త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ekta Mall Telangana | రూ.200 కోట్ల ‘ఏక్తా మాల్’ ప్రైవేట్ బిల్డర్ల జేబుల్లోకి? శాసనమండలిలో సర్కార్‌ను నిలదీసిన దాసోజు శ్రవణ్

చేతివృత్తుల కళాకారుల కోసం కేంద్రం కేటాయించిన రూ.200 కోట్ల 'ఏక్తా మాల్' ప్రాజెక్టును ప్రైవేట్ బిల్డర్లకు అప్పగించడంపై మండలిలో దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.

J

Telangana | Published On Sep 12, 2026, 4.22 pm IST

Ekta Mall Telangana | రూ.200 కోట్ల ‘ఏక్తా మాల్’ ప్రైవేట్ బిల్డర్ల జేబుల్లోకి? శాసనమండలిలో సర్కార్‌ను నిలదీసిన దాసోజు శ్రవణ్
Advertisement
  • హస్తకళలు, స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన కోసం కేంద్రం రూ.200 కోట్లతో 'ఏక్తా మాల్' మంజూరు
  • ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపణ
  • గొంతులేని పేద కళాకారుల హక్కులను కాలరాస్తూ ప్రాజెక్టును కమర్షియల్ మాల్‌గా మార్చడంపై శాసనమండలిలో ఫైర్
  • ఏ ప్రాతిపదికన అపర్ణ, వంశీరామ్ బిల్డర్లకు కేటాయించారో సమాధానం చెప్పాలని ప్రభుత్వానికి డిమాండ్

Ekta Mall Telangana | త్రినేత్ర.న్యూస్ : దేశంలోని ప్రాచీన కళలు, సాంప్రదాయ ఉత్పత్తులకు వేదికగా నిలవాల్సిన 'ఏక్తా మాల్' (Ekta Mall) ప్రాజెక్టు తెలంగాణలో వివాదాస్పదంగా మారింది. చేతివృత్తుల కళాకారుల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 200 కోట్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగిస్తోందని బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ శాసనమండలి వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కళాకారుల కోసం కేంద్రం నిధులు

స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ గుర్తింపు తెచ్చేందుకు ‘వోకల్ ఫర్ లోకల్’, ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP)’ విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 'స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (SASCI)' కింద దేశవ్యాప్తంగా రూ. 5,000 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో ప్రత్యేకంగా ‘ఏక్తా మాల్’ నిర్మాణానికి రూ. 200 కోట్లు మంజూరయ్యాయి. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల చీరలు, నిర్మల్ పెయింటింగ్స్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, వరంగల్ డర్రీలు, డోక్రా మెటల్ క్రాఫ్ట్ వంటి జీఐ (GI) ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను ఒకే చోట ప్రదర్శించి విక్రయించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం.

ప్రైవేట్ పరం చేయడంపై ఆగ్రహం

ఇంతటి బృహత్తర ప్రాజెక్టును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టిస్తోందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిస్సహాయ ఆర్టిజన్స్‌కు (Artisans) అండగా నిలవాల్సిన ఈ మాల్‌ను.. అపర్ణ బిల్డర్స్, వంశీరామ్ బిల్డర్స్ వంటి బడా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించి కమర్షియల్ మాల్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై తనకు పలు పిటిషన్లు అందాయని సభ దృష్టికి తీసుకొచ్చారు.

ప్రభుత్వం సమాధానం చెప్పాలి

దశాబ్దాలుగా సనాతన వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న గొంతులేని కళాకారుల హక్కులను కాలరాయడం దారుణమన్నారు. ఏ నిబంధనల ప్రకారం, ఏ ప్రాతిపదికన ఈ మాల్‌ను ప్రైవేట్ బిల్డర్లకు కేటాయించారో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై పూర్తి వివరాలతో కూడిన పిటిషన్‌ను మండలి చైర్మన్‌కు అందజేస్తున్నట్లు శ్రవణ్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement