త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGCSB | సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం

TGCSB | సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలిచిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి సమీక్షలో సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించిన తొమ్మిది కీలక పనితీరు ప్రమాణాల్లో రాష్ట్రం అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు వెల్లడించారు.

P

Telangana | Published On Aug 7, 2026, 6.08 pm IST

TGCSB | సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం
Advertisement
  • టీజీసీఎస్‌బీ ప‌నితీరును అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్‌

TGCSB | సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలిచిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి సమీక్షలో సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించిన తొమ్మిది కీలక పనితీరు ప్రమాణాల్లో రాష్ట్రం అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు వెల్లడించారు. ఈ విజయానికి కృషి చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శిఖా గోయెల్‌తో పాటు నగర పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)ను ఏర్పాటు చేసి సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిందని డీజీపీ పేర్కొన్నారు. రూ.5 లక్షలకు పైబడిన సైబర్ మోసాల కేసుల్లో 49 ఈ-జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం ద్వారా వేగవంతమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సైబర్ నేరాల ఫిర్యాదుల పరిష్కారంలో రాష్ట్రం 88 శాతం విజయశాతాన్ని నమోదు చేయగా, బాధితులకు మోసపోయిన నగదు తిరిగి అందించడంలో 81 శాతం మేర ఫలితాలు సాధించినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘సహయోగ్’ (SAHYOG) పోర్టల్ వినియోగంలోనూ తెలంగాణ 88 శాతం పనితీరు కనబరిచిందన్నారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరాలపై సమర్థవంతమైన నిఘా కోసం 5,500 మంది నేరస్థుల ప్రొఫైళ్లను అప్‌లోడ్ చేయడంతో పాటు 15 వేల అంతర్రాష్ట్ర నేర సంబంధాలను గుర్తించినట్లు తెలిపారు. సైబర్ దర్యాప్తు సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ‘సైట్రైన్’ (CyTrain) ద్వారా 524 మంది పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించినట్లు వెల్లడించారు.

దేశంలో సైబర్ నేరాలకు కేంద్రాలుగా గుర్తింపు పొందిన ప్రధాన రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు స్థానం లేకపోవడం రాష్ట్ర పోలీసుల సమర్థవంతమైన చర్యలకు నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు ఇప్పటివరకు 8.5 లక్షల మందికి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, డిజిటల్ అరెస్ట్ మోసాలపై మరో రెండు లక్షల మందికి ప్రత్యేకంగా చైతన్యం కల్పించినట్లు తెలిపారు. సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌లో తెలంగాణ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఇదే స్ఫూర్తితో సైబర్ నేరాల నియంత్రణలో మరింత సమర్థంగా పనిచేస్తామని డీజీపీ సీవీ ఆనంద్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement