త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GCC Companies Hyderabad | తెలంగాణలో ‘జీసీసీ’ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

తెలంగాణ ఐటీ రంగం దూసుకుపోతోంది. కేవలం 20 నెలల్లోనే 150 గ్లోబల్ సెంటర్ల ఏర్పాటుతో ఏకంగా 1.5 లక్షల మందికి ఉపాధి దక్కింది. జేఎల్‌ఎల్ ఎంట్రీతో మరో 1600 కొలువులు రానున్నాయి.

J

Hyderabad | Published On Aug 6, 2026, 10.00 pm IST

GCC Companies Hyderabad | తెలంగాణలో ‘జీసీసీ’ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రియల్ ఎస్టేట్ దిగ్గజం 'జేఎల్‌ఎల్ (JLL)' తన గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (GCC)ను ప్రారంభించింది. గత 20 నెలల్లో తెలంగాణలో 150 కొత్త జీసీసీలు ఏర్పాటయ్యాయని, వీటి ద్వారా 1.5 లక్షల మందికి ఉపాధి లభించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాబోయే రెండేళ్లలో జేఎల్‌ఎల్ సంస్థ ఫైనాన్స్, హెచ్‌ఆర్, అనలిటిక్స్ విభాగాల్లో 1,600 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. దేశవ్యాప్తంగా కార్యాలయాల లీజింగ్‌లో (Office Leasing) హైదరాబాద్ 16 శాతం జాతీయ వాటాతో అగ్రగామిగా దూసుకుపోతోంది.

Advertisement

GCC Companies Hyderabad | త్రినేత్ర.న్యూస్ : ఎవరెన్ని చెప్పినా.. ఐటీ (IT) రంగంలో హైదరాబాద్ (Hyderabad) స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ప్రపంచస్థాయి రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ దిగ్గజం 'జేఎల్‌ఎల్ (JLL)' హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో తమ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ (GCC)ను గురువారం ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. రాష్ట్రంలో ఐటీ రంగం సాధిస్తున్న ప్రగతిపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

20 నెలల్లో 1.5 లక్షల ఉద్యోగాలు..

పెట్టుబడులకు అనువైన ప్రాంతాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తించి, ఇతర కంపెనీలకు సిఫారసు చేసే జేఎల్‌ఎల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ.. ఇప్పుడు తమ సొంత జీసీసీ కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం నగర సత్తాకు నిదర్శనమని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు. గడిచిన 20 నెలల కాలంలోనే తెలంగాణలో కొత్తగా 150 గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు ఏర్పాటయ్యాయని, వీటి ద్వారా ఏకంగా 1.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం సాంప్రదాయ ఐటీ కార్యకలాపాలు వేగంగా మారుతున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ (Automation) వంటివి రంగ ప్రవేశం చేసినప్పటికీ ఇన్నోవేషన్ ఆధారిత జీసీసీల ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదని, అవే భవిష్యత్ ఉపాధికి కేంద్రాలుగా మారుతున్నాయని మంత్రి వివరించారు.

కొత్త ప్రాజెక్టులతో బలమైన పునాది

హైదరాబాద్‌కు అత్యుత్తమ మౌలిక వసతులు, స్కిల్స్ ఉన్న యువత, ప్రభుత్వ ప్రోత్సాహమే జీసీసీల క్యూ కట్టడానికి కారణమని మంత్రి తెలిపారు. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ (ORR) నగర రూపురేఖలను ఎలా మార్చేసిందో.. ఇప్పుడు రాబోతున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR), ఏఐ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి మెగా ప్రాజెక్టులు భవిష్యత్ పెట్టుబడులకు బలమైన పునాది వేస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో డీప్‌టెక్ (DeepTech), సెమీకండక్టర్, బయోటెక్నాలజీ రంగాలకు కావాల్సిన మానవ వనరులను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను వేగవంతం చేసిందన్నారు.

ఆఫీస్ స్పేస్‌లో మనదే పైచేయి!

దేశవ్యాప్తంగా జీసీసీల ఆఫీస్ లీజింగ్ (Leasing) ట్రెండ్‌ను గమనిస్తే.. 2024 నుంచి 2026 మధ్య కాలంలో హైదరాబాద్ జాతీయ స్థాయిలో 16 శాతం వాటాను సొంతం చేసుకుందని శ్రీధర్ బాబు తెలిపారు. అంతేకాదు.. నగరంలో జరుగుతున్న మొత్తం కమర్షియల్ లీజింగ్‌లో కేవలం జీసీసీల వాటాయే 42 శాతానికి చేరడం గమనార్హం.

జేఎల్‌ఎల్ లో 1600 బంపర్ ఆఫర్స్

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటైన జేఎల్‌ఎల్ గ్లోబల్ సెంటర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే.. వచ్చే రెండేళ్లలో దాదాపు 1,600 మందికి ప్రత్యక్షంగా ఐటీ కొలువులు రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జేఎల్‌ఎల్ ఆపరేషన్స్ కు అవసరమైన ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్ (HR), ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ సేవలను ఈ హైదరాబాద్ సెంటర్ నుంచే అందించనున్నారు.

ఈ లాంచింగ్ కార్యక్రమంలో జేఎల్‌ఎల్ ఇండియా సీఈఓ రాధా ధిర్, హైదరాబాద్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పట్నాయక్, గ్లోబల్ సర్వీస్ సెంటర్ హెడ్ ధీరజ్ పోప్లీ, రాష్ట్ర ఐటీ శాఖ సలహాదారు సాయి కృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement