త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | మీ ప్రతి కన్నీటి చుక్కా బంగారు పతకంతో సమానం.. కామ‌న్వెల్త్ పతక విజేతలను అభినందించిన ప్ర‌ధాని మోదీ

PM Modi | కామన్వెల్త్‌ గేమ్స్‌-2026లో (Commonwealth Games 2026) పతకాల పంట పండించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్ర‌త్యేకంగా అభినందించారు. క్రీడాకారుల విజ‌యాల‌ను కేవ‌లం వ్య‌క్తిగ‌త విజ‌యాలుగా మాత్ర‌మే చూడ‌కూడ‌ద‌ని చెప్పారు. ఈ విజ‌యం భ‌విష్య‌త్తు త‌రాల‌కు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంద‌ని కొనియాడారు.

D

Sports | Published On Aug 10, 2026, 12.24 pm IST

PM Modi | మీ ప్రతి కన్నీటి చుక్కా బంగారు పతకంతో సమానం.. కామ‌న్వెల్త్ పతక విజేతలను అభినందించిన ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | కామన్వెల్త్‌ గేమ్స్‌-2026లో పతకాల (Commonwealth Games 2026) పంట పండించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్ర‌త్యేకంగా అభినందించారు. గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో సత్తా చాటి పతకాలు సాధించిన భారత బృందం సభ్యులతో మోదీ త‌న అధికారిక నివాసంలో ఆదివారం భేటీ అయిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అథ్లెట్లతో ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని కార్యాల‌యం సోమ‌వారం విడుద‌ల చేసింది.

క్రీడాకారుల‌ విజయాలు దేశానికి గర్వకారణమని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని పేర్కొన్నారు. క్రీడలు, శారీరక శ్రమ ప్రాముఖ్యత గురించి మాటలతో చెప్పేదానికంటే, అథ్లెట్లు సాధించే పతకాలే యువతను మరింత ప్రభావితం చేస్తాయ‌న్నారు. క్రీడాకారుల విజ‌యాల‌ను కేవ‌లం వ్య‌క్తిగ‌త విజ‌యాలుగా మాత్ర‌మే చూడ‌కూడ‌ద‌ని చెప్పారు. ఈ విజ‌యం భ‌విష్య‌త్తు త‌రాల‌కు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంద‌ని కొనియాడారు. ఈ స‌మావేశంలో ప్ర‌ముఖ బాక్స‌ర్ ల‌వ్లీనా బొర్గోహైన్‌ (Lovlina Borgohain)ను ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా అభినందించారు.

గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ సమయంలో ఒక రెస్టారెంట్‌లో తప్పుగా చూపించిన భారత మ్యాప్‌ను లవ్లీనా తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని ప్రస్తావించారు. "మీరు చేసింది సాధార‌ణ‌మైన‌ది కాదు.. చిర‌కాలం గుర్తుండిపోతుంది" అని పేర్కొన్నారు. అదేవిధంగా.. స్వర్ణ పతకం గెలుచుకున్న క్షణాలను గుర్తు చేసుకొని వెయిట్‌లిఫ్టింగ్ స్టార్ మీరాబాయి చాను (Mirabai Chanu) భావోద్వేగానికి గుర‌య్యారు. దీనికి స్పందించిన మోదీ.. "నీ ప్రతి కన్నీటి చుక్కా బంగారు పతకంతో సమానం" అని ప్రశంసించారు.

అలాగే ఇతర పతక విజేతలతోనూ మోదీ సుదీర్ఘంగా మాట్లాడారు. స్వర్ణ పతక విజేత బాక్సర్ సాక్షి చౌదరితో సహా మరికొందరు ఛాంపియన్‌లతో ప్ర‌ధాని స‌ర‌దాగా ముచ్చ‌టించారు. వారి అనుభ‌వాల‌ను అడిగి తెలుసుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత బాక్సర్ సాక్షి చౌదరి.. పతకాలు సాధించిన బృందాన్ని ఆహ్వానించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్ర‌ధానిని క‌ల‌వ‌డం చాలా సంతోషంగా, గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడల మంత్రి మన్​సుఖ్ మాండవీయా, ఒలింపిక్ ఇండియా అధ్యక్షురాలు పీటీ ఉష ఉన్నారు.

Image

39 పతకాలు

గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌-2026లో భారత్‌ మొత్తం 39 పతకాలు సాధించింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి కామన్వెల్త్‌ గేమ్స్‌లో గతంతో పోలిస్తే క్రీడాంశాల సంఖ్య గణనీయంగా తగ్గింది. భారత్‌కు సంప్రదాయంగా బలమైన కొన్ని క్రీడలు కూడా ఈసారి పోటీల్లో లేకపోయాయి. అయినప్పటికీ అందుబాటులో ఉన్న ఈవెంట్లలో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి 39 పతకాలను ఖాతాలో వేసుకోవ‌డం విశేషం.

Also Read..

ఓలా ఎల‌క్ట్రిక్ భారీ డీల్‌.. భారీ బ్యాట‌రీ ఎన‌ర్జీ స్టోరేజ్ సిస్ట‌మ్స్ రంగంలోకి అడుగు..

ప‌రీక్ష‌ల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై అసెంబ్లీ వ‌ర‌కూ విద్యార్థుల‌ మార్చ్‌.. జార్ఖండ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌

రాత్రికిరాత్రే గ‌ద్దె కూల్చివేత‌.. న‌ర్సంపేట‌లో బీఆర్ఎస్ నేత‌ల ధ‌ర్న‌.. ఉద్రిక్త‌త‌

Advertisement

తాజావార్తలు

Advertisement