త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

KTR | బోనాల పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. పలు నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

S

Telangana | Published On Aug 9, 2026, 7.41 pm IST

KTR | అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
Advertisement

బోనాల వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్
హైదరాబాద్‌లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
తలసానితో కలిసి అమ్మవార్లను దర్శించుకున్న కేటీఆర్

KTR | త్రినేత్ర‌.న్యూస్ : బోనాల పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. పలు నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ఆదివారం ఉదయం నాంపల్లిలోని శ్రీ ఏడు గుళ్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్.. అనంతరం చార్మినార్ వద్ద ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ఓల్డ్ సిటీలోని బంగారు మైసమ్మ అమ్మవారిని, అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్న కేటీఆర్‌కు నిర్వాహకులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేటీఆర్ తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

"తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు బోనాల పండుగ శుభాకాంక్షలు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి. అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులందరూ సంతోషంగా ఉండాలి. హైదరాబాద్‌లో వ్యాపారాలు బాగా సాగాలి” అని కేటీఆర్ ఆకాంక్షించారు. తనను బోనాల వేడుకలకు ఆహ్వానించిన నిర్వాహకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తదుపరి మీరాలం మండి శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన కేటీఆర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అంబర్‌పేట్ నియోజకవర్గంలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం, ముషీరాబాద్ రాంనగర్ డివిజన్‌లో రేశం మల్లేష్ నివాసంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయం, బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో కేటీఆర్ పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు.

బోనాల సందర్భంగా కేటీఆర్ పర్యటించిన ప్రతి ప్రాంతంలో స్థానికులు, భక్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు స్వాగతం పలికారు. పలు ప్రాంతాల్లో ప్రజలు కేటీఆర్‌తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

Advertisement
Advertisement