త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | జేబు దొంగలున్నారు జాగ్ర‌త్త‌.. సీబీఎస్ఈపై రాహుల్ తీవ్ర విమ‌ర్శ‌లు

Rahul Gandhi | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)పై కాంగ్రెస్ అగ్ర‌నేత‌, లోక్‌స‌భలో ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. మూల్యాంకన ప్రక్రియలో చేసిన తప్పుల నుంచి సీబీఎస్‌ఈ లాభపడుతోందని ఆరోపించారు.

D

National | Published On Jun 1, 2026, 1.42 pm IST

Rahul Gandhi | జేబు దొంగలున్నారు జాగ్ర‌త్త‌.. సీబీఎస్ఈపై రాహుల్ తీవ్ర విమ‌ర్శ‌లు
Advertisement

Rahul Gandhi | ఈ ఏడాది 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎస్‌ఎం) విధానంలో లోపాల‌పై దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి (CBSE OSM controversy). ఈ నేప‌థ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)పై కాంగ్రెస్ అగ్ర‌నేత‌, లోక్‌స‌భలో ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. మూల్యాంకన ప్రక్రియలో చేసిన తప్పుల నుంచి సీబీఎస్‌ఈ లాభపడుతోందని ఆరోపించారు.

అంతేకాదు రీవాల్యుయేషన్ కోసం విద్యార్థుల నుంచి వ‌సూలు చేస్తున్న ఫీజుల‌ను ప్ర‌శ్నిస్తూ.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు విద్యార్థుల‌తో ముచ్చ‌టించిన వీడియోని రాహుల్ ఎక్స్ వేదిక‌గా పోస్టు చేశారు. ఆ వీడియోకి "జేబు దొంగ‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండండి (Beware Of Pickpockets). వారు సీబీఎస్ఈ కార్యాల‌యంలోనే తిష్ట వేశారు. సీబీఎస్‌ఈ పొరపాటు వల్ల మార్కులు తప్పుగా వస్తే.. మీరు (విద్యార్థులను ఉద్దేశించి) స‌మాధాన ప‌త్రాల‌ను చూడ‌టానికి, రివ్యూ ప్ర‌క్రియ కోసం డ‌బ్బులు చెల్లించాల్సి వ‌స్తోంది. డిజిట‌ల్ స్కాన్ కాపీ కోసం సబ్జెక్టుకు రూ.100, ఒక పేపర్‌ రీటోటలింగ్‌కు రూ.100, రీవాల్యుయేషన్ కోసం ఒక్కో ప్రశ్నకు రూ. 25 చొప్పున వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఒక విద్యార్థి తన జవాబు పత్రాన్ని సరిదిద్దించుకోవడానికి దాదాపు రూ.2000 చెల్లించాల్సి వ‌స్తోంది" అని రాహుల్ త‌న పోస్టులో రాసుకొచ్చారు.

సుమారు 4 ల‌క్ష‌ల మంది విద్యార్థులు స్కానింగ్‌ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్న‌ట్లు రాహుల్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. దీని ద్వారా సీబీఎస్ఈకి ఎంత ఆదాయం స‌మ‌కూరుతోందో గమనించాల‌న్నారు. మొబైల్ ఫోన్ల సాయంతో స‌మాధాన ప‌త్రాల‌ను స్కాన్ చేస్తే త‌ప్పులు రావ‌డం ఖాయ‌మ‌న్నారు. అయితే, అసెస్‌మెంట్ ప్రక్రియలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి అయ్యే ఆర్థిక భారాన్ని విద్యార్థుల‌పై మోపుతున్నార‌ని మండిప‌డ్డారు. త‌ప్పు సీబీఎస్‌ఈ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభ‌విస్తున్నార‌ని మండిప‌డ్డారు. అందుకు స‌మ‌కూరే ఆదాయం మాత్రం ప్ర‌భుత్వం అర్జిస్తోంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విద్య‌ను వ్యాపారంగా మారుస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. "విద్య వ్యాపారంగా మారితే తప్పులు సరికావు. ఇంకా రెట్టింపు అవుతాయి. ఫ‌లితంగా సమయం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు రూపంలో విద్యార్థులు మూల్యం చెల్లించుకుంటున్నారు" అని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

కాగా, సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎమ్ వివాదంపై ప్ర‌ధాని మోదీనిపై రాహుల్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. సమాధాన పత్రాల స్కానింగ్ ప్రక్రియలోని అక్రమాల వల్ల నష్టపోయిన 18.5 లక్షల మంది విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

Also Read..

రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్ర‌ధాని కావాలి క‌దా..? : మ‌హేశ్ కుమార్ గౌడ్\

మోగిన ఎన్నిక‌ల న‌గారా.. 24 రాజ్యసభ స్థానాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

కేంద్ర విద్యాశాఖ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం

Advertisement
Advertisement