త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Smart Lockdown | ఇంధ‌న సంక్షోభం.. లాక్‌డౌన్ విధించిన పాక్ ప్ర‌భుత్వం

Smart Lockdown | మ‌ధ్య‌ప్రాచ్యంలో (Middle East) కొన‌సాగుతున్న యుద్ధంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంధ‌న సంక్షోభం (Fuel crisis) నెల‌కొంది. ఈ సంక్షోభ ప్ర‌భావం దాయాది పాకిస్థాన్ (Pakistan)పై తీవ్రంగా చూపింది. ఎంత‌లా అంటే.. ఏకంగా అక్క‌డ లాక్‌డౌన్ (Pakistan Lockdown) విధించే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

D

International | Published On Apr 7, 2026, 4.06 pm IST

Smart Lockdown | ఇంధ‌న సంక్షోభం.. లాక్‌డౌన్ విధించిన పాక్ ప్ర‌భుత్వం
Advertisement

Smart Lockdown | మ‌ధ్య‌ప్రాచ్యంలో (Middle East) కొన‌సాగుతున్న యుద్ధంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంధ‌న సంక్షోభం (Fuel crisis) నెల‌కొంది. మ‌న దేశంలోనూ ఎల్పీజీ కొర‌త ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ సంక్షోభ ప్ర‌భావం దాయాది పాకిస్థాన్ (Pakistan)పై తీవ్రంగా చూపింది. ఎంత‌లా అంటే.. ఏకంగా అక్క‌డ లాక్‌డౌన్ (Pakistan Lockdown) విధించే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

యుద్ధం కార‌ణంగా హార్మూజ్‌ జలసంధిని మూసివేయడం, విదేశాల నుంచి చమురు రాకపోవడంతో పాక్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాక్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. "స్మార్ట్ లాక్‌డౌన్" (Smart Lockdown) విధించింది. చమురు వినియోగాన్ని తగ్గించేందుకు, ఉన్న నిల్వల్ని కాపాడుకునేందుకు త‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్య‌మంత్రుల‌తో జ‌రిగిన ఉన్నతస్థాయి స‌మావేశం అనంత‌రం లాక్‌డౌన్ గురించి పాక్ ప్రధాని షెహ‌బాజ్ ష‌రీప్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

ఆంక్ష‌లు

పంజాబ్‌, ఖైబ‌ర్ పక్తుంఖ్వా, బ‌లూచిస్థాన్‌, ఇస్లామాబాద్‌, గిల్గిత్ బల్తిస్థాన్, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ వంటి ప్రాంతాల్లో పలు ఆంక్షలు విధించారు. మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌, వాణిజ్య కేంద్రాల‌ను రాత్రి 8 గంట‌ల క‌ల్లా మూసివేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆంక్ష‌ల నుంచి మిన‌హాయింపు ఇచ్చింది. ఖైబ‌ర్ పక్తుంఖ్వాలోని డివిజ‌న‌ల్ హెడ్‌క్వార్ట‌ర్స్‌లో మార్కెట్లు, షాపింగ్‌మాల్స్‌కు రాత్రి 9 గంట‌ల వ‌ర‌కూ అనుమ‌తి ఉంటుంది. జనరల్ స్టోర్స్, డిపార్ట్‌మెంట్ స్టోర్స్, అన్ని రకాల మాల్స్ వంటివి మాత్రం ఆంక్ష‌ల నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా రాత్రి ఎనిమిది గంటలకే మూసేయాలి. బేకరీలు, రెస్టారెంట్లు, ఇతర ఫుడ్ ఔట్‌లెట్లకు మాత్రం రాత్రి 10 గంటల వరకు అనుమ‌తించారు. అత్య‌వ‌స‌ర ఆరోగ్య సేవ‌ల‌కు ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌కుండా మెడికల్ స్టోర్స్, ఫార్మసీల‌కు మాత్రం ఆంక్ష‌ల నుంచి మిన‌హాయింపు ఇచ్చారు.

అదేవిధంగా పెళ్లి వేడుకలపై కూడా ఆంక్షలు విధించారు. వివాహ వేదిక‌లు రాత్రి 10 గంట‌ల‌క‌ల్లా మూసివేయాలి. 10 త‌ర్వాత ఇళ్లల్లో మాత్రమే పెళ్లి వేడుకలు జ‌రుపుకోచ్చు. అయితే, తక్కువ మందితో మాత్ర‌మే నిర్వహించుకోవాలి. ఈ ఆంక్ష‌ల‌న్నీ మంగ‌ళ‌వారం నుంచి త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఈ రోజు రాత్రి 8 గంటల నుంచే దేశవ్యాప్తంగా "స్మార్ట్ లాక్‌డౌన్" అమల్లోకి రానుంది.

తీవ్ర ఇంధ‌న సంక్షోభం..

ఇరాన్ యుద్ధంతో పాక్ ప్ర‌భుత్వం తీవ్ర ఇంధ‌న సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫ‌లితంగా డీజిల్, పెట్రోల్ ధరలను (Petrol Diesel Prices) ప్ర‌భుత్వం రెండింత‌లు పెంచిన విష‌యం తెలిసిందే. డీజిల్ ధ‌ర‌లు 54.9 శాతం పెర‌గ‌గా, పెట్రోల్ ధ‌ర‌ల‌ను 42.7 శాతం అధికం చేసింది. దీంతో లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.520.35 (పాకిస్థానీ రూపాయలు)కు చేర‌గా, పెట్రోల్ రూ.458.41కి పెరిగింది. సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో పెట్రోల్ డీజీల్ ధ‌ర‌లు ఆ దేశ‌ చరిత్రలోనే గ‌రిష్ఠానికి చేరుకున్నాయి. ధ‌ర‌ల పెంపుపై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌, ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. దీంతో దిగొచ్చిన ప్ర‌భుత్వం పెంచిన మ‌రుస‌టి రోజే లీటర్ పెట్రోల్‌పై రూ.80 మేర తగ్గిస్తూ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

శుక్ర‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఆ దేశ ప్ర‌ధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా పెట్రోల్‌ ధ‌ర‌ల‌ను తగ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో పెట్రోల్ ధర లీటర్‌కు 378 PKRకి చేరింది. తగ్గిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కార‌ణంగానే దేశీయంగా ధ‌ర‌ల‌ను పెంచాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. సాధారణ ప్రజలపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అయితే, పెట్రోల్ ధరలను తగ్గించిన పాక్.. డీజిల్ ధరలను మాత్రం యథాతథంగా 520 PKR వద్దే ఉంచడం గమనార్హం.

Also Read..

ఢిల్లీలో విమాన రాక‌పోక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం.. అడ్వైజ‌రీ జారీ చేసిన ఇండిగో

భ‌క్తి క‌థ‌తో క‌న‌క‌దుర్గ - అల్ల‌రి న‌రేష్‌కు జోడీగా కాజ‌ల్

ఆఫ్‌లైన్ ఏఐ టూల్‌ను లాంచ్ చేసిన గూగుల్‌.. ఎన్నో అద్భుత‌మైన ఫీచ‌ర్లు..

Advertisement
Advertisement