త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nizamabad Road Accident | తీర్థయాత్రలో తీవ్ర విషాదం: డివైడర్‌పై సేదతీరుతుండగా.. మృత్యువులా దూసుకొచ్చిన లారీ

చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్తున్న భక్తుల బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వద్ద ఈ ఘోరం జరిగింది.

J

Nizamabad | Published On Aug 13, 2026, 5.52 pm IST

Nizamabad Road Accident | తీర్థయాత్రలో తీవ్ర విషాదం: డివైడర్‌పై సేదతీరుతుండగా.. మృత్యువులా దూసుకొచ్చిన లారీ
Advertisement
  • మహారాష్ట్రలోని కిన్వట్ నుంచి హైదరాబాద్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్తుండగా ప్రమాదం
  • బస్సు టైర్ పంచర్ కావడంతో హైవేపై నిలిపివేసి, డివైడర్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికులు
  • ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టిన లారీ
  • ఈ ప్రమాదంలో సుజాత, మాధవి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

Nizamabad Road Accident | త్రినేత్ర.న్యూస్ : నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆర్మూర్ (Armoor) వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. దైవ దర్శనానికి బయలుదేరిన భక్తుల బస్సును ఓ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో చోటుచేసుకుంది.

టైర్ పంచర్ కావడంతో

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన పలువురు భక్తులు హైదరాబాద్‌లోని (Hyderabad) చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించేందుకు రెండు ప్రత్యేక బస్సుల్లో తీర్థయాత్రకు బయలుదేరారు. ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి వద్దకు రాగానే.. ముందు వెళ్తున్న బస్సు టైర్ సడెన్‌గా పంచర్ (Tyre puncture) అయింది. దీంతో ఆ బస్సుతో పాటు, దాన్ని అనుసరిస్తూ వెనుక వస్తున్న మరో బస్సును కూడా హైవేపై (Highway) నిలిపివేశారు.

రెప్పపాటులో ఘోరం

బస్సులు ఆపడంతో వెనుక బస్సులోని ప్రయాణికులు కొందరు కిందకు దిగారు. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పై (Divider) కూర్చుని సేదతీరుతున్నారు. సరిగ్గా అదే సమయంలో వెనుక వైపు నుంచి మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ లారీ.. ఆగి ఉన్న బస్సును గమనించక బలంగా ఢీకొట్టింది.

అక్కడికక్కడే ఇద్దరు మృతి

లారీ ఢీకొట్టిన వేగానికి బస్సు అమాంతం ముందుకు దూసుకెళ్లి, డివైడర్‌పై కూర్చున్న ప్రయాణికులను ఇడ్చుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన సుజాత, మాధవి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి (Government hospital) తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దైవదర్శనానికి వెళ్తూ ప్రమాదానికి గురికావడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement
Advertisement