త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Activists Identification | ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల స్థలం, ఆసరా పెన్షన్, హెల్త్ కార్డు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. 250 గజాల ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులపై కమిటీతో కీలక చర్చలు జరిపారు.

J

Telangana | Published On Aug 29, 2026, 5.21 pm IST

Telangana Activists Identification | ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల స్థలం, ఆసరా పెన్షన్, హెల్త్ కార్డు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం
Advertisement
  • సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో కేకే, కోదండరామ్ నేతృత్వంలోని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ భేటీ
  • ఉద్యమకారుల గుర్తింపు, వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా నివేదికను సీఎంకు అందజేసిన కమిటీ
  • దరఖాస్తుల స్వీకరణ కోసం వెంటనే పోర్టల్, వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
  • 250 గజాల ఇంటి స్థలం, హెల్త్ కార్డులు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం తదితర డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లిన నేతలు

Telangana Activists Identification | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో అహర్నిశలు శ్రమించిన ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే) నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎంను కలిసింది. ఈ సందర్భంగా ఉద్యమకారుల గుర్తింపుతో పాటు వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ కీలక సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వద్ద సుమారు 13 వేల మందికి పైగా ఉద్యమకారులు, వివిధ జేఏసీలు, ప్రజాసంఘాలు, కళాకారులతో నిర్వహించిన విస్తృత స్థాయి భేటీ వివరాలను కమిటీ సభ్యులు సీఎంకు వివరించారు. వారి నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన 'ఉద్యమకారుల వర్గీకరణ' ముసాయిదా నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.

ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటుకు ఆదేశం

ఉద్యమకారుల త్యాగాలను గుర్తిస్తూ.. వారికి తగిన గౌరవం దక్కేలా చూడాలని సీఎం రేవంత్ అధికారులకు స్పష్టం చేశారు. గుర్తింపు కసరత్తులో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అప్లికేషన్ల స్వీకరణ కోసం వెంటనే ఒక అఫీషియల్ వెబ్‌సైట్, ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని, డిజిటల్ విధానంలో దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. జిల్లాల వారీగా కో-ఆర్డినేషన్ చేసుకుంటూ కమిటీకి అవసరమైన పూర్తి పరిపాలనా వనరులను సమకూర్చాలని ఉన్నతాధికారులకు తేల్చిచెప్పారు.

కమిటీ ప్రధాన డిమాండ్లు ఇవే..

ఉద్యమకారుల సంక్షేమం కోసం పలు కీలక డిమాండ్లను ఈ సమావేశంలో కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. ప్రధానంగా ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల నివాస స్థలం, ఆసరా పెన్షన్, హెల్త్ కార్డులు (Health Cards), ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవ గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం జీవో నెం. 679 ద్వారా ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వేయడంతో పాటు, తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించినందుకు కేకే, కోదండరామ్ తదితరులు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి సహా వి.పి. గౌతమ్, ఎస్. శ్రీధర్ తదితర ఐఏఎస్ అధికారులు, ఓఎస్డీలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement