త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vitamin D Tablets | విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటున్నారా..? ఈ త‌ప్పులు చేయకండి..!

Vitamin D Tablets | ప్ర‌స్తుతం చాలా మందికి విట‌మిన్ డి లోపం ఉంటోంది. ఈ కార‌ణంగా అనేక మంది విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను వాడుతున్నారు. మ‌న శ‌రీరంలో ఎముక‌లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు, రోగ నిరోధ‌క శ‌క్తికి, ప‌లు ఇత‌ర ప‌నుల‌కు విట‌మిన్ డి అవ‌స‌రం అవుతుంది.

S

Lifestyle | Published On Jan 11, 2026, 7.33 am IST

Vitamin D Tablets | విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటున్నారా..? ఈ త‌ప్పులు చేయకండి..!
Advertisement

Vitamin D Tablets | ప్ర‌స్తుతం చాలా మందికి విట‌మిన్ డి లోపం ఉంటోంది. ఈ కార‌ణంగా అనేక మంది విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను వాడుతున్నారు. మ‌న శ‌రీరంలో ఎముక‌లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు, రోగ నిరోధ‌క శ‌క్తికి, ప‌లు ఇత‌ర ప‌నుల‌కు విట‌మిన్ డి అవ‌స‌రం అవుతుంది. ఈ క్ర‌మంలోనే విట‌మిన్ డి లోపం ఉంటే ఆ ట్యాబ్లెట్ల‌ను చాలా మంది డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు వేసుకుంటుంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ డాక్ట‌ర్ సూచించిన కాల పరిమితి దాటిపోయినా కూడా ఇంకా చాలా మంది ఈ ట్యాబ్లెట్ల‌ను వాడ‌డం కొన‌సాగిస్తూనే ఉంటారు. కోర్సు వ్య‌వ‌ధి ముగిసిన త‌రువాత మ‌ళ్లీ డాక్ట‌ర్ స‌ల‌హా తీసుకోకుండానే ఆ ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటారు. అయితే ఇలా చేయ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.

కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్ర‌మాదం..

విటమిన్ డి ట్యాబ్లెట్ల‌ను డాక్ట‌ర్ స‌ల‌హా లేకుండా వాడ‌కూడ‌ద‌ని చెన్నైలోని నుంగంబాకంకు చెందిన ఏషియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ క‌న్స‌ల్టెంట్ నెఫ్రాల‌జిస్టు డాక్ట‌ర్ ఎం.న‌వ‌నీత్ అన్నారు. విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో కొవ్వుల్లో నిల్వ ఉంటుంది. ఇది అధిక మొత్తాల్లో మ‌న శరీరంలో దీర్ఘ‌కాలం పాటు ఉంటే ప్ర‌మాదం. ప‌లు దుష్ప‌రిణామాలు సంభ‌విస్తాయి. విట‌మిన్ డి మ‌న శ‌రీరం నిల్వ చేసుకుంటుంది. కానీ అధిక మొత్తాల్లో ఈ ట్యాబెట్ డోసుల‌ను వాడితే శ‌రీరంలో భారీ ఎత్తున విట‌మిన్ డి చేరుతుంది. ఇది ఒక ప‌ట్టాన బ‌య‌ట‌కు వెళ్ల‌దు. ఇలాంటి స‌మ‌యంలో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఆయ‌న అన్నారు. విట‌మిన్ డి శ‌రీరంలో అధికంగా చేరడం వ‌ల్ల ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని, అప్పుడే ఈ ట్యాబ్లెట్ల‌ను వాడ‌డం ఆపేయాల‌ని, లేదంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్ర‌మాదం ఉంటుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే..

దీర్ఘ‌కాలం పాటు డాక్ట‌ర్ స‌ల‌హా లేకుండా విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను వాడితే శ‌రీరంలో పెద్ద ఎత్తున క్యాల్షియం చేరుతుంది. ఈ క్ర‌మంలో కిడ్నీల్లో క్యాల్షియం స్ఫ‌టికాలు నిర్మాణ‌మ‌వుతాయి. వీటినే కిడ్నీ స్టోన్లు అంటారు. కొంద‌రికి కిడ్నీల్లో క్యాల్షియం నిల్వ‌లు పేరుకుపోయి నెఫ్రోకాల్సినోసిస్ అనే స‌మ‌స్య త‌లెత్తుతుంది. దీని వ‌ల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్ర‌మాదం ఉంటుంది. క‌నుక విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను డాక్ట‌ర్ సూచ‌న లేకుండా వాడొద్దు. ఇక విట‌మిన్ డి శ‌రీరంలో అధికంగా ఉండే మ‌న శ‌రీరం ప‌లు ల‌క్ష‌ణాలు, సంకేతాల‌ను తెలియజేస్తుంది. వికారంగా ఉండ‌డం, వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపించ‌డం, ఎల్ల‌ప్పుడూ దాహంగా ఉండ‌డం, త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న వెళ్లాల్సి రావ‌డం, కండ‌రాల బ‌ల‌హీన‌త‌, ఆందోళ‌న‌, కంగారు, అల‌స‌ట‌, వెనుక వైపు కిడ్నీలు ఉండే చోట నొప్పిగా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే విట‌మిన్ డి అధికంగా ఉంద‌ని అర్థం చేసుకోవాలి. వెంట‌నే ఆ ట్యాబ్లెట్ల‌ను వాడ‌డం మానేయాలి. డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకుంటే కిడ్నీలు ఫెయిల్ అవ‌కుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

విట‌మిన్ డి మ‌న‌కు ఎంత అవ‌స‌రం..?

ఇక విట‌మిన్ డి మ‌న‌కు రోజుకు నిర్దిష్ట‌మైన మోతాదులో అవ‌స‌రం అవుతుంది. రోజుకు మ‌న‌కు సాధార‌ణంగా 400 ఐయూ నుంచి 1000 ఐయూ వ‌ర‌కు విట‌మిన్ డి కావ‌ల్సి ఉంటుంది. విట‌మిన్ డి కాస్త త‌క్కువ‌గా ఉంటే వైద్యులు వారానికి ఒక డోసు ఉండే విధంగా 60,000 ఐయూ విటమిన్ డి క్యాప్సూల్స్‌ను ఇస్తారు. అదే విట‌మిన్ డి లోపం మ‌రీ అధికంగా ఉంటే రోజువారి డోసుల్లో ఈ ట్యాబ్లెట్ల‌ను ఇస్తారు. రోజుకు అలాంటి వారికి సాధార‌ణంగా 8000 ఐయూ నుంచి 12000 ఐయూ వ‌ర‌కు డోసుల‌ను ఇస్తారు. అయితే ఈ ట్యాబ్లెట్ల‌ను కేవ‌లం కొంత కాలం పాటు మాత్ర‌మే వాడాలి. కానీ మంది త‌ర‌చూ వాడుతూనే ఉంటారు. ఇలా చేయ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అనేక దుష్ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని డాక్ట‌ర్ న‌వ‌నీత్ హెచ్చ‌రించారు. క‌నుక విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను వాడేవారు ఆ త‌ప్పుల‌ను చేయ‌కూడ‌ద‌ని ఆయ‌న సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement