త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etela Rajender | రేవంత్ మూర్ఖపు ప్రయత్నాలు బంజేయ్.. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్‌లు ఆన్ జేయి

గత ప్రభుత్వం నిర్మించిందనే పంతంతో కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు ఆపొద్దని, తక్షణమే పంపింగ్ స్టార్ట్ చేసి రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్‌ను ఎంపీ ఈటల డిమాండ్ చేశారు.

J

Telangana | Published On Jul 6, 2026, 6.56 pm IST

Etela Rajender | రేవంత్ మూర్ఖపు ప్రయత్నాలు బంజేయ్.. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్‌లు ఆన్ జేయి
Advertisement
  • బీఆర్ఎస్ కట్టిందనే సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిలిపివేయడం సరికాదు
  • హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గం
  • హైదరాబాద్ మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం రెడీ
  • కాళేశ్వరం, హైడ్రాపై ఈటల సంచలన వ్యాఖ్యలు

Etela Rajender | త్రినేత్ర.న్యూస్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ వినియోగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న వేళ.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం కట్టిందనే భేషజాలకు పోకుండా తక్షణమే కన్నెపల్లి నుంచి పంపింగ్ స్టార్ట్ చేయాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కీలక కామెంట్స్ చేశారు.

ప్రజలను, రైతులను శిక్షించొద్దు

"కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలు జరిపించండి, తప్పు చేసిన వారిని శిక్షించండి.. కానీ ప్రాజెక్టును ఆపేసి రైతులను, ప్రజలను శిక్షించే అధికారం రేవంత్ రెడ్డికి లేదు" అని ఈటల తేల్చి చెప్పారు. ఒకవైపు లక్ష క్యూసెక్కుల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని, మరోవైపు వర్షాలు లేక కరవు పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్ కెపాసిటీ రోజుకు 2 టీఎంసీలని, 25 వేల క్యూసెక్కుల నీరు వస్తే మోటార్లు ఈజీగా రన్ అవుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ లాంటి మహా నగరానికి తాగునీరు అందాలన్నా పంపింగ్ స్టార్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

హైడ్రా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమే

హైడ్రా అంశంపై కూడా ఈటల ఘాటుగా స్పందించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైడ్రా కూల్చివేతల ఎఫెక్ట్‌తో రేవంత్ సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. "హైడ్రా అనే పదాన్ని హిట్లర్ నుంచి తీసుకున్నానని సీఎం స్వయంగా చెప్పారు.. దీన్ని బట్టే ఆయన నైజం అర్థమవుతోంది" అని విమర్శించారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు, జాగాలిస్తే.. ఈ ప్రభుత్వం వాటిని కూలగొట్టి పెద్దలకు అంటగడుతోందని మండిపడ్డారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరును కోర్టులు సైతం పలుమార్లు తప్పుబట్టాయని ఈటల గుర్తుచేశారు.

మెట్రోకు నిధులిచ్చేందుకు కేంద్రం రెడీ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల ఎలాంటి పక్షపాతం చూపడం లేదని ఈటల స్పష్టం చేశారు. శామీర్‌పేట, మేడ్చల్, ఎయిర్‌పోర్ట్, ఫోర్త్ సిటీ వైపు మెట్రో వేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ ఓ పద్ధతి ప్రకారం చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1కు రూ.13 వేల కోట్లు, ఫేజ్-2కు రూ.40 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయడానికి బీజేపీ ఎంపీలు, మంత్రులుగా పూర్తి సపోర్ట్ ఇస్తామని.. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ మంజూరు చేసింది కేంద్రమేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement