త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Budget 2026-27 vs 2025-26 | తెలంగాణ బడ్జెట్ 2026-27 వర్సెస్ 2025-26: కేటాయింపుల్లో ఎవరికి పీట? ఎవరికి కోత?

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్ పరిమాణం రూ. 20 వేల కోట్లకు పైగా పెరిగింది. మరి ఏయే శాఖలకు నిధులు పెరిగాయో, ఏయే రంగాలకు కోత పడిందో ఒకసారి పరిశీలిద్దాం.

J

Telangana | Published On Mar 20, 2026, 5.49 pm IST

Telangana Budget 2026-27 vs 2025-26 | తెలంగాణ బడ్జెట్ 2026-27 వర్సెస్ 2025-26: కేటాయింపుల్లో ఎవరికి పీట? ఎవరికి కోత?

సంక్షిప్త సారాంశం

గత ఆర్థిక సంవత్సరం (2025-26) రూ. 3,04,965 కోట్లతో ఉన్న బడ్జెట్‌ను, ఈసారి (2026-27) ఏకంగా రూ. 3,24,234 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం పద్దును ప్రతిపాదించింది. మౌలిక సదుపాయాల కల్పన (మూలధన వ్యయం), విద్య, వైద్యం, పంచాయతీ రాజ్ శాఖలకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా పెరిగాయి. మరోవైపు, వ్యవసాయం, సాగునీటి (ఇరిగేషన్) రంగాలకు కేటాయించే నిధుల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది.

Advertisement

Telangana Budget 2026-27 vs 2025-26 | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వరుసగా నాలుగోసారి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. "పేదవాడి కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి" అన్న మహాత్మా గాంధీ స్ఫూర్తితో 2026-27 బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే, గత బడ్జెట్ (2025-26) తో పోలిస్తే తాజా బడ్జెట్‌లో ప్రాధాన్యతలు మారాయి. కొన్ని కీలక శాఖలకు నిధుల వరద పారగా, మరికొన్ని శాఖలకు కేటాయింపులు తగ్గాయి.

బడ్జెట్ స్వరూపం: గత ఏడాదితో పోలిస్తే..

గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రాష్ట్ర మొత్తం బడ్జెట్ రూ.3,04,965 కోట్లు కాగా.. ప్రస్తుత 2026-27 బడ్జెట్ అంచనాను రూ.3,24,234 కోట్లకు పెంచారు. అంటే బడ్జెట్ పరిమాణం సుమారు రూ.19 వేల కోట్లకు పైగా పెరిగింది. ఇక రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆస్తుల సృష్టి కోసం చేసే 'మూలధన వ్యయం' (Capital Expenditure) గత ఏడాది రూ.36,504 కోట్లు ఉండగా.. ఈసారి దానిని ఏకంగా రూ.47,267 కోట్లకు భారీగా పెంచడం విశేషం.

నిధులు పెరిగిన ప్రధాన రంగాలు (విద్యా, వైద్యానికే పెద్దపీట)

మానవ వనరుల అభివృద్ధికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చింది.

విద్యా రంగం: గత ఏడాది విద్యకు రూ.23,108 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని రూ.26,674 కోట్లకు పెంచారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, బ్రేక్ ఫాస్ట్ పథకాలకు నిధులు పెంచడమే ఇందుకు కారణం.

వైద్య, ఆరోగ్య శాఖ: ప్రజల ఆరోగ్య రక్షణ కోసం గత బడ్జెట్‌లో రూ.12,393 కోట్లు ఇవ్వగా, ఇప్పుడు దానిని రూ.13,679 కోట్లకు పెంచారు.

పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి: పల్లెల అభివృద్ధి కోసం గత ఏడాది రూ.31,605 కోట్లు కేటాయించగా, ఈసారి దాన్ని రూ.33,688 కోట్లకు పెంచారు.

ఐటీ & పురపాలక శాఖలు: ఐటీ రంగానికి గత ఏడాది రూ.774 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.875 కోట్లకు పెరిగింది. అలాగే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.17,677 కోట్ల నుంచి రూ.17,907 కోట్లకు నిధులు పెరిగాయి.

మహిళా శిశు సంక్షేమం: గత బడ్జెట్‌లో రూ.2,862 కోట్లు ఉండగా, తాజా బడ్జెట్‌లో రూ.3,143 కోట్లకు పెంచారు.

నిధులు తగ్గిన కీలక రంగాలు ఇవే

కొన్ని కీలకమైన మౌలిక రంగాలకు, వ్యవసాయానికి ఈసారి నిధుల కేటాయింపుల్లో స్వల్ప కోత పడింది.

వ్యవసాయ రంగం: గత బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు అత్యధికంగా రూ.24,439 కోట్లు కేటాయించారు. అయితే తాజా బడ్జెట్‌లో ఈ కేటాయింపు రూ.23,179 కోట్లకు తగ్గింది. అంటే సుమారు రూ.1,260 కోట్ల మేర వ్యవసాయ బడ్జెట్ తగ్గింది.

నీటిపారుదల (ఇరిగేషన్) శాఖ: గత ఏడాది ప్రాజెక్టుల కోసం రూ.23,373 కోట్లు కేటాయించగా, ఈసారి దానిని రూ.22,615 కోట్లకు స్వల్పంగా తగ్గించారు.

పరిశ్రమల శాఖ: పరిశ్రమల రంగానికి గత ఏడాది రూ.3,527 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.3,490 కోట్లకు తగ్గించడం గమనార్హం.

పలు రంగాల్లో రెండు బడ్జెట్ల కేటాయింపులు (రూ.కోట్లలో)

Advertisement

తాజావార్తలు

Advertisement