త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana RTC strike 2026 | 6 వేల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం.. 65 లక్షల మంది ప్రయాణికుల అవస్థలు

తెలంగాణలో ఆర్టీసీ (TGSRTC) కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నుంచి ప్రారంభమైంది. 97 డిపోలకు పరిమితమైన 6 వేల బస్సులు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది ప్రయాణికుల అవస్థలు పడుతున్నారు.

J

Telangana | Published On Apr 22, 2026, 10.00 pm IST

Telangana RTC strike 2026 | 6 వేల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం.. 65 లక్షల మంది ప్రయాణికుల అవస్థలు

సంక్షిప్త సారాంశం

పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం బుధవారం (ఏప్రిల్ 22) నుంచి టీజీఎస్ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. సుమారు 38,000 మంది కార్మికులు ఇందులో పాల్గొంటున్నారు. 97 డిపోలకు చెందిన దాదాపు 6,000 బస్సులు నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది (హైదరాబాద్‌లో 22 లక్షల మంది) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల బాట పట్టారు. ప్రైవేట్ క్యాబ్‌లు, ఆటోలు చార్జీలను రెట్టింపు చేసి దోచుకుంటున్నారు. సమ్మె కారణంగా అద్దె బస్సుల్లో మహిళలకు 'మహాలక్ష్మి' ఉచిత ప్రయాణ సదుపాయం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్ వేతన సవరణ, ఉచిత బస్సు పథకం బకాయిల విడుదల తదితర 32 డిమాండ్లతో కార్మికులు ఆందోళన బాట పట్టారు.

Advertisement
  • స్తంభించిన తెలంగాణ
  • జనజీవనం అస్తవ్యస్తం
  • హైదరాబాద్‌లో 22 లక్షల మంది అవస్థలు
  • కిక్కిరిసిన మెట్రో.. పెరిగిన ట్రిప్పులు
  • ఆటోలు, క్యాబ్‌ల దోపిడీ
  • సమ్మెలో పాల్గొంటున్న 38 వేల మంది కార్మికులు

త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం కావడంతో బుధవారం (ఏప్రిల్ 22, 2026) నుంచి ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో బుధవారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దాదాపు 38,000 మంది కార్మికులు విధులకు దూరం కావడంతో 97 డిపోలకు చెందిన సుమారు 6,000 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

ప్రయాణికులకు చుక్కలు

ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ బస్సులపై ఆధారపడే సుమారు 60 లక్షల నుంచి 65 లక్షల మంది ప్రయాణికులపై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఒక్క హైదరాబాద్ నగర పరిధిలోనే 22 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, దైనందిన కూలీలు గమ్యస్థానాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, క్యాబ్‌ల నిర్వాహకులు చార్జీలను అమాంతం పెంచేశారు. సాధారణంగా రూ.150-200 ఉండే మార్గాల్లో సైతం రూ.400-500 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మరోవైపు బస్సులు లేకపోవడంతో ప్రజలు సొంత వాహనాలు బయటకు తీయగా.. మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్లలో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.

Telangana RTC Strike: సమ్మె విరమించకపోతే కఠిన చర్యలు.. ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం హెచ్చరిక | Management Warns Rtc Staff Of Strict Action If Strike Is Not Called Off | 10TV

పెరిగిన మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ

బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులంతా మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల వైపు పరుగులు తీస్తున్నారు. అమీర్‌పేట్, ఎల్బీనగర్, జేఎన్‌టీయూ వంటి ప్రధాన స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రద్దీని తట్టుకునేందుకు అధికారులు మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచారు. నాగోల్-రాయదుర్గం మార్గంలో ప్రతి 3 నిమిషాల 40 సెకన్లకు, మియాపూర్-ఎల్బీనగర్ రూట్‌లో ప్రతి 4 నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నారు. అలాగే ప్రభుత్వం కొన్ని అద్దె బస్సులను ప్రైవేట్ డ్రైవర్ల ద్వారా నడుపుతూ కొంత ఉపశమనం కల్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ అద్దె బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం లేదు.

కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే

ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మొత్తం 32 డిమాండ్లతో ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. వాటిలో కీలకమైనవి ఇవే. ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ వెంటనే అమలు చేయాలి. ట్రేడ్ యూనియ‌న్ల‌పై ఆంక్ష‌లు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నిక‌లు నిర్వ‌హించాలి. ఉచిత బ‌స్సు ప‌థ‌కం కింద నెల‌కు రావాల్సిన రూ.400 కోట్ల బ‌కాయిల‌ను ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలి. బ్రెడ్ విన్న‌ర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ప‌ర్మినెంట్ చేయాలి. అద్దె బ‌స్సు డ్రైవ‌ర్ల‌ను సంస్థ‌లో విలీనం చేయాలి. ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. సంస్థ ప్రైవేటీక‌ర‌ణ‌ను ఆపివేయాలి.

సకల జనుల సమ్మెగా మారుస్తాం: జేఏసీ వార్నింగ్

సమస్యలు పరిష్కరించే వరకు ఈసారి సమ్మె ఆపే ప్రసక్తే లేదని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. "నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేయాలని చూస్తున్న ప్రభుత్వం, ఆర్టీసీని మాత్రం పట్టించుకోక‌పోవ‌డం దారుణం. ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితి స‌రిగా లేన‌ప్పుడు మూసీ అభివృద్ధి ఎలా చేస్తున్నారో చెప్పాలి" అని వారు ప్రశ్నించారు. ఈ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతోందని హెచ్చరించారు.

ప్రభుత్వ స్పందన

సమ్మెపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. కార్మికులు సమ్మెను విరమించి తక్షణమే చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. 32 డిమాండ్లలో 29 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఆర్థికపరమైన అంశాల పరిష్కారానికి కొంత సమయం కావాలని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ సమ్మె రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

 

Advertisement
Advertisement