాల‌కే..

ఎక‌నామిక్ స‌ర్వే ప్ర‌కారం.. 2022–23 నుంచి 2025–26 మధ్యకాలంలో నిబంధ‌న‌ల్లేని న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య ఐదురెట్లు పెరిగింది. ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఈ రాష్ట్రాలు సగానికి పైగా ఇప్పటికే ఆదాయ లోటుతో (Revenue Deficit) న‌డుస్తున్నాయి. ఈ పథకాలు రాష్ట్రాల స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP)లో 0.19 శాతం నుంచి 1.25 శాతం వరకు ఖ‌ర్చు చేస్తున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో మొత్తం ప్రభుత్వ వ్యయంలో 8 శాతం కంటే ఎక్కువ భాగం ఈ పథకాలకే వెచ్చిస్తున్నాయి.

జీడీపీలో 28.1శాతం రుణ‌భారం..

న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కాలు ప‌లు రాష్ట్రాల్లో స్వయం ఉపాధి మహిళల ఆదాయంలో ఈ వాటా 87 శాతం వరకు ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే, కనీసం సగం జనాభాకు నెలవారీ వినియోగ ఖర్చుల్లో 40–50 శాతం వరకు ఈ నగదు బ‌దిలీ ప‌థ‌కాలు స‌హాయ‌క‌రంగా ఉంటున్నాయి. అయితే, వీటి వెనుక తీవ్ర‌మైన ఆర్థిక ఒత్తిడి ఉంద‌ని ఎక‌నామిక్ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. రాష్ట్రాల స‌మ‌ష్టి ఆర్థిక లోటు 2021-22లో జీడీపీలో 2.6శాతం ఉండ‌గా.. 2024-25 నాటికి అది 3.2శాతానికి పెరిగింది. మొత్తం రాష్ట్రాల రుణ‌భారం జీడీపీలో సుమారు 28.1శాతానికి చేరింది. జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు వంటి స్థిర ఖర్చులు ఇప్పటికే రాష్ట్రాల ఆదాయంలో దాదాపు 62 శాతం వెళ్తోంద‌ని స్ప‌ష్టం చేసింది.

సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..

ఎక‌నామిక్ స‌ర్వేపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఉచితాల‌పై ఆధార‌ప‌డిన ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి కాద‌ని.. అది కేవ‌లం మాయ మాత్ర‌మేన‌ని ఓ యూజ‌ర్ పేర్కొన్నారు. ఇలాంటి ప‌థ‌కాలు బ‌డ్జెట్ లోటు, అప్పులు, ద్ర‌వ్యోల్బ‌ణాన్ని పెంచుతాయ‌ని, ప‌న్నుల పెంపు ప్ర‌జ‌ల పొదుపు, పెట్టుబ‌డులు, వినియోగంపై ప్ర‌భావం చూపుతుంద‌ని మ‌రో యూజ‌ర్ తెలిపారు. రాజ‌కీయ పార్టీలు త‌మ సొంత జేబుల నుంచి డ‌బ్బులు ఇవ్వ‌డం లేద‌ని.. ప్ర‌భుత్వ లోటు, వాటి ప్ర‌భావాన్ని ప్ర‌జ‌లు అర్థం చేసుకోక‌పోతే ఇదే కొన‌సాగుతుంద‌ని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. ఉచితాలు ఇవ్వ‌డం క‌న్నా ప్ర‌జ‌లు స్వ‌యంగా సంపాదించి వాటిని చెల్లించ‌గ‌లిగేలా అవ‌కాశాలు క‌ల్పించాల‌ని మ‌రో నెటిజ‌న్ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించాడు.

మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు నిధుల కొర‌త‌..

న‌గ‌దు బ‌దిలీలు మ‌హిళ‌ల‌కు ఆరోగ్య‌, వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు త‌క్ష‌ణ స‌హాయంగా ఉంటున్న‌ప్ప‌టికీ.. వీటికి స్ప‌ష్ట‌మైన ప‌రిమితులు ఉన్నాయ‌ని స‌ర్వే హెచ్చ‌రించింది. లోటును మ‌రింత పెంచ‌కుండా ఉండేందుకు.. ఈ ప‌థ‌కాల కోసం అద‌నంగా నిధులు ఖ‌ర్చు చేస్తే.. సామాజిక‌, మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు కొర‌త ఏర్ప‌డుతుంద‌ని.. లోటు మ‌రింత పెరిగితే రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా త‌యార‌వుతోంద‌ని హెచ్చ‌రించింది. ప‌థ‌కాల‌కు ముగింపు లేక‌పోవ‌డం, స‌మీక్ష‌లు జ‌రుప‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వాల‌కు ఖ‌ర్చులు గుదిబండ‌గా మారుతున్నాయ‌ని.. నిధుల కొర‌త కార‌ణంగా దీర్ఘ‌కాలిక వృద్ధికి అవ‌స‌ర‌మైన మూల‌ధ‌న వ్య‌యానికి కోత‌లు ప‌డుతున్నాయ‌ని.. ఫ‌లితంగా మ‌ధ్య‌కాలిక వృద్ధిపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతోంద‌ని తెలిపింది. అలాగే, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో కలిపి అమలు చేయని పక్షంలో.. ఈ పథకాలు మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని తగ్గించే ప్రమాదం ఉందని సర్వే ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

Read Also :

Supreme Court | విద్యార్థినుల‌కు బ‌యోడిగ్రేడ‌బుల్ శానిట‌రీ ప్యాడ్స్ ఇవ్వాల్సిందే..!

Ultra-Processed Food | ఆర్థిక సర్వే 2026 హెచ్చరిక: 14 ఏళ్లలో 150 శాతం పెరిగిన జంక్ ఫుడ్ విక్రయాలు – ముంచుకొస్తున్న ఆరోగ్య ముప్పు

Advertisement

తాజావార్తలు

Advertisement