త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nifty 50 | నిఫ్టీ దారెటు..? కొత్త ఏడాదిలో 30వేల‌కు చేరుతుందా..?

Nifty 50 | గ‌త కొలంగా భార‌త స్టాక్ మార్కెట్ల‌లో అనిశ్చితి నెల‌కొన్న విష‌యం విదిత‌మే. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల‌ను విధించిన‌ప్ప‌టి నుంచి ఆ త‌రువాత వ‌చ్చిన భార‌త్‌-పాక్ యుద్ధం, త‌ద‌నంతర ప‌రిస్థితుల కార‌ణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ప్ర‌స్తుతం అనేక ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటున్నాయి.

S

Business | Published On Dec 31, 2025, 12.05 pm IST

Nifty 50 | నిఫ్టీ దారెటు..? కొత్త ఏడాదిలో 30వేల‌కు చేరుతుందా..?
Advertisement

Nifty 50 | గ‌త కొలంగా భార‌త స్టాక్ మార్కెట్ల‌లో అనిశ్చితి నెల‌కొన్న విష‌యం విదిత‌మే. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల‌ను విధించిన‌ప్ప‌టి నుంచి ఆ త‌రువాత వ‌చ్చిన భార‌త్‌-పాక్ యుద్ధం, త‌ద‌నంతర ప‌రిస్థితుల కార‌ణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ప్ర‌స్తుతం అనేక ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటున్నాయి. ఆల్ టైమ్ హై ద‌గ్గ‌ర్లో గ‌త 2 నెల‌లుగా కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ మార్కెట్లు అక్క‌డి నుంచి ముందుకు క‌ద‌ల‌డం లేదు. దీనికి కార‌ణం కొత్త ఇన్వెస్ట‌ర్లు రాక‌పోడ‌మే అని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. ఓ వైపు విదేశీ సంస్థాగ‌త పెట్టుబ‌డిదారులు (ఎఫ్ఐఐ) దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో పెద్ద ఎత్తున స్టాక్స్‌ను విక్ర‌యిస్తూ మ‌న మార్కెట్ల నుంచి త‌ప్పుకుంటున్నారు. మ‌రోవైపు బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతుండ‌డం, ఇంకో వైపు అమెరికా డాల‌ర్ తో పోలిస్తే భార‌త రూపాయి విలువ రోజు రోజుకీ ప‌త‌నం అవుతుండ‌డం త‌దిత‌ర అంశాల‌న్నీ స్టాక్ మార్కెట్ల‌లో అనిశ్చితికి కార‌ణం అవుతున్నాయి. అయితే వ‌చ్చే కొత్త ఏడాదిలో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎలా ఉంటాయ‌ని పెట్టుబ‌డిదారులు ఆలోచిస్తున్నారు.

నిఫ్టీ @ 29500..?

ఎక‌నామిక్ టైమ్స్ తాజాగా నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో వ‌చ్చే ఏడాదిలో నిఫ్టీ, సెన్సెక్స్ ఎలా ఉంటాయ‌నే విష‌యంపై పాఠ‌కులు ఆస‌క్తిక‌ర‌మైన స్థాయిల‌ను ఎంచుకున్నారు. వారిలో సాధార‌ణ ప్ర‌జ‌లు, పెట్టుబ‌డిదారుల‌తోపాటు ఫండ్ మేనేజ‌ర్లు, ఆర్థిక నిపుణులు కూడా ఉండ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే మెజారిటీ పాఠ‌కులు 2026లో నిఫ్టీ 50 ఏకంగా 3వేల పాయింట్లు పెరిగి 29వేల నుంచి 29500 వ‌ర‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేస్తూ త‌మ నిర్ణ‌యాన్ని తెలిపారు. అలాగే సెన్సెక్స్ 94వేల నుంచి 96వేల‌కు చేరుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే దేశీయ పెట్టుబ‌డిదారులు స్టాక్ మార్కెట్ల‌పై పాజిటివ్‌గా ఉన్నార‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. అయిన‌ప్ప‌టికీ అమెరికా ట్రేడ్ వార్‌, టారిఫ్‌ల విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌చ్చి ఇరు దేశాలు ఒక నిర్ణ‌యం తీసుకునే వ‌ర‌కు మార్కెట్ల‌లో పెట్టుబ‌డి పెట్టేవారు కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మొద‌టి 3 నెల‌లు జాగ్ర‌త్త‌..

2026లో స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డి పెట్టాల‌ని చూస్తున్న‌వారు క‌నీసం మొద‌టి 3 నెల‌ల వ‌ర‌కు వేచి చూస్తే మంచిద‌ని ప‌లువురు ఫండ్ మేనేజ‌ర్లు అభిప్రాయ ప‌డ్డారు. ముఖ్యంగా బంగారం, వెండి వంటి క‌మోడిటీల‌లో పెట్టుబ‌డి పెట్టాల‌ని, అలాగే ఈక్విటీ, డెబిట్ వంటి ఫండ్స్‌లో స‌మాన మొత్తాల్లో పెట్టుబ‌డి పెడితే శ్రేయ‌స్క‌ర‌మ‌ని, ఒకే ఫండ్స్ లో పెద్ద మొత్తంలో పెట్టుబ‌డి పెట్ట‌వ‌ద్ద‌ని సూచించారు. 2026లో లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో భారీ ఎత్తున పెట్టుబ‌డులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, అలాగే మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ కూడా పుంజుకుంటాయ‌ని అన్నారు. వాటిల్లో కేవ‌లం ఒకే దాంట్లో కాకుండా అన్నింట్లోనూ పెట్టుబ‌డి పెడితే సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చ‌ని, రిస్క్ త‌క్కువ‌గా ఉంటుంద‌ని తెలిపారు.

అన్నింట్లోనూ స‌మానంగా..

మ్యుచువ‌ల్ ఫండ్స్ లో సిప్‌ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం మంచిద‌ని, లంప్స‌మ్ పెట్టేముందు ఆలోచించుకోవాల‌ని మార్కెట్ నిపుణులు సూచించారు. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధ‌ర‌లు పెరిగినా కొంత వ‌ర‌కే పెరుగుద‌ల ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. క‌నుక వాటిల్లోనే కాక‌, స్టాక్స్‌, మ్యుచువ‌ల్ ఫండ్స్ అన్నింట్లోనూ స‌మాన పెట్టుబ‌డులు ఉండేలా చూసుకుంటే మంచిద‌ని అన్నారు. అయితే ఈ స‌ర్వేలో దేశీయ స్టాక్ మార్కెట్ల ప‌రిస్థితి ఎలా ఉంద‌ని అడ‌గ్గా 77 శాతం మంది ఆశాజ‌న‌కంగానే ఉంద‌ని స‌మాధానం చెప్ప‌డం విశేషం. అలాగే మ్యుచువల్ ఫండ్స్‌లో డ‌బ్బును ఎలా పెట్టుబ‌డి పెడ‌తారు అని ప్ర‌శ్నించ‌గా 87 శాతం మంది నెల‌వారి సిప్ వేసేందుకే తాము ఆస‌క్తిగా ఉన్నామ‌ని, లంప్స‌మ్ ప‌ట్ల అంత ఆస‌క్తి లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక వెండి, బంగారం ధ‌ర‌లు రానున్న రోజుల్లో ఎలా ఉంటాయ‌ని అడ‌గ్గా, 71 శాతం మంది అంత‌గా పెర‌గ‌క‌పోవ‌చ్చ‌ని, సాధార‌ణ స్థాయిలోనే ధ‌ర‌లు ఉండే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు. మొత్తానికి కొత్త ఏడాదిలో స్టాక్ మార్కెట్ల ప్ర‌ద‌ర్శ‌న ఆశాజ‌న‌కంగానే ఉండ‌బోతుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement