త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI | ఎస్‌బీఐ తీరుపై స‌ర్కారు సీరియ‌స్‌.. ఆర్థిక సంబంధాల‌పై పునఃసమీక్షించే ఆలోచనలో ప్ర‌భుత్వం?

SBI | త్రినేత్ర‌.న్యూస్‌: రాయ‌దుర్గం భూముల (Rayadurgam Lands) వేలం వ్య‌వ‌హారం చిలికి చిలికి గాలివాన‌గా మారుతున్న‌ది. భూమి త‌మ‌దంటే త‌మ‌ద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Govt), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఢీ అంటే ఢీ అంటున్నాయి.

G

Telangana | Published On Jun 21, 2026, 12.37 pm IST

SBI | ఎస్‌బీఐ తీరుపై స‌ర్కారు సీరియ‌స్‌.. ఆర్థిక సంబంధాల‌పై పునఃసమీక్షించే ఆలోచనలో ప్ర‌భుత్వం?
Advertisement

SBI | త్రినేత్ర‌.న్యూస్‌: రాయ‌దుర్గం భూముల (Rayadurgam Lands) వేలం వ్య‌వ‌హారం చిలికి చిలికి గాలివాన‌గా మారుతున్న‌ది. భూమి త‌మ‌దంటే త‌మ‌ద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Govt), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఢీ అంటే ఢీ అంటున్నాయి. రాయ‌దుర్గం భూముల విష‌యంలో ఎస్‌బీఐ తీరుపై ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ది. ప్ర‌త్యామ్నాయ భూమి ఇస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ కోర్టుకెక్క‌డాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ది. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ఫిర్యాదు చేసే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తున్న‌ది. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి అన్ని ఖాతాలను మరో బ్యాంకుకు మార్చాలని నిర్ణయించినట్టు స‌మాచారం. ఇందులో భాగంగా ప్ర‌భుత్వ డిపాజిట్లు, సంక్షేమ పథకాల నిధులు, ఉద్యోగుల ఖాతాల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

జూన్ 1న వేలం.. కోర్టుకెక్కిన ఎస్‌బీఐ

జూన్‌ 1న రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్‌మక్తా గ్రామం సర్వే నంబర్‌ 83/1లోని హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలోని 5 ఎకరాలను టీజీఐఐసీ (TGIIC ) వేలం వేసింది. ఈ వేలంలో రికార్డు స్థాయిలో ఎకరానికి సుమారు రూ.237 కోట్లు ధర పలక‌డంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. అయితే ఆ భూమిని వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ ఎస్‌బీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. 2010లో సుమారు రూ.600 కోట్ల మార్కెట్ విలువ ఉన్న భూమిని రూ.13.33 కోట్లు చెల్లించి ఎస్‌బీఐ కొనుగోలు చేసింది. భూమి తమ స్వాధీనంలోనే ఉందని, తమకు అమ్మిన తర్వాత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని వేలం వేయడం నిబంధనలకు విరుద్ధమని ఎస్‌బీఐ వాదిస్తున్న‌ది.

అయితే కేటాయింపు నిబంధనల ప్రకారం ఎస్‌బీఐ రెండేండ్ల‌లోలో ఆ భూమిలో కార్పొరేట్‌ కార్యాలయం నిర్మించాల్సి ఉందని ప్రభుత్వం వెల్ల‌డించింది. కానీ బ్యాంకు ఆ భూమిని ఉద్దేశానికి అనుగుణంగా వినియోగించనందున ఆ కేటాయింపును రద్దు చేసి వేలం ప్రక్రియ చేపట్టినట్లు టీజీఐఐసీ తెలిపింది. 2011లోనే విక్రయ ఒప్పంద పత్రాల అప్పగింత, నిర్మాణాన్ని ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఎస్‌బీఐ ఎలాంటి నిర్మాణాలను చేప‌ట్ట‌లేదు. దీంతో ఈ కేటాయింపును రద్దు చేయడానికి అనుమతి ఇవ్వాలని టీజీఐఐసీ 2019, 2020లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉత్తర, ప్రత్యుత్తరాల అనంతరం ఎస్‌బీఐకి చేసిన భూ కేటాయింపులను 2021 జనవరి 22న టీజీఐఐసీ రద్దు చేసింది. ప్ర‌త్యామ్నాయంగా 2.6 ఎకరాల భూమిని ఇస్తామ‌న్న ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌కు గతంలో ఎస్బీఐ అధికారులు అంగీకరించారు. రాష్ట్రస్థాయి అధికారులతో ప్రభుత్వ చర్చల్లో కూడా మౌఖికంగా ఎస్బీఐ అంగీకరించింది. కానీ, ఆ తర్వాత మాట మార్చిన ఎస్బీఐ కోర్టులో పిటిషన్ వేసింది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యామ్నా భూమి ఇస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ కోర్టులో కేసుయ‌డం ప‌ట్ల ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ పరిణామాన్ని తెలంగాణ ప్రభుత్వం కేవలం భూముల వివాదంగా కాకుండా దీని వెనుక ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు, ఇతర ప్రయోజనాల కుట్ర కోణం ఏదైనా ఉందా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్న‌ది. అవసరమైతే ఎస్‌బీఐతో ఆర్థిక సంబంధాలను పునఃసమీక్షించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదే జ‌రిగితే ప్ర‌భుత్వ‌ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌తోపాటు, స‌ర్కారు చెల్లింపుల‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది.

Advertisement
Advertisement