త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Budget 2026-27 | తెలంగాణ బడ్జెట్ 2026-27: వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో రవాణా, రోడ్లు, విమానయాన రంగాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇచ్చింది. వరంగల్ విమానాశ్రయం భూసేకరణ పూర్తయిందని, పనులను వేగవంతం చేస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అలాగే, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్ కూడా తుది దశకు చేరుకున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

J

Telangana | Published On Mar 20, 2026, 4.15 pm IST

Telangana Budget 2026-27 | తెలంగాణ బడ్జెట్ 2026-27: వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
Advertisement

Telangana Budget 2026-27 | తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో రవాణా, రోడ్లు, భవనాల శాఖకు భారీగా నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే, పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థల పెంపునకు కూడా ప్రాధాన్యతనిచ్చారు . ఈ ఏడాది ఈ శాఖకు మొత్తంగా రూ.12,789 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది.

వరంగల్ ఎయిర్‌పోర్టు కలకు లైన్ క్లియర్

ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న వరంగల్ విమానాశ్రయం నిర్మాణానికి తాజా బడ్జెట్‌లో స్పష్టమైన ముందడుగు పడింది. వరంగల్ విమానాశ్రయం కోసం అవసరమైన భూసేకరణను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని, త్వరలోనే నిర్మాణపు పనులను వేగవంతం చేస్తామని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ప్రకటించారు. ఇది ఉత్తర తెలంగాణ ప్రజలకు, వ్యాపార వర్గాలకు ఒక శుభవార్త. అదేవిధంగా, మరో ముఖ్యమైన ప్రాజెక్టు అయిన ఆదిలాబాద్ విమానాశ్రయ మాస్టర్ ప్లాన్ రూపకల్పన కూడా దాదాపు పూర్తయిందని, ప్రస్తుతం ఇది తుది దశలో ఉందని బడ్జెట్‌లో స్పష్టం చేశారు. ఈ రెండు ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక రంగాలు మరింత పుంజుకోనున్నాయి.

కొత్త విధానంలో రోడ్ల నిర్మాణాలు (HAM)

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్లు, భవనాల (R&B) శాఖ పరిధిలోని రహదారులన్నింటినీ 'హైబ్రిడ్ యాన్యుటీ మోడ్' (HAM - Hybrid Annuity Mode) విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీని ద్వారా రహదారుల నిర్మాణం, నిర్వహణ మరింత నాణ్యంగా జరగనుంది. అంతేకాకుండా, నగర రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న 'రీజినల్ రింగ్ రోడ్డు' (Regional Ring Road) నిర్మాణంతో పాటు సమాంతరంగా 'రీజినల్ రింగ్ రైలు'ను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ రాయితీలు

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని బడ్జెట్‌లో తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన విధానం కింద ఏకంగా 1 లక్ష 6 వేల ఈవీలకు రూ.856 కోట్ల 98 లక్షల పన్ను మినహాయింపులు ఇచ్చారు.అలాగే, వ్యవసాయ, ఆటో వంటి త్రిచక్ర వాహనాలకు (మొత్తం 11.75 లక్షల వాహనాలకు) రూ.105 కోట్ల 16 లక్షల మేర పన్ను రాయితీలు మంజూరు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతున్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం వెనుకడుగు వేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు.

డిజిటల్ సేవల విస్తరణ

రాష్ట్ర రవాణా శాఖ పరిధిలో ప్రస్తుతం 1 కోటి 82 లక్షల రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయి. ప్రజలకు రవాణా సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు డిజిటల్ విధానాలను అమలు చేస్తున్నారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) అభివృద్ధి చేసిన 'సారథి', 'వాహన్' వంటి జాతీయ స్థాయి పోర్టల్స్‌ను రాష్ట్రంలోనూ వినియోగిస్తున్నారు. వచ్చే ఆరు నెలల్లో 'వాహన్' సేవలను పూర్తి స్థాయిలో పౌరులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement