త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | “నేను డాక్టర్ కావాలనుకున్నా..” కాంగ్రెస్ మీటింగ్‌లో మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. బీజేపీపై ఫైర్

హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ డాక్టర్స్ సెల్ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైద్య రంగం, బీజేపీ రాజకీయాలపై ఆయన ఏమన్నారంటే..

J

Telangana | Published On Jun 2, 2026, 2.58 pm IST

Mahesh Kumar Goud | “నేను డాక్టర్ కావాలనుకున్నా..” కాంగ్రెస్ మీటింగ్‌లో మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. బీజేపీపై ఫైర్
Advertisement

Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో విద్యావంతులు, మేధావులు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన కాంగ్రెస్ 'డాక్టర్స్ సెల్' సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్స్ సెల్‌ను ఇంత సమర్థవంతంగా ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం తమ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్న డాక్టర్లందరికీ ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నా చిన్ననాటి కల అది: మహేష్ కుమార్ గౌడ్

సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "నేను కూడా చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలని బలంగా అనుకున్నాను. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆ కల నెరవేరలేదు" అంటూ తన ఫ్లాష్‌బ్యాక్‌ను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఎంతోమంది నిష్ణాతులైన వైద్యులు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుండటం శుభపరిణామన్నారు. హైదరాబాద్ నగరం దేశంలోనే ఒక పెద్ద 'మెడికల్ హబ్'గా మారిందని ఆయన కొనియాడారు.

అప్పులున్నా సంక్షేమం ఆగదు

"గత ప్రభుత్వం వల్ల రాష్ట్రంపై దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం పడింది. అయినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మా కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నాం" అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ క్రమంలోనే 'ఆరోగ్యశ్రీ', 'ఫీజు రీఇంబర్స్‌మెంట్' పథకాలు అనగానే మనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) గుర్తుకొస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీ నేతలపై ఘాటు విమర్శలు

దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై మేధావులు, విద్యావంతులు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. కుల, మత రాజకీయాల పట్ల ప్రజలను అలర్ట్ చేయాలన్నారు. సెక్యులరిజం (లౌకికవాదం) ప్రాధాన్యతను విద్యావంతులే ప్రజలకు వివరించాలని కోరారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ (BJP) పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. "జై శ్రీరామ్" పేరు చెబితే చాలు, తాము ఏం చేసినా నడుస్తుంది అనే అహంకార ధోరణిలో బీజేపీ నేతలు ఉన్నారంటూ మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్స్ సెల్ ప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement