త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Svanidhi Yojana | ఆధార్ కార్డుతో రూ.90వేల రుణం.. పూచీక‌త్తు లేదు.. వివ‌రాలు ఇవే..

PM Svanidhi Yojana | మీరు చిన్న వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చు. వీధి వ్యాపారులకు మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదే పీఎం స్వనిధి యోజన. ఈ పథకం ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.90 వేల వరకు రుణం పొందవచ్చు.

S

Business | Published On Aug 13, 2026, 5.22 pm IST

PM Svanidhi Yojana | ఆధార్ కార్డుతో రూ.90వేల రుణం.. పూచీక‌త్తు లేదు.. వివ‌రాలు ఇవే..
Advertisement

PM Svanidhi Yojana | మీరు చిన్న వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చు. వీధి వ్యాపారులకు మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదే పీఎం స్వనిధి యోజన. ఈ పథకం ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.90 వేల వరకు రుణం పొందవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం అనేక ప్రయోజనాలు క‌లిగిన క్రెడిట్ కార్డును కూడా అందిస్తోంది. పీఎం స్వనిధి యోజనను 2020 జూన్‌లో ప్రారంభించారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో వ్యాపారాలు కోల్పోయిన వీధి వ్యాపారులకు ఈ పథకం గణనీయమైన సహాయం అందించింది. ఈ పథకం 2030 మార్చి 31 వరకు కొనసాగనుంది. ఈ పథకానికి వేగంగా ఆదరణ పెరుగుతోంది. ఇప్పటివరకు లబ్ధిదారుల సంఖ్య 75.5 లక్షలను దాటింది. రూ.17,800 కోట్లకు పైగా విలువైన 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ చేశారు. 55 లక్షలకు పైగా లబ్ధిదారులను డిజిటల్ లావాదేవీలతో అనుసంధానించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. పీఎం స్వనిధి యోజన లబ్ధిదారులకు డిజిటల్ క్యాష్‌బ్యాక్, వడ్డీ రాయితీల రూపంలో సుమారు రూ.800 కోట్ల ప్రయోజనం లభించింది.

ప్రభుత్వ రుణం ఎలా పొందాలి?

మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పూచీకత్తు లేని రుణ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.90 వేల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. గతంలో ఈ రుణ పరిమితి రూ.80 వేలు ఉండగా, ప్రభుత్వం మరో రూ.10 వేలు పెంచింది. పీఎం స్వనిధి యోజన కింద రుణాన్ని లబ్ధిదారుడి రుణ చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి మూడు విడతల్లో అందిస్తారు. అంటే ఒక విడత రుణాన్ని సక్రమంగా చెల్లించిన తర్వాత రెండో విడత, ఆ తర్వాత మూడో విడత రుణాన్ని పొందవచ్చు. దరఖాస్తు ఆమోదమైన తర్వాత మొదటి విడతగా రూ.15 వేలు, రెండో విడతగా రూ.25 వేలు, చివరి విడతగా రూ.50 వేలు అందిస్తారు.

క్రెడిట్ కార్డు నుంచి క్యాష్‌బ్యాక్ వరకు..

ఈ పథకం కింద అవసరమైన వారికి ప్రభుత్వం పూచీకత్తు లేకుండా రూ.90 వేల వరకు రుణం అందించడమే కాకుండా, యూపీఐతో అనుసంధానమైన రూపే క్రెడిట్ కార్డును కూడా అందిస్తోంది. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. రుణం రెండో విడతను సకాలంలో చెల్లించిన లబ్ధిదారులకు రూ.30 వేల వరకు పరిమితి కలిగిన క్రెడిట్ కార్డు అందిస్తారు. అలాగే రిటైల్, హోల్‌సేల్ లావాదేవీల కోసం డిజిటల్ చెల్లింపులు చేసినప్పుడు క్యాష్‌బ్యాక్ ప్రయోజనం కూడా లభిస్తుంది.

ఆధార్ ఉంటే చాలు..

పీఎం స్వనిధి యోజన కింద ప్రభుత్వం మూడు దశల్లో రూ.90 వేల వరకు రుణం అందిస్తోంది. ఈ రుణం పొందేందుకు దరఖాస్తుదారులు పెద్ద మొత్తంలో పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డుతో సంబంధిత ప్రక్రియను పూర్తి చేసి రుణం పొందవచ్చు. అలాగే రుణాన్ని చిన్నచిన్న ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఇలా..

పీఎం స్వనిధి యోజన కోసం ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా దరఖాస్తు ఫామ్‌ను నింపి, ఆధార్ కార్డు ప్రతిని జత చేసి బ్యాంకులో సమర్పించాలి. అనంతరం బ్యాంకు దరఖాస్తుదారు అందించిన వివరాలను పరిశీలించి రుణానికి ఆమోదం ఇస్తుంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న మొత్తం లబ్ధిదారుల్లో మహిళల వాటా 40 శాతంగా ఉంది.

Advertisement
Advertisement