త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ultra-Processed Food | ఆర్థిక సర్వే 2026 హెచ్చరిక: 14 ఏళ్లలో 150 శాతం పెరిగిన జంక్ ఫుడ్ విక్రయాలు – ముంచుకొస్తున్న ఆరోగ్య ముప్పు

దేశంలో 2009-2023 మధ్య కాలంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ (UPF) విక్రయాలు 150 శాతం పెరిగాయని ఆర్థిక సర్వే 2026 వెల్లడించింది. బిస్కెట్స్, నూడుల్స్ లాంటి ఆహార పదార్థాల వినియోగం వల్ల ఊబకాయం, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రమవుతున్నాయని సర్వే హెచ్చరించింది.

J

National | Published On Jan 29, 2026, 5.59 pm IST

Ultra-Processed Food | ఆర్థిక సర్వే 2026 హెచ్చరిక: 14 ఏళ్లలో 150 శాతం పెరిగిన జంక్ ఫుడ్ విక్రయాలు – ముంచుకొస్తున్న ఆరోగ్య ముప్పు
Advertisement
  • కేంద్ర ఆర్థిక సర్వే 2026 సంచలన నివేదిక
  • ఊబకాయం, బీపీ, షుగర్ వ్యాధులపై ఆందోళన
  • ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రకటనలపై నిషేధం

Ultra-Processed Food | త్రినేత్ర.న్యూస్ : భారతదేశంలో ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. పోషకమైన ఆహారం స్థానంలో ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ (శుద్ధి చేసిన ఆహారాలు) వచ్చి చేరుతున్నాయి. తాజాగా విడుదలైన 'ఎకనామిక్ సర్వే 2025-26' (Economic Survey 2026) ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2009 నుంచి 2023 మధ్య కాలంలో దేశంలో 'అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్' (UPFs) మార్కెట్ వాటా ఏకంగా 150 శాతం పెరిగిందని సర్వే వెల్లడించింది.

ఆందోళనకరమైన గణాంకాలు

నివేదిక ప్రకారం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ రిటైల్ విక్రయాలు 2006 లో 0.9 బిలియన్ డాలర్లు ఉండగా, 2019 నాటికి అది 40 రెట్లు పెరిగి దాదాపు 38 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బిస్కెట్లు, ఇన్‌స్టంట్ నూడుల్స్, ఐస్‌క్రీమ్‌లు, ఎనర్జీ డ్రింక్స్, ప్యాకేజ్డ్ సూప్స్, బ్రేక్‌ఫాస్ట్ సెరెల్స్ లాంటివి ఈ కేటగిరీ కిందకు వస్తాయి. ఇవి రుచిగా అనిపించినప్పటికీ, శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో విఫలమవుతున్నాయి.

పెరుగుతున్న ఊబకాయం - అనారోగ్య సమస్యలు

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరగడానికి, దేశంలో ఊబకాయం (Obesity) బాధితుల సంఖ్య పెరగడానికి ప్రత్యక్ష సంబంధం ఉందని సర్వే స్పష్టం చేసింది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ (NFHS) 2019-21 డేటా ప్రకారం, 24 శాతం మంది భారతీయ మహిళలు, 23 శాతం మంది పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారని సర్వే స్పష్టం చేసింది.

పిల్లలపై ప్రభావం: 5 ఏళ్లలోపు పిల్లల్లో అధిక బరువు సమస్య 2015-16లో 2.1 శాతం ఉండగా, 2019-21 నాటికి 3.4 శాతానికి పెరిగింది.

Economic Survey 2026 Ultra-Processed Food Sales Up 150% in 14 Years Health Risks Rising

'వరల్డ్ ఒబెసిటీ అట్లాస్ 2024' అంచనాల ప్రకారం, 2020లో 3.3 కోట్లుగా ఉన్న ఊబకాయం కలిగిన పిల్లల సంఖ్య, 2035 నాటికి 8.3 కోట్లకు చేరే ప్రమాదం ఉంది. ఈ ఆహారపు అలవాట్లు మధుమేహం (Diabetes), గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ (BP) లాంటి నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల (NCDs) ముప్పును పెంచుతున్నాయని సర్వే హెచ్చరించింది.

అట్రాక్టివ్ ప్రకటనలే కారణం

సహజమైన ఆహారాన్ని పక్కనబెట్టి, రసాయనాలతో నిండిన ఈ ఆహారాల వైపు ప్రజలు మళ్లడానికి ఆకర్షణీయమైన మార్కెటింగ్ కారణమని సర్వే అభిప్రాయపడింది. ముఖ్యంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుని చేసే ప్రకటనలు, ఈ ఆహారాలను "అతిగా తినేలా" (Hyper-palatable) ప్రోత్సహిస్తున్నాయని పేర్కొంది. ఎమల్సిఫైయర్లు, రంగులు, కృత్రిమ రుచులు కలిపి వీటిని తయారు చేయడం వల్ల, కడుపు నిండిన సంకేతాలను శరీరం గుర్తించలేకపోతోందని నిపుణులు అంటున్నారు.

కఠిన చర్యలు అవసరం

ఈ విపత్తును అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఎకనామిక్ సర్వే సిఫార్సు చేసింది. అలాంటి ప్రకటనలపై నిషేధం విధించాలని.. కనీసం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టీవీ, మీడియాలో ఇలాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రకటనలను నిషేధించాలని సర్వే వెల్లడించింది.

హెచ్చరిక లేబుల్స్: సిగరెట్ ప్యాకెట్ల మాదిరిగానే, అనారోగ్యకరమైన ఆహార ప్యాకెట్లపై స్పష్టమైన హెచ్చరికలు ఉండాలి.

అధిక పన్నులు: చక్కెర, ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలపై గరిష్ట జీఎస్టీ (GST), అదనపు సర్‌ఛార్జీలు విధించాలి.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement