త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PayPal Layoffs | పేపాల్‌లో భారీ ఉద్యోగ కోతలు.. భారత్‌లో 600 మందికి షాక్..?

PayPal Layoffs | అమెరికాకు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేపాల్‌ భారత్‌లోని పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల సంఖ్యను పునర్వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో ఈ తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించారనే అంశంపై సంస్థ, ఉద్యోగ వర్గాల అంచనాల్లో భారీ వ్యత్యాసం ఉంది.

S

Business | Published On Sep 3, 2026, 12.18 pm IST

PayPal Layoffs | పేపాల్‌లో భారీ ఉద్యోగ కోతలు.. భారత్‌లో 600 మందికి షాక్..?
Advertisement

PayPal Layoffs | అమెరికాకు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేపాల్‌ భారత్‌లోని పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల సంఖ్యను పునర్వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో ఈ తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించారనే అంశంపై సంస్థ, ఉద్యోగ వర్గాల అంచనాల్లో భారీ వ్యత్యాసం ఉంది. మనీ కంట్రోల్‌ కథనం ప్రకారం.. పేపాల్‌ భారత్‌లోని కార్యకలాపాల్లో సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, ఆపరేషన్స్‌, పేమెంట్స్‌, ఫైనాన్స్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులపై ఈ ప్రభావం పడినట్లు సమాచారం.

600, 220.. ఏది క‌రెక్ట్‌..?

అయితే 600 మంది ఉద్యోగులను తొలగించినట్లు వచ్చిన వార్తలను పేపాల్‌ ఖండించింది. ఆగస్టు 31న భారత్‌లో సుమారు 220 మంది ఉద్యోగుల సంఖ్యను తగ్గించినట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇది భారత్‌లోని పేపాల్‌ ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 4 శాతానికి సమానమని వెల్లడించారు. పేపాల్‌ ఇండియాలో 6వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఉద్యోగ వర్గాలు చెబుతున్న 600 మంది తొలగింపుల సంఖ్య నిజమైతే, ఇది భారత్‌లోని సంస్థ ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిపై ప్రభావం చూపినట్లవుతుంది.

ముంద‌స్తు స‌మాచారం లేకుండానే..

కొంతమంది ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 31 సోమవారం ఉదయం సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఉద్యోగులకు ఆహ్వానం పంపినట్లు ఓ బాధిత ఉద్యోగి తెలిపారు. భారత్‌లోని వివిధ కార్యాలయాలకు చెందిన పలువురు ఉద్యోగులు ఆ సమావేశంలో ఉన్నారని, తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు అక్కడే తెలియజేశారని చెప్పారు. సమావేశం ముగిసిన వెంటనే తమకు సంస్థ వ్యవస్థల యాక్సెస్‌ను నిలిపివేశారని వెల్లడించారు. ఆ తర్వాత ఉద్యోగులకు ఆఫ్‌బోర్డింగ్‌ ప్రక్రియకు సంబంధించిన ఈ-మెయిల్‌ పంపినట్లు సమాచారం. ప్రభావిత ఉద్యోగులకు కొత్త ఉద్యోగాల కోసం సహాయం అందిస్తామని, ఒక నెల జీతాన్ని సెవెరెన్స్‌గా చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు కొందరు ఉద్యోగులు తెలిపారు. అయితే సెవెరెన్స్‌, పూర్తి, తుది చెల్లింపులకు సంబంధించి తమకు ఇంకా తదుపరి సమాచారం అందలేదని వారు పేర్కొన్నారు.

ఈ-మెయిల్ ద్వారా తొల‌గింపు లేఖ‌..

మరో ఉద్యోగికి సోమవారం ఉదయం నేరుగా ఈ-మెయిల్‌ ద్వారా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం అందినట్లు నివేదిక తెలిపింది. ఈ ఉద్యోగ కోతలు గతంలో ప్రకటించిన బహుళ సంవత్సరాల రూపాంతర కార్యక్రమంలో భాగమని పేపాల్‌ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను సరళీకృతం చేయడం, అమలు సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, దీర్ఘకాలిక వృద్ధికి సంస్థను సిద్ధం చేయడం కోసం ఈ మార్పులు చేపడుతున్నట్లు పేపాల్‌ ప్రతినిధి తెలిపారు. ఉద్యోగులపై ఇలాంటి నిర్ణయాల ప్రభావం తమకు తెలుసని, ఈ మార్పు సమయంలో ఉద్యోగులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందని పేపాల్‌ పేర్కొంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా అమ‌లు..

నివేదికలో పేర్కొన్న ప్రకారం.. పేపాల్‌ ప్రపంచవ్యాప్త ఉద్యోగ కోతలను దశలవారీగా అమలు చేస్తోంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం, అందులో భారత్‌ కూడా తొలిదశలోనే ప్రభావితమైన మార్కెట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సోమవారం అమెరికా, యూరప్‌, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతాల్లోని ఉద్యోగులతో కూడా సమావేశాలు నిర్వహించినట్లు నివేదిక తెలిపింది. ఐర్లాండ్‌లో అదే రోజు సుమారు 164 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఇది అక్కడి పేపాల్‌ ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 12 శాతానికి సమానంగా ఉంది. తాజా ఉద్యోగ కోతలకు ముందు, ఈ ఏడాది మేలో పేపాల్‌ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల సంఖ్యను 20 శాతం వరకు తగ్గించాలని సంస్థ నిర్ణయించినట్లు తెలిపింది. ఈ చర్యల ద్వారా అదే కాలంలో కనీసం 1.5 బిలియన్‌ డాలర్ల స్థూల వార్షిక పొదుపును సాధించాలని లక్ష్యంగా నిర్ణ‌యించుకున్నట్లు పేపాల్‌ వెల్లడించింది. 2025 చివరి నాటికి పేపాల్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 23,800 మంది ఉద్యోగులు ఉన్నారు. 20 శాతం ఉద్యోగ కోత అమలైతే సుమారు 4,760 ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

చెన్నై, బెంగ‌ళూరుల‌లో కేంద్రాలు..

పేపాల్‌ 2008లో చెన్నైలో భారత్‌లో తన తొలి డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా వెలుపల పేపాల్‌కు ఉన్న అతిపెద్ద టెక్నాలజీ కేంద్రంగా ఇది కొనసాగుతోంది. కోర్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌లు, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, మొబైల్ ఎక్స్‌పీరియెన్స్‌, డిస్ట్రిబ్యూటెడ్‌ కంప్యూటింగ్‌ వంటి కీలక సాంకేతిక రంగాల్లో ఈ కేంద్రం పనిచేస్తోంది. ఆ తర్వాత పేపాల్‌ బెంగళూరులో రెండో కేంద్రాన్ని ప్రారంభించింది. మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, కంప్యూటర్‌ విజన్‌, డేటా సైన్స్‌ వంటి రంగాలపై దృష్టి సారించే ఇన్నోవేషన్‌ ల్యాబ్‌గా ఈ కేంద్రం పనిచేస్తోంది.

Advertisement
Advertisement