త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | శంకర్ గౌడ్‌ది ముమ్మాటికి రేవంత్ స‌ర్కార్ హ‌త్యే.. రాష్ట్ర చ‌రిత్ర‌లో చీక‌టి రోజు : కేటీఆర్

KTR | ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ (RTC driver Shankar Goud)ది ఆత్మ‌హత్య కాద‌ని.. అది ముమ్మాటికీ రేవంత్ స‌ర్కార్ (Revanth government) చేసిన హ‌త్యే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు, తోటి కార్మికుల హక్కుల సాధనకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ శంకర్ గౌడ్ పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిప‌డ్డారు.

D

Hyderabad | Published On Apr 24, 2026, 12.05 pm IST

KTR | శంకర్ గౌడ్‌ది ముమ్మాటికి రేవంత్ స‌ర్కార్ హ‌త్యే.. రాష్ట్ర చ‌రిత్ర‌లో చీక‌టి రోజు : కేటీఆర్
Advertisement

KTR | వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ (RTC driver Shankar Goud) బలవన్మరణం పట్ల బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విచారం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. శంక‌ర్ గౌడ్‌ది ఆత్మ‌హత్య కాద‌ని.. అది ముమ్మాటికీ రేవంత్ స‌ర్కార్ (Revanth government) చేసిన హ‌త్యే అని వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ పోస్టు పెట్టారు.

రెండున్న‌రేళ్లుగా ఆర్టీసీ కార్మికుల‌కు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న తీర‌ని ద్రోహాన్ని త‌ట్టుకోలేక శంక‌ర్ గౌడ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డార‌ని అన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు, తోటి కార్మికుల హక్కుల సాధనకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ శంకర్ గౌడ్ పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిప‌డ్డారు. పుట్టెడు దుఖంలో ఉన్న శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితోపాటు, బీఆర్ఎస్ నేతలు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలను నర్సంపేటలో అరెస్టుచేయడం చాలా దారుణ‌మ‌న్నారు.

వారంద‌రినీ బేష‌ర‌తుగా విడుద‌ల చేయాలి..

రాష్ట్రంలోని వివిధ‌ ప్రాంతాల్లో అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాల‌ని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. అదేవిధంగా శంకర్ గౌడ్ కుటుంబసభ్యులు, ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ డిపో వద్ద నివాళులు అర్పించే అవకాశం కల్పించాల‌ని కోరారు. కాంగ్రెస్ సర్కారు రాక్షసత్వం వల్ల కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పించి అన్ని విధాలా ఆదుకోవాల‌ని కోరారు.

ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలను ఇకనైనా మానుకోవాలి..

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా, కనీసం సోయి లేని సర్కారు అంతులేని నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఉద్యమం నాటి దృశ్యాలు, ఆత్మబలిదానాలు చేసుకునే పరిస్థితులు చూస్తున్నామ‌ని కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు. అసెంబ్లీ ఎన్నికల వేళ సవాలక్ష హామీలిచ్చిన రేవంత్ రెడ్డి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటికీ నెరవేర్చకపోవడంతోనే ఆర్టీసీ కార్మిక లోకం ఇవాళ తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలను ఇకనైనా మానుకోవాల‌ని హిత‌వుప‌లికారు. కార్మికులతో చర్చలు జరిపి, ఇచ్చిన హామీలను, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాల‌ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర చ‌రిత్ర‌లో చీక‌టి రోజు..

రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు ఆర్టీసి డ్రైవర్లు ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన సంఘటన తెలంగాణ చరిత్రలో ఓ చీకటి రోజుగా మిగిలిపోతుంద‌న్నారు. తెలంగాణలో ఏకకాలంలో ఇన్ని బాధాకరమైన సంఘటనలు జరిగినా మానవత్వం లేని కాంగ్రెస్ సర్కారులో కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. మ‌నోధైర్యాన్ని కోల్పోవ‌ద్దంటూ ఆర్టీసీ కార్మిక సోదరుల‌కు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. ఈ నిరంకుశ కాంగ్రెస్ సర్కారు, ఈ అసమర్థ ముఖ్యమంత్రి మెడలు వంచి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కులను సాధించే వరకూ మనమంతా కలిసి సంఘటితంగా ఉద్యమిద్దాం అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు.

Also Read..

దుశ్చ‌ర్ల స‌త్య‌నారాయ‌ణపై దాడి అమానుషం: కేటీఆర్

ఆర్టీసీ ఉద్యోగులు అధైర్య‌ప‌డొద్దు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం సిద్ధం: ఎంపీ చామ‌ల‌

వ్యాపారులు, ప్రొఫెష‌న‌ల్స్ కోసం అసుస్ అల్ట్రా సిరీస్ ల్యాప్ టాప్‌లు.. ఫీచ‌ర్లు, ధ‌ర ఎలా ఉన్నాయంటే..

Advertisement
Advertisement