త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chanagani Dayakar | కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు.. భాష మార్చుకోకపోతే తరిమికొడతారు

ముఖ్యమంత్రి, దళిత స్పీకర్‌పై కేటీఆర్ వాడుతున్న భాషను తీవ్రంగా ఖండించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని వార్నింగ్.

J

Telangana | Published On Sep 9, 2026, 12.30 pm IST

Chanagani Dayakar | కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు.. భాష మార్చుకోకపోతే తరిమికొడతారు

సంక్షిప్త సారాంశం

సీఎం, దళిత స్పీకర్ పట్ల కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు వాడుతున్న భాష సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ మండిపడ్డారు. అధికారం పోయినా కేటీఆర్, హరీష్ రావులలో అహంకారం తగ్గలేదని, చట్టం, పోలీసులు, అసెంబ్లీ అంటే వీరికి గౌరవం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రిని ఘాటుగా విమర్శిస్తే పెద్ద లీడర్‌ అయిపోతామనే భ్రమలో కేటీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. భాష, వ్యవహారశైలి మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉరికిచ్చి కొడతారని, తెలంగాణ ప్రజలు పళ్లు రాలగొడతారని ఘాటుగా హెచ్చరించారు.

Advertisement
  • టీపీసీసీ నేత చనగాని దయాకర్ ఫైర్

Chanagani Dayakar | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యవహారశైలి, ఆయన వాడుతున్న భాషపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, దళిత స్పీకర్ పట్ల ప్రతిపక్ష నేతలు చూపిస్తున్న అగౌరవంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ తన తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

బావ బామ్మర్దులకు అహంకారం తగ్గలేదు

అధికారం కోల్పోయినా బావ బామ్మర్దులు (కేటీఆర్, హరీష్ రావు) అహంకారం వీడలేదని దయాకర్ విమర్శించారు. ముఖ్యమంత్రిని, ప్రభుత్వ పెద్దలను ఇష్టానుసారంగా, ఘాటుగా విమర్శిస్తే తాము పెద్ద లీడర్లం అయిపోతామన్న పిచ్చి భ్రమలో కేటీఆర్ బతుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తమ సొంత ఎస్టేట్‌గా, తమను తాము రాజుల్లాగా ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. వీరికి రాజకీయాల కంటే సినిమాల్లో డైలాగులు, యాక్టింగ్ బాగా సెట్ అవుతాయని సెటైర్లు వేశారు.

వ్యవస్థల పట్ల ఏమాత్రం గౌరవం లేదు

చట్టం, పోలీసులు, అసెంబ్లీ అంటే బీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం గౌరవం లేకుండా పోయిందని దయాకర్ ఫైర్ అయ్యారు. ఒకవైపు పోలీసులపై దాడులకు దిగుతూ, మరోవైపు మహిళా పోలీసులను సైతం దూషించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో దళిత స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ ఖండించకపోగా, వాటిని కేటీఆర్ సమర్థించడం వారి దుర్మార్గపు ఆలోచనలకు నిదర్శనమన్నారు.

తీరు మార్చుకోకపోతే పళ్లు రాలగొడతారు

కేటీఆర్ తన భాషను, పొగరుబోతు నాటకాలను వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రతిపక్ష హోదాను మర్చిపోయి బరితెగించి వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉరికిచ్చి కొడతారని, ప్రజలే పళ్లు రాలగొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై, ఎజెండా పక్షాన మనుషుల్లాగా మాట్లాడితే ప్రభుత్వం గౌరవిస్తుందని దయాకర్ హితవు పలికారు.

 

Advertisement
Advertisement