త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

కల్యాణ లక్ష్మిపై వెన‌క్కి త‌గ్గేది లేదు

Ponnam Prabhakar | క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కొనసాగించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. పథకాల అమలును నిలిపివేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ చేయనున్నట్లు తెలిపారు.

P

Telangana | Published On Aug 17, 2026, 3.11 pm IST

కల్యాణ లక్ష్మిపై వెన‌క్కి త‌గ్గేది లేదు
Advertisement
  • హైకోర్టు స్టేపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేస్తాం
  • గ‌త ప్ర‌భుత్వ జీవో వ‌ల్ల‌నే స‌మ‌స్య‌
  • లోప‌భూయిష్ట‌మైన జీవోల‌ను స‌వ‌రించి ప‌థ‌కాలు కొన‌సాగించేలా చ‌ర్య‌లు
  • స్ప‌ష్టం చేసిన మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, వాకిటి శ్రీ‌హ‌రి

Ponnam Prabhakar | క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కొనసాగించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. పథకాల అమలును నిలిపివేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ చేయనున్నట్లు తెలిపారు. సచివాలయంలో సోమవారం మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క‌ల్యాణ‌లక్ష్మి పథకానికి సంబంధించి ఇప్పటివరకు జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాల్‌ చేస్తూ డబ్ల్యూపీ నంబర్‌ 21732/2026 కింద హైకోర్టులో పిటిషన్‌ దాఖలైందని మంత్రి తెలిపారు. దీనిపై ఈ నెల 12న హైకోర్టు సెప్టెంబర్‌ 9 వరకు మధ్యంతర స్టే విధించిందన్నారు. అయితే, అప్పటి వరకు వేచి చూడకుండా స్టే తొలగింపునకు న్యాయపరంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు.

గత ప్రభుత్వ జీవోల వల్లే సమస్య

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల్లో ఏమైనా న్యాయపరమైన లోపాలు ఉంటే అవి గత ప్రభుత్వం 2014లో జారీ చేసిన ఉత్తర్వుల్లోని లోపాల వల్లే ఏర్పడ్డాయని పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. అప్పట్లో జీవోలు సరైన రీతిలో జారీ చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన లోపభూయిష్టమైన జీవోలను సరిచేసి పథకాలను కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పథకానికి సంబంధించి కౌంటర్‌ దాఖలులో జాప్యం ఎందుకు జరిగిందన్న అంశంపై ప్రభుత్వం విచారణ జరుపుతోందన్నారు. అధికారుల వైఫల్యమా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల వ్యవహారాల్లో లోపమా, న్యాయపరమైన అంశాలను పర్యవేక్షించే విభాగం నుంచి పొరపాటు జరిగిందా అన్నదానిపై పరిశీలన చేస్తున్నామని చెప్పారు. తప్పిదం ఎవరిదైనా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గ్రీన్‌ చానల్‌లో నిధుల విడుదల

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల నిధులను గ్రీన్‌ చానల్‌ ద్వారా విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో లబ్ధిదారులు చెక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలను ఎత్తుకుని వచ్చి చెక్కులు తీసుకునే పరిస్థితి కనిపించేదన్నారు. తమ ప్రభుత్వం నోడల్‌ ఏజెన్సీ ద్వారా నిధుల విడుదలకు వ్యవస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల నేపథ్యంలో నిధుల సకాలంలో విడుదలకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం పథకం గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిందన్న కారణంతో నిర్లక్ష్యం చేయకుండా కొనసాగిస్తోందన్నారు.

16.78 లక్షల మందికి లబ్ధి

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ.16,375.87 కోట్లకు పైగా ఖర్చు చేసి 16,78,347 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించినట్లు ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన వివరాల్లో పేర్కొంది.
ఎస్సీ సంక్షేమం: రూ.2,734.81 కోట్లు – 2,73,164 మంది
ఎస్టీ సంక్షేమం: రూ.1,801.48 కోట్లు – 1,79,939 మంది
బీసీ సంక్షేమం: రూ.7,803.05 కోట్లు – 7,79,401 మంది
ఈబీసీ సంక్షేమం: రూ.831.70 కోట్లు – 83,074 మంది
మైనార్టీ సంక్షేమం: రూ.3,204.83 కోట్లు – 3,62,769 మంది

పేద కుటుంబాల్లో ఆడబిడ్డ వివాహ సమయంలో ఏర్పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. వివాహాన్ని కేవలం వ్యక్తిగత కార్యక్రమంగా చూడటం సరికాదని, పేద కుటుంబాలకు అది సామాజిక, ఆర్థిక బాధ్యతగా మారుతుందని అన్నారు. అప్పులు చేయడం, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వ సహాయం అందిస్తోందన్నారు.

రాజ్యాంగబద్ధంగానే పథకాల అమలు

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ఏదైనా చట్టాన్ని అమలు చేసేందుకు రూపొందించినవి కావని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 162 కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కార్యనిర్వాహక అధికారంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేనని పేర్కొంది. రాష్ట్ర పరిధిలోని సంక్షేమ అంశాలపై ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ల ద్వారా పథకాలను రూపొందించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. ఈ విషయంలో (రాయ్ సాహిబ్ రామ్ జవయా కపూర్ v. స్టేట్ ఆఫ్ పంజాబ్) Rai Sahib Ram Jawaya Kapur v. State of Punjab కేసులో సుప్రీంకోర్టు తీర్పు న్యాయపరమైన ఆధారంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇవి డెలిగేటెడ్‌ లెజిస్లేషన్‌ కాదని, ఎగ్జిక్యూటివ్‌ వెల్ఫేర్‌ స్కీములని తెలిపింది. పథకాలకు కేటాయించే నిధులకు రాష్ట్ర బడ్జెట్‌ ద్వారా శాసనసభ ఆమోదం ఉంటుందని, ట్రెజరీ రూల్స్‌, ఫైనాన్షియల్‌ కోడ్‌, ఇతర ఆర్థిక నిబంధనలకు అనుగుణంగానే నిధులు విడుదలవుతున్నాయని వివరించింది. లబ్ధిదారుల అర్హత, ఆదాయ పరిమితి, వయస్సు, ఆధార్‌, వివాహం తదితర అంశాలపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని తెలిపింది. వివాహ సమయానికి వధువు 18 ఏళ్లు పూర్తి చేసి ఉండటం తప్పనిసరని, ఆర్డీవో, ఎంఆర్‌ఓ స్థాయిలో అర్హతలను పరిశీలించే వెరిఫికేషన్‌ వ్యవస్థ ఉందని పేర్కొంది. అందువల్ల ప్రజాధనాన్ని ఎలాంటి నియంత్రణ లేకుండా ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు వాస్తవానికి విరుద్ధమని ప్రభుత్వం తెలిపింది.

సీఏజీ అభ్యంతరాలపై పరిశీలన

సీఏజీ నివేదికలో పేర్కొన్న అభ్యంతరాలు, సూచనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు. అవి పథకం చట్టవిరుద్ధమని తుది న్యాయ నిర్ణయం కాదన్నారు. బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 46 కూడా బలహీన వర్గాల విద్యా, ఆర్థిక ప్రయోజనాల అభివృద్ధికి రాష్ట్రం కృషి చేయాలని సూచిస్తోందని గుర్తు చేశారు. కల్యాణ లక్ష్మి పథకంపై బీఆర్‌ఎస్‌ మొసలి కన్నీరు కారుస్తూ నిరసనలు చేస్తోందని పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వానికి ఎలాంటి ఉద్దేశం లేదని, కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తున్నామని తెలిపారు. బీసీ కులగణనలో భాగస్వామ్యం కాని వారు ఇప్పుడు ధర్నాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై రాజకీయం చేయడం అనవసరమని, కనీస ఇంగిత జ్ఞానం ఉండాలని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎన్ని ఇళ్లు ఇచ్చింది, ఎంతమందికి ఉపాధి కల్పించిందన్న అంశంపై చర్చకు సిద్ధమని అన్నారు.

రేపు పాపన్నగౌడ్‌ విగ్రహావిష్కరణ

బహుజన నాయకుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ 376వ జయంతి సందర్భంగా మంగళవారం ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నట్లు పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, బలహీన వర్గాల నాయకులు, కుల సంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఇటీవలే ట్యాంక్‌బండ్‌ సమీపంలో సామాజిక ఉద్యమ నాయకులు మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను ఆవిష్కరించుకున్నామని మంత్రి గుర్తు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement