త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MK Stalin | కొల‌త్తూరు ఎన్నిక‌.. ఎంకే స్టాలిన్‌కు ఎదురుదెబ్బ‌

MK Stalin | డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin )కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. కొలత్తూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ‌ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌ ధ్రువీకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను మ‌ద్రాసు హైకోర్టు (Madras High Court) గురువారం కొట్టివేసింది.

D

National | Published On Sep 3, 2026, 1.07 pm IST

MK Stalin | కొల‌త్తూరు ఎన్నిక‌.. ఎంకే స్టాలిన్‌కు ఎదురుదెబ్బ‌
Advertisement

MK Stalin | త్రినేత్ర‌.న్యూస్ : త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin )కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. కొలత్తూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ‌ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌ ధ్రువీకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను మ‌ద్రాసు హైకోర్టు (Madras High Court) గురువారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ అసలు విచారణకే అర్హమైనది కాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

కాగా, త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొల‌త్తూరు (Kolathur) నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంకే స్టాలిన్ పోటీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో ఆయ‌న ఓడిపోయారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు (VS Babu) చేతిలో 7 వేల‌కుపైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాల‌య్యారు. ఈ ఎన్నిక‌ల్లో బాబుకు 82,997 ఓట్లు రాగా.. స్టాలిన్‌కు 74,202 ఓట్లు వచ్చాయి. ఈ ఫ‌లితాల‌పై స్టాలిన్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు పోలింగ్‌లో ఉపయోగించిన అన్ని ఈవీఎంలు, వీవీప్యాట్ (VVPAT) స్లిప్పులను 100 శాతం తిరిగి లెక్కించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అంతేకాదు, వీఎస్ బాబు విజయాన్ని రద్దు చేసి తనను విజేతగా ప్రకటించాలని న్యాయ‌స్థానాన్ని కోరారు.

ఈ పిటిష‌న్‌పై చీఫ్ జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుళ్ మురుగన్‌లతో కూడిన మద్రాసు హైకోర్టు ఫస్ట్ డివిజన్ బెంచ్ విచార‌ణ జ‌రిపింది. స్టాలిన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ చెల్లుబాటును ఎన్నికల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఒక అభ్యర్థి విజయాన్ని ఎలక్షన్ పిటిషన్ (Election Petition) ద్వారా మాత్రమే సవాలు చేయాలని తెలిపింది. ఆర్టికల్‌ 226 కింద దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ ద్వారా ఆ ప్రక్రియను పక్కదారి పట్టించలేరని తెలిపింది.

స్టాలిన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. మే4న‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మే 7న ఈవీఎంల పరిశీలనకు దరఖాస్తు చేసినప్పటికీ.. ఎన్నికల సంఘం జూలై 29న పరిశీలన చేపట్టిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసేందుకు నిర్దేశించిన 45 రోజుల గడువు ముగిసిపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశీలనలో లోపాలు బయటపడిన తర్వాత స్టాలిన్‌ ఎన్నికల పిటిషన్‌ ఎలా దాఖలు చేయగలరని ప్రశ్నించారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం సాధారణ రిట్ పిటిషన్ ద్వారా విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేర‌కు స్టాలిన్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది.

కాగా, 234 సభ్యులున్న త‌మిళ‌నాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. మే 4న ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ ఫ‌లితాల్లో విజ‌య్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఊహించిన రీతిలో భారీ విజ‌యం న‌మోదు చేసింది. ఏకంగా 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నిక‌ల్లో డీఎంకే పార్టీ ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఇక కొల‌త్తూరులో డీఎంకే అధినేత స్టాలిన్ ఘోరంగా ఓడిపోవ‌డం పార్టీ వ‌ర్గాల‌ను షాక్‌కు గురి చేసింది.

కొల‌త్తూరు నియోజ‌క‌వ‌ర్గం డీఎంకేకి కంచుకోట‌. 2011 నుంచి ఎంకే స్టాలిన్ ఇక్క‌డి నుంచే పోటీ చేసి గెలుపొందుతున్నారు. వరుసగా మూడుసార్లు గెలిచిన ఆయన.. తన పట్టును నిలుపుకున్నారు. 2016లో 51.4 శాతం ఓట్లతో సులభంగా గెలిచిన స్టాలిన్‌.. 2021లో 1,05,522 ఓట్లు సాధించి ఏఐఏడీఎంకే అభ్యర్థి ఆది రాజారాంపై 70,384 ఓట్ల మెజారిటీతో (61.4 శాతం ఓట్లతో) విజ‌యం సాధించారు. కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా ఓట‌మి చ‌విచూడ‌టం గ‌మ‌నార్హం.

Also Read..

కోల్‌క‌తాలోని టీఎంసీ ఆఫీస్‌పై దాడి.. బీజేపీ గూండాల ప‌నే అన్న అభిషేక్ బెన‌ర్జీ

24 రోజులైంది.. చ‌ర్య‌లేవి..? వేదిక శుద్ధీక‌ర‌ణ‌పై న‌డ్డాకు ఖ‌ర్గే లేఖ‌

ఎయిర్‌ఫోర్స్‌కు బాలాకోట్‌ దాడుల హీరో అభినందన్ వీడ్కోలు.. ప్రైవేట్ పైలట్‌గా కొత్త జ‌ర్నీ

Advertisement
Advertisement