త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Budget 2026-27 | అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక ‘టి-ఫైబర్’ ఇంటర్నెట్.. గ్రిడ్ (GRID) తో నలువైపులా ఐటీ

తెలంగాణ బడ్జెట్‌లో ఐటీ రంగానికి విశేష ప్రాధాన్యం దక్కింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ ఇంటర్నెట్‌కు స్వస్తి పలికి, ఇకపై ప్రభుత్వ రంగ సంస్థ 'టి-ఫైబర్' (T-Fiber) ద్వారానే సురక్షితమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలని సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

J

Telangana | Published On Mar 20, 2026, 1.34 pm IST

Telangana Budget 2026-27 | అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక ‘టి-ఫైబర్’ ఇంటర్నెట్.. గ్రిడ్ (GRID) తో నలువైపులా ఐటీ
Advertisement
  • ఐటీ రంగంలో తెలంగాణ సరికొత్త రికార్డులు
  • బడ్జెట్‌లో కీలక ప్రకటనలు

త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ వినియోగంపై ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఆఫీసుల్లో ఇక 'టి-ఫైబర్' (T-Fiber) దే హవా!

ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ సంస్థల ద్వారా వాడుతున్న ఇంటర్నెట్‌కు భారీగా ఖర్చు అవుతోంది. ఈ ఖర్చును తగ్గించడంతో పాటు, డేటా భద్రతను పెంచే ఉద్దేశ్యంతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'టి-ఫైబర్' (T-Fiber) ద్వారా సురక్షితమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 424 మండలాలలోని 8,888 గ్రామపంచాయతీలకు, 4,800 ప్రభుత్వ సంస్థలకు ఫైబర్ అనుసంధానత కల్పించినట్లు బడ్జెట్‌లో స్పష్టం చేశారు. ఇదే వేగంతో, ఈ సంవత్సరాంతానికి రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ప్రభుత్వ సంస్థలకు టి-ఫైబర్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భారీ లక్ష్యంగా పెట్టుకుంది.

రూ.3.13 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు

ఐటీ రంగంలో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి దేశానికే తలమానికంగా మారిందని ఆర్థిక మంత్రి సగర్వంగా ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1500 కంటే ఎక్కువ ఐటీ/ఐటీఈఎస్ (IT/ITES) కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ రంగంలో వృద్ధిని పెంచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం 1వ, 2వ ఐసీటీ (ICT) విధానాలను ప్రారంభించింది. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇమేజ్ (IMAGE) పాలసీలను కూడా ప్రభుత్వం తీసుకువస్తోంది. ఈ విధానాల ఫలితంగా రాష్ట్ర ఐటీ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే, ఈ రంగం ద్వారా 9.39 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించాయి.

గ్లోబల్ సెంటర్లకు అడ్డాగా హైదరాబాద్

హైదరాబాద్ నగరం గ్లోబల్ కంపెనీలకు ప్రధాన గమ్యస్థానంగా మారింది. భారతదేశంలోని మొత్తం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో (GCCs) సుమారు 20 శాతం హైదరాబాద్‌లోనే ఉండటం విశేషం. గడిచిన 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే నగరంలో 70కి పైగా కొత్త GCCలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రపంచ టెక్ దిగ్గజమైన గూగుల్ కంపెనీ కూడా హైదరాబాద్‌లో తమ 'గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్' ని ఏర్పాటు చేసింది.అయితే, ఐటీ అభివృద్ధి కేవలం హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికే (మాదాపూర్, గచ్చిబౌలి) పరిమితం కాకుండా, నగరం నలువైపులా ఐటీని విస్తరించడానికి ప్రభుత్వం 'గ్రోత్ ఇన్ డిస్పర్షన్' (Growth In Dispersion - GRID) విధానాన్ని ప్రోత్సహిస్తోందని బడ్జెట్‌లో స్పష్టం చేశారు.

మొత్తంగా, ఈ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఐటీ శాఖకు ప్రభుత్వం రూ.875 కోట్లను ప్రతిపాదించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement