త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy | కాంట్రాక్టర్లను వేధించొద్దు.. గ‌నుల‌శాఖ అధికారుల‌కు కోమటిరెడ్డి ఆదేశాలు

Komatireddy | రోడ్ల నిర్మాణ ప‌నులు చేపడుతున్న చిన్న కాంట్రాక్టర్లను అనుమతుల పేరుతో వేధించవద్దని గనులశాఖ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిని వదిలేసి, నిబంధనల మేరకు పనులు చేస్తున్న చిన్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడం సరికాదన్నారు.

P

Telangana | Published On Aug 7, 2026, 4.19 pm IST

Komatireddy | కాంట్రాక్టర్లను వేధించొద్దు.. గ‌నుల‌శాఖ అధికారుల‌కు కోమటిరెడ్డి ఆదేశాలు
Advertisement

Komatireddy | రోడ్ల నిర్మాణ ప‌నులు చేపడుతున్న చిన్న కాంట్రాక్టర్లను అనుమతుల పేరుతో వేధించవద్దని గనులశాఖ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిని వదిలేసి, నిబంధనల మేరకు పనులు చేస్తున్న చిన్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. సచివాలయంలో శుక్రవారం గనులు, భూగర్భశాఖ మంత్రి డాక్టర్ జీ వివేక్ వెంకటస్వామితో కలిసి కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. రహదారుల నిర్మాణానికి అవసరమైన మెటల్, ఇసుక, మట్టి వంటి నిర్మాణ సామగ్రి తవ్వకాలకు అనుమతులు పొందడంలో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు.

మైనింగ్ కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. రహదారి పనులు చేస్తున్న చిన్న కాంట్రాక్టర్లపై మైనింగ్ విలువకు పది రెట్లు జరిమానాలు విధించడం సమంజసం కాదని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఘటనను ప్రస్తావించిన కోమటిరెడ్డి, ఆ పరిస్థితులకు కారణమైన అధికారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. రూ.5 కోట్ల విలువైన అంశానికి సంబంధించి రూ.54 కోట్ల జరిమానా విధించడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఒప్పందాల్లో పేర్కొన్న మేరకు కాంట్రాక్టర్లు అన్ని చెల్లింపులు చేస్తున్నప్పటికీ గనులశాఖ అధికారులు వేధించడం తగదన్నారు.

రాష్ట్రంలో నాణ్యమైన రహదారుల నిర్మాణ లక్ష్యంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) కింద ప్రభుత్వం భారీ ఎత్తున రోడ్ల నిర్మాణ పనులు చేపట్టిందని కోమటిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ పనులను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించామని, 2028 ఆగస్టు నాటికి అన్ని పనులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కోమటిరెడ్డి ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంట్రాక్టర్ల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గనులశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ (హ్యామ్ రోడ్స్) బీవీ రావు, మైనింగ్ కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement