త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhinandan Varthaman | ఎయిర్‌ఫోర్స్‌కు బాలాకోట్‌ దాడుల హీరో అభినందన్ వీడ్కోలు.. ప్రైవేట్ పైలట్‌గా కొత్త జ‌ర్నీ

Abhinandan Varthaman | 2019 బాలాకోట్ దాడుల్లో (Balakot air strike) హీరోగా నిలిచిన భారతీయ వాయుసేన (IAF) ఫైటర్ పైలట్ అభినందన్ వర్ధమాన్ (Abhinandan Varthaman) వైమానిక దళానికి ముందస్తు రిటైర్మెంట్ ప్రకటించారు. వాయుసేన నుంచి వైదొలగిన ఆయన.. గోవాకు చెందిన‌ ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో కమర్షియల్ పైలట్‌గా కొత్త జ‌ర్నీని స్టార్ట్ చేశారు.

D

National | Published On Sep 3, 2026, 11.17 am IST

Abhinandan Varthaman | ఎయిర్‌ఫోర్స్‌కు బాలాకోట్‌ దాడుల హీరో అభినందన్ వీడ్కోలు.. ప్రైవేట్ పైలట్‌గా కొత్త జ‌ర్నీ
Advertisement

Abhinandan Varthaman | త్రినేత్ర‌.న్యూస్ : పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని బాలాకోట్‌ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) జరిపిన మెరుపు దాడుల్లో హీరోగా నిలిచిన భారతీయ వాయుసేన (IAF) ఫైటర్ పైలట్ అభినందన్ వర్ధమాన్ (Abhinandan Varthaman) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వైమానిక దళానికి ముందస్తు రిటైర్మెంట్ ప్రకటించారు. వాయుసేన నుంచి వైదొలగిన ఆయన.. ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో కమర్షియల్ పైలట్‌గా కొత్త జ‌ర్నీని స్టార్ట్ చేశారు.

వాయుసేనలో 22 సంవత్సరాల పాటూ విశేష‌ సేవలందించిన మాజీ గ్రూప్ కెప్టెన్, వీర చక్ర అవార్డు గ్రహీత అభినందన్.. గోవా కేంద్రంగా పనిచేస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ 'FLY91'లో పైలట్‌గా చేరారు. ఈ ఏడాది ఆగస్టులోనే ఆయన విధుల్లో చేరినట్లు పీటీఐ వ‌ర్గాల‌ సమాచారం. అయితే, ఈ విషయంపై అభినందన్ వర్ధమాన్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మ‌రోవైపు, 'FLY91' ప్రతినిధి స్పందిస్తూ.. ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను వెల్లడించలేమని తెలిపారు. ఇది పూర్తిగా వారి వ్య‌క్తిగ‌త‌ విషయమని వెల్ల‌డించారు. అభినందన్ చేరిన ఫ్లై91 ఎయిర్‌లైన్స్ 2024 మార్చిలోనే త‌న‌ కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థ ఆరు ATR 72-600 విమానాలను నడుపుతోంది. గోవా, హైదరాబాద్ నగరాలు ఈ సంస్థకు ప్రధాన స్థావరాలుగా ఉన్నాయి.

బాలాకోట్ దాడుల‌తో హీరో..

భారత వాయుసేన సర్జికల్‌ స్ట్రైక్స్‌లో అభినంద‌న్ అసాధార‌ణ ధైర్య‌సాహ‌సాల‌ను ప్ర‌దర్శించిన విష‌యం తెలిసిందే. 2019 ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జవాన్లు అమరులుకాగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘ‌ట‌నపై దేశ వ్యాప్తంగా ఆగ్ర‌హావేశాలు వెల్లువెత్తాయి. ఈ దాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి 27న భారత వాయుసేన మెరుపు దాడుల‌కు దిగింది. బాలాకోట్‌ (Balakot)లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలను బాంబులతో పేల్చేసింది. ఈ ఘటనలో వందల సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. భారత వాయుసేన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను అడ్డుకునేందుకు అత్యాధుక ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్స్‌ను పాకిస్థాన్‌ రంగంలోకి దించింది.

శ‌త్రు విమానాన్ని కూల్చి..

ఈ ఆప‌రేష‌న్‌లో భాగంగా వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్‌ మిగ్‌-21 యుద్ధ విమానాన్ని నడుపుతూ పాక్‌కు చెందిన ఒక ఎఫ్‌-16ను కూల్చివేశారు. శ‌త్రు విమానాన్ని కూల్చే క్రమంలో ఆయన విమానం కూడా ప్ర‌మాదానికి గురైంది. ఈ క్ర‌మంలో కూలిపోతున్న త‌న మిగ్‌-21 నుంచి పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దిగిన ఆయనను పాక్‌ ఆర్మీ నిర్బంధించింది. అభినందన్‌ను సురక్షితంగా తమకు అప్పగించాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. భారత్‌ నుంచి తీవ్ర ఒత్తిడి, అంతర్జాతీయ జోక్యంతో పాక్‌ దిగిరాక త‌ప్ప‌లేదు. అదే రోజు రాత్రి స‌మ‌యంలో వాఘా స‌రిహ‌ద్దు వ‌ద్ద అభినందన్‌ను భారత సైనిక అధికారులకు అప్పగించింది.

వీరచక్రతో స‌త్కారం..

ఈ ఘటన అనంతరం యుద్ధ సమయంలో చూపిన అసాధారణ ధైర్యసాహసాలకు గాను భారత ప్రభుత్వం  ‘వీరచక్ర’తో (Vir Chakra award) సత్కరించిన విషయం తెలిసిందే. ఇది దేశంలోనే మూడో అత్యున్నత సైనిక పురస్కారం. 2021 నవంబర్‌లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అంతేకాదు, వాయుసేనలో వింగ్‌ కమాండర్ హోదాలో ఉన్న అభినందన్‌ను 2021లో వైమానిక దళం గ్రూప్ కెప్టెన్‌గా ప్రమోట్ చేసింది. ఇది సైనిక దళంలో కల్నల్ ర్యాంక్‌కు సమానం.

Also Read..

పంజాబ్ ఓటరు జాబితా నుంచి రాఘ‌వ్ చ‌ద్ధా పేరు మాయం.. ఆప్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు

ఓట‌రు రికార్డులో వ్య‌త్యాసాలు.. రాష్ట్ర ఎన్నిక‌ల ముఖ్య అధికారి సుద‌ర్శ‌న్ రెడ్డికి SIR నోటీసులు

శరత్ సిటీ మాల్‌లోని PUMA షూ కంపెనీకి దిమ్మ తిరిగిపోయే షాక్

Advertisement
Advertisement