త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR Visits Peddi Sudarshan Reddy Family | ‘నేనున్నా’.. పెద్ది పిల్లలను అక్కున చేర్చుకుని కన్నీరు పెట్టుకున్న కేసీఆర్

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్ ఎమోషనల్ అయ్యారు. పిల్లలకు, తల్లికి భారీ ఆర్థిక సాయం ప్రకటించారు.

J

Warangal | Published On Aug 9, 2026, 8.38 pm IST

KCR Visits Peddi Sudarshan Reddy Family | ‘నేనున్నా’.. పెద్ది పిల్లలను అక్కున చేర్చుకుని కన్నీరు పెట్టుకున్న కేసీఆర్

సంక్షిప్త సారాంశం

అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన బీఆర్‌ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు. పెద్ది జ్ఞాపకాలను తలచుకుని తీవ్ర ఉద్వేగానికి గురైన అధినేత, ఆయన పిల్లలను అక్కున చేర్చుకుని కన్నీరు పెట్టుకున్నారు. పెద్ది కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన కేసీఆర్.. ఇద్దరు పిల్లలకు చెరో కోటి, తల్లికి రూ.25 లక్షల చెక్కులను అందజేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

KCR Visits Peddi Sudarshan Reddy Family | త్రినేత్ర.న్యూస్ : బీఆర్‌ఎస్ (BRS) అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నల్లబెల్లిలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతూ ఇటీవల అకాల మరణం చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. ఆత్మీయుణ్ణి తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు.

ఆదివారం మధ్యాహ్నం ఎర్రవెల్లి నివాసం నుంచి బయలుదేరి నల్లబెల్లి చేరుకున్న కేసీఆర్.. తొలుత పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పెద్ది భార్య స్వప్న, తల్లి అమృతమ్మ, పిల్లలు, సోదరులను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు పెద్ద దిక్కుగా ధైర్యం చెబుతూ.. ఆందోళన చెందవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పిల్లలను బాగా చదివించాలని ఆశీర్వదించిన ఆయన, తండ్రిలేని లోటు తెలియకుండా వారిని కాపాడుకోవాలని పెద్ది అన్నలకు సూచించారు.

Image

కన్నీరు పెట్టిన కేసీఆర్

పార్టీ స్థాపించిన నాటి నుంచి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, పార్టీ నిర్మాణంలో పెద్ది పోషించిన పాత్రను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కేసీఆర్ మౌన ముద్రలోకి వెళ్లారు. నిత్యం చిరునవ్వుతో పలకరించే పెద్ది ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక పిల్లలను హత్తుకుని కన్నీరు రాల్చారు. ఆయన విషణ్ణ వదనంతో ఉండటాన్ని గమనించిన పార్టీ ముఖ్య నేతలు ఆయన్ను అనునయించడంతో కాస్త తేరుకుని, వాతావరణాన్ని తేలికపరిచారు.

భారీ ఆర్థిక సాయం అందజేత

కష్టకాలంలో పార్టీ కుటుంబ సభ్యుల క్షేమం కోసం తల్లడిల్లిన కేసీఆర్, మాటలకే పరిమితం కాకుండా పెద్ది కుటుంబానికి భారీ ఆర్థిక సాయం (Financial aid) అందజేశారు. గతంలో ప్రకటించిన విధంగానే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు (నిదర్శన్ రెడ్డి, ధర్మిష్ట) చెరో కోటి రూపాయల చొప్పున మొత్తం రూ. 2 కోట్ల చెక్కులను కేసీఆర్ అందజేశారు. అలాగే, ఆయన తల్లికి రూ. 25 లక్షల చెక్కును అందించారు.

Image

వెల్లువెత్తిన శ్రేణులు

కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నల్లబెల్లి, నర్సంపేట రోడ్లు గులాబీ శ్రేణులతో నిండిపోయాయి. 'పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే' అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. దారిపొడవునా కాన్వాయ్ ఆపి, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు సాగారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో పాల్గొని, కెప్టెన్ లక్ష్మీకాంతరావు సహా జిల్లా ముఖ్య నేతలతో ముచ్చటించిన అనంతరం ఎర్రవెల్లికి తిరుగు పయనం అయ్యారు. కేసీఆర్ వెంట పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Image

 

Image

Image

Image

Image

Image

 

Advertisement
Advertisement