త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే స‌ర్ ల‌క్ష్యం : క‌లెక్ట‌ర్ గ‌రిమ అగ్ర‌వాల్‌

SIR | రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ప‌రిధిలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

P

Telangana | Published On May 20, 2026, 9.45 pm IST

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే స‌ర్ ల‌క్ష్యం : క‌లెక్ట‌ర్ గ‌రిమ అగ్ర‌వాల్‌
Advertisement

SIR | రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ప‌రిధిలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. స‌ర్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో క‌లిసి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ 2026 అక్టోబర్ ఒక‌ట‌వ తేదీని ప్రమాణికంగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ప్రస్తుత ఓటర్ల జాబితాను 2002 నాటి ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నామని తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ బూత్ స్థాయిలో బీఎల్‌ఏలను నియమించి ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో ఒక్క అర్హుడైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకూడదనేదే జిల్లా యంత్రాంగం లక్ష్యమని పేర్కొన్నారు. జూన్ మొదటి వారంలో మండల స్థాయిలో బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 15 నుంచి 24 వరకు ఎస్‌ఐఆర్‌లో పాల్గొనే బీఎల్‌వోలు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహించి కొత్త ఓటర్ల నుంచి నమోదు ఫారాలు స్వీకరిస్తారని తెలిపారు. 2002 ఎస్‌ఐఆర్‌ జాబితాలో లేని ప్రతి ఒక్కరూ తిరిగి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

ఇంటింటి సర్వే సమయంలో బీఎల్‌వోలకు బీఎల్‌ఏలు సహకరించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని, సరైన పత్రాలతో ఫారాలు నింపడంలో సహాయం చేయాలని సూచించారు. మరణించిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు, రెండు చోట్ల ఓటు ఉన్న వారి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. జూలై 31, 2026న డ్రాఫ్ట్ ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో లేదో పరిశీలించాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు, కొత్త క్లెయిమ్‌లు ఉంటే ఆగస్టు 30వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. డ్రాఫ్ట్ జాబితా విడుదలైన తర్వాత మ్యాపింగ్ సరిగా కాకపోతే ఎన్నికల అధికారులు సంబంధిత వారికి నోటీసులు జారీ చేస్తారని తెలిపారు. ఆ సమయంలో భారత పౌరసత్వ నిబంధనల ప్రకారం పుట్టిన సంవత్సరాన్ని ఆధారంగా తీసుకుని అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.

సెప్టెంబర్ 28, 2026 నాటికి అన్ని అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిష్కరించి, అక్టోబర్ 1, 2026న తుది ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటికి వచ్చినప్పుడు ఓటర్లు పూర్తి వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించాలని, తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన బీఎల్‌వో ఎవరో ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇల్లు తాళం వేసి ఉంటే బీఎల్‌వోలు మూడు సార్లు సందర్శిస్తారని చెప్పారు. ఓటర్లు voter.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని పూరించవచ్చని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఫారం-6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వివ‌రించారు.

Advertisement
Advertisement