త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah | దీదీ దిగిపోయే స‌మ‌యం వ‌చ్చింది.. బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఖాయం : అమిత్ షా

Amit Shah | ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయ‌మ‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ధీమా వ్య‌క్తం చేశారు. ఈ భారీ ఓటింగ్ శాతం బీజేపీకి అనుకూలంగా ఓ నిర్ణ‌యాత్మ‌క మార్పును చూచిస్తోంద‌న్నారు. దీదీ ఇంటికెళ్లే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వ‌స్తే.. బెంగాల్‌కు చెందిన వ్య‌క్తినే ముఖ్య‌మంత్రిగా చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

D

National | Published On Apr 24, 2026, 12.46 pm IST

Amit Shah | దీదీ దిగిపోయే స‌మ‌యం వ‌చ్చింది.. బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఖాయం : అమిత్ షా
Advertisement
  • బీజేపీ గెలిస్తే.. బెంగాల్‌కు చెందిన వ్య‌క్తినే సీఎంని చేస్తాం
  • బెంగాల్ గ‌డ్డ మోదీ నాయకత్వంలోని అభివృద్ధిని కోరుకుంటోంది
  • చొర‌బాటుదారుల‌ను సాగ‌నంపుతాం

Amit Shah | ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ధీమా వ్య‌క్తం చేశారు. బెంగాల్‌లో తొలి విడత పోలింగ్ గురువారం విజయవంతంగా ముగిసిన విష‌యం తెలిసిందే. తొలి ద‌శ‌లో రికార్డు స్థాయిలో పోలింగ్ న‌మోదైంది. గత ఎన్నికల కంటే 10 శాతం ఎక్కువ ఓటింగ్ నమోదైంది. ఈ నేప‌థ్యంలో షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ భారీ ఓటింగ్ శాతం బీజేపీకి అనుకూలంగా ఓ నిర్ణ‌యాత్మ‌క మార్పును చూచిస్తోంద‌న్నారు. రాష్ట్రంలో మ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మి ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించారు.

కోల్‌కతాలో శుక్ర‌వారం జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. తొలి దశలో ఎన్నికలు జరిగిన 152 స్థానాల్లో 110 కి పైగా స్థానాల్లో బీజేపీ గెల‌వ‌బోతోంద‌ని, త‌మ పార్టీ నిర్ణయాత్మక విజయాన్ని నమోదు చేస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. "బెంగాల్ ప్రజలు మొదటి దశలోనే తమ భవిష్యత్తును నిర్ణయించుకున్నారు. బెంగాల్ గ‌డ్డ‌ నరేంద్ర మోదీ నాయకత్వంలోని అభివృద్ధిని కోరుకుంటోంది. దీదీ దిగిపోయే స‌మ‌యం వ‌చ్చిందని భారీ ఓటింగ్ శాతం స్పష్టంగా చెబుతోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది" అని షా వ్యాఖ్యానించారు.

రెండో ద‌శ‌ ఎన్నికల్లోనూ ఇదే జోరు

దీదీ ప్రభుత్వంలో జరిగిన వరుస కుంభకోణాలు, ఇసుక మాఫియా, మహిళలపై దాడుల పట్ల బెంగాల్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, సామాన్యులకు రక్షణ కరవైందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటర్లు బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారని తెలిపారు. అందుకే ప్రతి పోలింగ్ బూత్‌లోనూ తమకు అనుకూలంగా భారీ ఎత్తున ఓట్లు పడుతున్నాయని ఆయన వివరించారు. రెండో ద‌శ‌ ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు అత్యంత ప్రాధాన్య‌త‌

ఇక రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే.. భ‌యోత్పాత పాల‌న‌ను అంతం చేస్తామ‌ని, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన పాల‌న‌ను అందిస్తామ‌ని అమిత్ షా హామీ ఇచ్చారు. అవినీతి, బుజ్జ‌గింపు రాజ‌కీయాలు, బ‌ల‌వంత‌పు వ‌సూళ్ల నుంచి విముక్తి కల్పిస్తామ‌న్నారు. చొర‌బాటుదారుల‌ను సాగ‌నంపుతామ‌ని హామీ ఇచ్చారు. అంతేకాదు, యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. వీటితోపాటూ మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తామ‌ని షా స్ప‌ష్టం చేశారు.

బెంగాల్ వ్య‌కే సీఎం..

అదే స‌మ‌యంలో మ‌మ‌తా బెన‌ర్జీపై అమిత్ షా తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గ‌ప్పించారు. బీజేపీ గురించి దీదీ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించారు. “బీజేపీ అధికారంలోకి వస్తే బయటి వ్యక్తులు బెంగాల్‌ను పాలిస్తారని ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ భయాందోళనలు సృష్టిస్తున్నారు” అని షా పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వ‌స్తే.. బెంగాల్‌కు చెందిన వ్య‌క్తినే ముఖ్య‌మంత్రిగా చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

కాగా, బీజేపీ, తృణ‌మూల్ కాంగ్రెస్ మ‌ధ్య హోరాహోరీ నెల‌కొంది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాల‌కు గానూ.. తొలిద‌శ‌లో భాగంగా గురువారం 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో 91.88 శాతం ఓటింగ్ న‌మోదైంది. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఇదే అత్య‌ధిక ఓటింగ్ శాతం అని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇక రెండో ద‌శ పోలింగ్ ఏప్రిల్ 29న జ‌ర‌గ‌నుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

Also Read..

ఆర్టీసీ ఉద్యోగులు అధైర్య‌ప‌డొద్దు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం సిద్ధం: ఎంపీ చామ‌ల‌

రైతుబంధు.. రైతు బోన‌స్‌.. రెండిట్లో ఏదో ఒక‌టి చాలు: గుత్తా సుఖేందర్ రెడ్డి

హుగ్లీ న‌దిలో ప్ర‌ధాని మోదీ ప‌డ‌వ ప్ర‌యాణం.. ఫొటోలు

Advertisement
Advertisement