త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

YIPS | యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలి : డీజీపీ సీవీ ఆనంద్‌

YIPS | యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ (YIPS)ను దేశంలోనే ఆదర్శ విద్యాసంస్థగా తీర్చిదిద్దాలని డీజీపీ సీవీ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. మంచిరేవులలో నిర్మాణంలో ఉన్న పాఠశాల పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం పాఠశాల సొసైటీ కమిటీ సమావేశం డీజీపీ అధ్యక్షతన జరిగింది.

P

Telangana | Published On Aug 4, 2026, 5.40 pm IST

YIPS | యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలి : డీజీపీ సీవీ ఆనంద్‌
Advertisement

YIPS | యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ (YIPS)ను దేశంలోనే ఆదర్శ విద్యాసంస్థగా తీర్చిదిద్దాలని డీజీపీ సీవీ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. మంచిరేవులలో నిర్మాణంలో ఉన్న పాఠశాల పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం పాఠశాల సొసైటీ కమిటీ సమావేశం డీజీపీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి, నిర్మాణ పనుల పురోగతి, విద్యా ప్రణాళికలు, ఇతర కీలక అంశాలపై ఆయన సమీక్షించారు. డీజీపీ వెంట ఐపీఎస్‌ అధికారుల భార్యల సంఘం (IPSOWA) అధ్యక్షురాలు లలిత ఆనంద్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పోలీసు పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ పాఠశాల అభివృద్ధికి ఐపీఎస్‌ఓడబ్ల్యూఏ కూడా తమ వంతు సహకారం అందించాలని నిర్ణయించింది.

సమావేశానికి ముందు డీజీపీ విద్యార్థులతో మమేకమయ్యారు. వారితో కలిసి ఫుట్‌బాల్‌ ఆడటంతో పాటు ఆర్చరీ, ఫెన్సింగ్‌ వంటి పోటీల‌ను తిలకించారు. విద్యార్థుల ప్రతిభ, ఉత్సాహాన్ని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్‌ శాఖ సంయుక్తంగా పోలీసు సిబ్బంది పిల్లలు, అమరవీరుల కుటుంబాల పిల్లలు, అలాగే ప్రజలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ను ఏర్పాటు చేశాయని డీజీపీ తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, దేశభక్తి, సేవాభావం, బాధ్యతాయుత పౌరసత్వాన్ని పెంపొందించేలా విద్యాబోధన ఉండాలని పేర్కొన్నారు. యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం, చెడు అలవాట్ల ప్రభావంపై డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడం అత్యంత ముఖ్యమన్నారు. ‘‘ఈ సంస్థ నుంచి సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల నిబద్ధత కలిగిన మంచి పౌరులు తయారవ్వాలి’’ అని సూచించారు.

సమావేశంలో పాఠశాల భవనాల నిర్మాణ పురోగతి, అకాడమిక్‌ ప్రణాళికలు, ప్రతిపాదిత పాఠ్య ప్రణాళిక, అవసరమైన మౌలిక వసతులపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు, బిల్లులు, అభివృద్ధి పనులను పరిశీలించి అవసరమైన అనుమతులు మంజూరు చేశారు. విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, దేశభక్తి, ప్రజాసేవ భావాలను పెంపొందించేలా సీనియర్‌ పోలీసు అధికారులు తరచూ పాఠశాలను సందర్శించి మార్గనిర్దేశం చేయాలని డీజీపీ సూచించారు. గత ఏడాది 125 మంది విద్యార్థులతో ప్రారంభమైన యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌లో ప్రస్తుతం 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి వరకు మొత్తం 345 మంది విద్యార్థులు చదువుతున్నారు. సమావేశంలో లా అండ్‌ ఆర్డర్‌ డీజీ మహేశ్ భగవత్‌, ఆక్టోపస్‌ డీజీ డాక్టర్‌ అనిల్‌ కుమార్‌, ఐజీ పీ అండ్ ఎల్‌ గజారావు భూపాల్‌, ఐజీ (వెల్ఫేర్‌) ఉదయ్‌కుమార్‌ రెడ్డి, సెరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్‌, ఆర్థిక సలహాదారు శరత్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ అనిత, ఫౌండర్‌ విశాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement