త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Assembly sessions 2026 | సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఆ ‘కీలక’ తీర్మానంపైనే అందరి దృష్టి

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్నాయి. చట్టసభల్లో పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించే చరిత్రాత్మక తీర్మానం రానుంది.

J

Telangana | Published On Aug 29, 2026, 8.24 pm IST

Telangana Assembly sessions 2026 | సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఆ ‘కీలక’ తీర్మానంపైనే అందరి దృష్టి
Advertisement
  • సెప్టెంబర్ 7, 2026 సోమవారం ఉదయం 10 గంటల నుంచి తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం
  • సభ్యులకు అధికారిక సర్క్యులర్ జారీ చేసిన కార్యదర్శి రెండ్ల తిరుపతి
  • ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించేలా సభలో కీలక తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్స్
  • కృష్ణా, గోదావరి జలాలు, 22ఏ భూ సమస్యలు తదితర ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చలు
  • కేసీఆర్ రాకపై ఉత్కంఠ

Telangana Assembly sessions 2026 | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7 (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి అసెంబ్లీ, శాసన మండలి వర్షాకాల సమావేశాలు ఏకకాలంలో ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అసెంబ్లీ హాల్‌లో జరిగే ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరు కావాలని స్పీకర్ ఆదేశాల మేరకు శాసనసభ సెక్రటరీ రెండ్ల తిరుపతి అధికారికంగా సర్క్యులర్ జారీ చేశారు.

21 ఏళ్లకే ఎమ్మెల్యే ఛాన్స్

ఈ దఫా సమావేశాల్లో అందరి దృష్టీ ఓ చరిత్రాత్మక తీర్మానంపైనే నెలకొంది. చట్టసభలు (లోక్‌సభ, అసెంబ్లీ) పోటీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న కనీస వయసు 25 ఏళ్లను, 21 ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది. చట్టసభల్లో యువత ప్రాతినిధ్యం పెరగాలని ఇటీవల టీపీసీసీ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో.. ఈ తీర్మానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే గనుక ఆమోదం పొందితే దేశ రాజకీయాల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో తెలంగాణ కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లవుతుంది.

సెప్టెంబర్ 2 లోపు ప్రశ్నల సమర్పణ

సమావేశాల్లో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలకు సంబంధించి సెప్టెంబర్ 2వ తేదీలోపు ప్రశ్నలు పంపాలని ఎమ్మెల్యేలను సెక్రటేరియట్ కోరింది. రూల్ 39 (Rule 39) ప్రకారం సభ్యులు అడిగే ఈ ముందస్తు ప్రశ్నలను సంబంధిత శాఖలకు పంపి మంత్రులు సమాధానాలు సిద్ధం చేసుకోనున్నారు. కాగా, ఈ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది తొలి రోజు సభ ముగిసిన తర్వాత జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) భేటీలో ఫైనల్ చేస్తారు.

చర్చకు రానున్న హాట్ టాపిక్స్.. కేసీఆర్ వస్తారా?

ఈ వర్షాకాల సమావేశాల్లో 22ఏ భూ సమస్యలు, కృష్ణా-గోదావరి జలాల వినియోగం, సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వాడివేడి చర్చలు జరగనున్నాయి. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతుండగా, దీటుగా బదులిచ్చేందుకు అధికార పక్షం కౌంటర్ వ్యూహాలు రచిస్తోంది. అన్నిటికీ మించి, గతంలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్లుగా ఈ సమావేశాలకు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement