త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Solar Power | నీటిపారుదల భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

Solar Power | నీటిపారుదల శాఖకు చెందిన భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా వేగంగా కార్యాచరణ చేపట్టాలని మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ కేవలం ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకే పరిమితం కాకుండా సొంత వనరులను సృష్టించుకునే దిశగా ముందడుగు వేయాలని ఆయన స్పష్టం చేశారు.

P

Telangana | Published On Jun 9, 2026, 7.58 pm IST

Solar Power | నీటిపారుదల భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
Advertisement

Solar Power | నీటిపారుదల శాఖకు చెందిన భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా వేగంగా కార్యాచరణ చేపట్టాలని మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ కేవలం ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకే పరిమితం కాకుండా సొంత వనరులను సృష్టించుకునే దిశగా ముందడుగు వేయాలని ఆయన స్పష్టం చేశారు. జలసౌధలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకాలు సహా అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు భారీగా విద్యుత్ వ్యయం జరుగుతోందని తెలిపారు. ఈ వ్యయాన్ని దీర్ఘకాలంలో తగ్గించేందుకు సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అవకాశాలను విస్తృతంగా పరిశీలించాలని సూచించారు.

అందుబాటులో ఉన్న ప్రతి నీటిపారుదల భూమి, కాలువలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులే తొలి ప్రాధాన్యంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే బయటి నిపుణ సంస్థల సహకారం తీసుకోవాలని, ఇప్పటికే ఉన్న అధ్యయనాలు, నివేదికలను వినియోగించి ఆలస్యం లేకుండా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో అధికారుల ప్రజెంటేషన్ ప్రకారం రాష్ట్రంలోని సుమారు 16 జలాశయాల వద్ద ఇప్పటికే సాధ్యతా అధ్యయనాలు పూర్తయ్యాయి. అనుకూలమైన జలాశయాలు, నీటిపారుదల భూముల్లో కేవలం 10 శాతం విస్తీర్ణాన్ని వినియోగించినా 6వేల నుంచి 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సాధ్యమని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంజీరా, సింగూరు వంటి జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల అవకాశాలను కూడా పరిశీలించాలని మంత్రి సూచించారు. కాలువలపై బిల్డ్–ఓన్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్ (BOOT) విధానంలో ప్రాజెక్టులు చేపట్టే ప్రతిపాదనలను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

జాగోరా–చందోరా మధ్య సుమారు 15 కిలోమీటర్ల కాలువపై ప్రతిపాదించిన ప్రాజెక్టును అధికారులు వివరించారు. ప్రభుత్వ పెట్టుబడి లేదా భూసేకరణ అవసరం లేకుండానే 20 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సాధ్యమని తెలిపారు. దీని ద్వారా సంవత్సరానికి సుమారు 340 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, అందులో అవసరానికి 84 లక్షల యూనిట్లు వినియోగించి మిగతా విద్యుత్ విక్రయం ద్వారా ఏటా సుమారు రూ.11.5 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరించారు. అలాగే, విద్యుత్ కొనుగోలు వ్యయంలో ఏటా సుమారు రూ.6.2 కోట్ల వరకు ఆదా అవుతుందని, 25 ఏళ్ల కాలంలో ఇది సుమారు రూ.155 కోట్ల పొదుపుకు దారి తీస్తుందని అధికారులు సమావేశంలో తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 8,000 ఎకరాలకు స్థిరమైన నీటి, విద్యుత్ మద్దతు లభించడంతో పాటు కాలువల్లో నీటి ఆవిరి తగ్గడం, నీటి ఉష్ణోగ్రత నియంత్రణ వంటి పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను వేగంగా ముందుకు తీసుకెళ్లి, నీటిపారుదల రంగాన్ని పునరుత్పాదక ఇంధన వినియోగంలో దేశానికి ఆదర్శంగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement